breaking news
thammileru project
-
తమ్మిలేరుపై ఆధునికీకరుణ
మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకటైన తమ్మిలేరు ఆధునికీకరణ వైపు అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ జలాశయం పనులపై ఇప్పుడు అధికారులు దృష్టిసారించారు. నవంబర్లో పనులు చేపట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. సాక్షి, పశ్చిమగోదావరి(చింతలపూడి) : తమ్మిలేరు ప్రాజెక్టు ఆధునికీరణ నిమిత్తం జపాన్ ఆర్థిక బ్యాంక్ నుంచి గత ఏడాది రూ.16.91 కోట్ల రుణం మంజూరైంది. అయితే గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు మొదలు కాలేదు. ఇప్పుడు అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి కమిషనరేట్ ఆఫ్ టెండర్స్(సీఓటీ)కి పంపించారు. వీటిని ఉన్నతాధికారులు పరిశీలించి ఖరారు చేస్తారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టెండర్ల ప్రక్రియలో స్వల్ప జాప్యం జరిగే ఆస్కారం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 329 అడుగుల మేర నీరు చేరింది. వర్షాలు కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. టెండర్లు ఖరారు అయితే నవంబర్, డిసెంబర్ నుంచి పనులు చేపట్టే అవకాశం ఉంది. మంజూరు అయిన నిధులతో జలాశయ ఆనకట్ట, ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలతోపాటు ప్రధాన పంట కాల్వలు, ఇరిగేషన్ కార్యాలయాలనూ నిర్మించనున్నారు. మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు చేపడతారు. వాటిలో మన జిల్లాలోని తమ్మిలేరు ప్రాజెక్టుతోపాటు దీనికింద ఉన్న కొన్ని చెరువుల ఆధునికీకరణ పనులూ చేపడతారు. 30వేల ఎకరాలకు లాభం పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 30 వేల ఎకరాలకుపైగా సాగునీరు అందిస్తున్న తమ్మిలేరు ప్రాజెక్టు ప్రస్తుతం మెరక తేలి ఉంది. దీంతో 3 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ఇప్పుడు రెండు టీఎంసీల నీరూ నిల్వ ఉండని దుస్థితి నెలకొంది. చింతలపూడి ఎత్తిపోతల పధకం నీరు ప్రాజెక్టులోకి మళ్లించే నాటికన్నా జలాశయంలో ఆక్రమణలు తొలగించి, పూడిక తీసి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్ళు దాటిపోయినా ఇంత వరకూ పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టలేదు. 1996లో వచ్చిన పెను తుపానుకు ప్రాజెక్టు గట్టు రివిట్మెంట్ పూర్తిగా ధ్వంసమైంది. అప్పట్లో రూ.1.55 కోట్లతో మరమ్మతులు చేశారు. గట్టు బలహీనం ప్రస్తుతం జలాశయం గట్టు బలహీనంగా ఉంది. గట్టుపైకి చేరుకునే మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. సాగునీరు అందించే పంట కాలువలూ దెబ్బతిన్నాయి. రిజర్వాయర్ కుడి కాలువ 6.508 కిలోమీటర్లు, ఎడమకాలువ 10.185 కిలోమీటర్లు, మంకొల్లు కాలువ పొడవు 3.38 కిలోమీటర్లు. వీటిని ఆధునికీకరించనున్నారు. ఈ జలాశయం వద్ద కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ 6.4 కిలోమీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు,74 మీటర్ల ఎత్తులో మట్టికట్టను నిర్మించారు. మట్టికట్టనూ పటిష్టపరచడానికి చర్యలు తీసుకుంటున్నారు. 2006లోనే ప్రతిపాదనలు ఇరిగేషన్ అధికారులు తమ్మిలేరు అభివృద్ధికి 2006లో రూ.23 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ తరువాత జపాన్కు చెందిన ఇంటర్నేషనల్ కో–ఆపరేటివ్ ఎయిడ్ (జేఐసీఏ) అనే సంస్థ నిధులతో తమ్మిలేరు ఆధునికీకరణకు అన్ని అనుమతులు వచ్చాక నిధుల విడుదలకు నిర్దేశించిన సమయం పూర్తి కావడంతో మరమ్మతులు ప్రారంభం కాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనికి కేంద్ర జలసంఘం అనుమతులు లభించి నిధులు మంజూరు కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, రాష్ట్ర విభజన జరగడంతో ఈ నిధులపై మళ్ళీ నీళ్ళు వదులు కోవలసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం తమ్మిలేరు ప్రాజెక్టును అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తించింది. అనంతరం అంతర్రాష్ట్ర కోటాలో తమ్మిలేరు అభివృద్ధికి నిధులు కేటాయించాలని 2015లో మరోసారి కేంద్ర జలసంఘం అనుమతి కోసం జిల్లా ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. జపాన్ బృందం ప్రాజెక్టు సందర్శన ఈ నేపథ్యంలోనే 2016 ఫిబ్రవరిలో జపాన్ ఆర్థిక బ్యాంకు బృందం ప్రాజెక్టును పరిశీలించి వెళ్లింది. తమ్మిలేరుతో పాటు జిల్లాలోని 20 మైనర్ ఇరిగేషన్ చెరువులనూ పరిశీలించింది. ఆ తర్వాత జపాన్ బ్యాంకు రుణం మంజూరు చేసింది. ఉద్యోగుల క్వార్టర్లు శిథిలం తమ్మిలేరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇక్కడ ఇరిగేషన్ డీఈ కార్యాలయంతోపాటు, ఒక గెస్ట్హౌస్, అధికారులు, సిబ్బంది కోసం భవనాలు నిర్మించారు. సుమారు ఏడు కార్యాలయాలను వేర్వేరుగా నిర్మించారు. ప్రాజెక్టు పర్యవేక్షణకు వచ్చే ఉన్నతాధికారులు ఇక్కడున్న గెస్ట్హౌస్లోనే విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ ఇరిగేషన్ శాఖకు చాలా ఎకరాల మేర సొంత స్ధలం కూడా ఉంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత నీటిపారుదల శాఖకు చెందిన ఉద్యోగులతో పాటు, సెక్షన్ కార్యాలయాన్ని ఏలూరుకు తరలించడంతో అంతవరకూ ఉద్యోగులు నివాసం ఉన్న భవనాలు ఖాళీ అయ్యాయి. ఆ తరువాత సంబంధిత అధికారులెవరూ ఈ భవనాలను గురించి పట్టించుకో లేదు. దీంతో అవి శిథిలమయ్యాయి. వీటిల్లోని కలప దొంగలపరమైంది. కబ్జాలో స్థలాలు ప్రస్తుతం కొన్ని భవనాల్లో రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. ఇరిగేషన్ శాఖ విలువైన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. నిజానికి వరదలు, తుపాన్లు సంభవించినప్పుడు అత్యవసర సమయాల్లో ప్రాజెక్టును అనుక్షణం కనిపెట్టుకుని ఉండాలి. అందుకోసం ఇక్కడ అధికార యంత్రాంగం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. సెక్షన్ కార్యాలయం ఏలూరు తరలించడంతో తమ్మిలేరులో ఆక్రమణలు పెరిగాయి. ప్రస్తుతం మంజూరైన నిధులతోపాటు ప్రభుత్వం మరికొన్ని నిధులు జోడించి ఈ క్వార్టర్లను ఆధునికీకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. టెండర్లు ఖరారు కావాల్సి ఉంది జపాన్ బ్యాంకు నుంచి నిధులు మంజూరయ్యాయి. ఉన్నతాధికారులు టెండర్లు ఖరారు చేయాలి. నవంబర్ నాటికి పనులు మొదలయ్యే అవకాశం ఉంది. – ఎం.అప్పారావు, ఇరిగేషన్ డీఈ, తమ్మిలేరు పనులు ప్రారంభించాలి తమ్మిలేరు అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించాలి. ప్రాజెక్టు మరమ్మతు పనులు చేపట్టి చాలా ఏళ్లయింది. తమ్మిలేరుకు శాశ్వత సాగునీటి జలాలను తరలించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి తమ్మిలేరుకు సాగు నీరు అందించాలి. – జంగా మురళీధర్రెడ్డి, తమ్మిలేరు సాగునీటి సంఘం చైర్మన్ -
తమ్మిలేరుపై నీలినీడలు
తమ్మిలేరు జలాశయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సర్కారు నిర్లక్ష్యం శాపంగా మారింది. ఫలితంగా జిల్లాతోపాటు కృష్ణాజిల్లాలోని 30వేల ఎకరాలకుపైగా ఆయకట్టు భవిత ప్రశ్నార్థకంగా మారింది. చింతలపూడి : తమ్మిలేరు రిజర్వాయర్ నిర్మించి 40 ఏళ్లు పూర్తయినా ఇప్పటివరకూ పూర్తిస్థాయి మరమ్మతులకు నోచుకోలేదు. 1996 తర్వాత ఈ ప్రాజెక్టు అభివృద్ధి అంశం మరుగున పడింది. కనీసం ఈసారి బడ్జెట్లోనైనా దీని అభివృద్ధికి నిధులు కేటాయించాలనే డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. అన్నీ సమస్యలే: ప్రస్తుతం రిజర్వాయర్ గట్టు బలహీనంగా ఉంది. గట్టుపైకి చేరుకునే మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. రివిట్మెంట్ కూడా అంతంత మాత్రంగా ఉంది. సాగునీరు అందించే పంట కాలువలూ దెబ్బతిన్నాయి. రిజర్వాయర్ కుడి కాలువ 6.508 కిలోమీటర్లు, ఎడమకాలువ 10.185 కిలోమీటర్లు, మంకొల్లు కాలువ పొడవు 3.38 కిలోమీటర్లు. వీటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ జలాశయం వద్ద కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ 6.4 కిమీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 74 మీటర్ల ఎత్తులో మట్టికట్టను నిర్మించారు. ఎంతగా కృషి చేసినా..!: తమ్మిలేరు అభివృద్ధి కోసం 2006లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వం ఎంతగా కృషి చేసినా ఫలితం దక్కలేదు. అప్పట్లో ఇరిగేషన్ అధికారులు రూ.24కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తరువాత జపాన్కు చెందిన ఇంటర్నేషనల్ కో–ఆపరేటివ్ ఎయిడ్ (జేఐసీఏ) అనే సంస్థ నిధులతో తమ్మిలేరు మరమ్మతులు చేపట్టారు. అయితే అన్ని అనుమతులు వచ్చాక నిధుల విడుదలకు నిర్దేశించిన గడువు పూర్తి కావడంతో మరమ్మతులు నిలిచిపోయాయి. దీంతో తిరిగి నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీనికి కేంద్ర జలసంఘం అనుమతులు లభించి నిధులు మంజూరు కోసం ఎదురు చూస్తున్న సమయంలో రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, గత ఏడాది రాష్ట్ర విభజన కూడా జరిగిపోవడంతో ఈ నిధులపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. విభజన శాపం: రాష్ట్రంలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన తమ్మిలేరుకు రాష్ట్ర విభజన శాపంగా మారింది. విభజన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోవడంతో విభజన చట్టంలో దానికి చోటు దక్కలేదు. విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం తమ్మిలేరుకు వచ్చే నీటిని నిలిపి వేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మెట్ట రైతుల కల్పతరువైన ఈ రిజర్వాయర్కు శాశ్వత సాగునీరు ఎండమావిలా మారింది. పరిశీలనతో సరి!: రాష్ట్ర విభజన అనంతరం తమ్మిలేరు ప్రాజెక్టును అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా గుర్తించడంతోపాటు అంతర్రాష్ట్ర కోటాలో అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ దశలో గత ఏడాది ఫిబ్రవరిలో జపాన్ బృందం ప్రాజెక్టును పరిశీలించి వెళ్లింది. ఆ తర్వాత సర్కారు పట్టించుకోకపోవడంతో జపాన్ నిధులు వచ్చేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇందిరాసాగర్ ఆశలు ఆవిరేనా!: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2005లో మంజూరు చేసిన ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం ఆశలు ప్రస్తుతం ఆవిరైనట్టే కనిపిస్తోంది. గోదావరి జలాలను మెట్ట ప్రాంతంలోని తమ్మిలేరు ప్రాజెక్టుతోపాటు, చెరువుల్లోకి మళ్లించి 36 వేల ఎకరాలకు నీరు అందించడానికి ఖమ్మం జిల్లా , అశ్వారావుపేట మండలం రుద్రమకోట వద్ద ఇందిరాసాగర్ ఎత్తిపోతల ప«థకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ ఆకస్మిక మరణం తర్వాత ప్రభుత్వం ఈ పథకానికి నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశాక విభజన అనంతరం ప్రాజెక్టు ప్రాంతం ఆంధ్రాలోనూ, కాల్వలు తెలంగాణ భూ భాగంలోకి వెళ్లడంతో ప్రాజెక్టును ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. దీంతో ఈ ప్రాజెక్టు కోసం కొన్న భారీ పైపులు, మోటార్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. చింతలపూడి ఎత్తిపోతలే శరణ్యం: తమ్మిలేరు ప్రాజెక్టుకు పూర్వ వైభవం రావాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి తమ్మిలేరుకు గోదావరి జలాలను మళ్లించాలి. నా హయాంలోనే వైఎస్సార్ ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ పథకం తెలంగాణలో ఉండటంతో నీరు వచ్చే అవకాశాలు తక్కువ. చింతలపూడి పథకం ఒక్కటే మెట్ట రైతులకు శరణ్యం. ఘంటా మురళీరామకృష్ణ, మాజీ శాసన సభ్యులు, చింతలపూడి ఈసారి నిధులు వస్తాయి తమ్మిలేరు ప్రాజెక్టు అభివృద్ధికి ఈ సారి తప్పకుండా నిధులు మంజూరు అవుతాయి. ప్రభుత్వం జపాన్ బృందంతో చర్చలు జరుపుతోంది. జిల్లాకు చెందిన ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఇటీవల ఢిల్లీ వెళ్ళి నిధుల కోసం యత్నాలు చేశారు. ఎం.అప్పారావు, ఇరిగేషన్ డీఈ , తమ్మిలేరు