Telangana Recipes
-
శతాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ రుచులు
తెలంగాణ వంటకాల వడ్డన.. 3 రోజుల పాటు ఆహ్వానితులకు భోజనాలు హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో మూడు రోజుల పాటు జరగనున్న ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థులతో పాటు ఆహ్వానితులకు తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు. ఇందుకు సంబంధించిన మెనూ సిద్ధం చేయాలని పలువురు సీనియర్ అధ్యాపకులు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటున్న విద్యార్థులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులతో కలసి ప్రతి రోజు 20వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రతి రోజు మధ్యాహ్నం మాత్రమే భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. భోజనాల నిమిత్తం విద్యార్థులకు ప్రత్యేక టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. హాస్టల్ విద్యార్థులకు వారి వారి హాస్టల్ మెస్లలో భోజనాలు ఏర్పాటు చేయనుండగా, డే స్కాలర్లు, ఇతర ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లతో భోజన సదుపాయం కల్పించనున్నారు. నాన్వెజ్ వంటకాలు: ఓయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యే వారందరికీ కోడి కూడా, తలకాయ కూర, బోటీ, వంటి నాన్వెజ్ వంటకాలను రుచి చూపించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. దీనిపై సంబంధిత శతాబ్ది ఉత్సవాల ప్రత్యేకాధికారిని సంప్రదించగా ‘ఏయే వంటకాలు సిద్ధం చేయాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేద’న్నారు. -
తెలంగాణ వంట బ్రాండ్గా మారాలి
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: ప్రపంచంలోనే ఎక్కడా దొరకని అద్భుతమైన వంటకాలు తెలంగాణ ప్రత్యేకమని, వీటికి విశ్వవ్యాప్త ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి బి.వెంకటేశం అన్నారు. ఫిలింనగర్లో ఉన్న ‘కారంపొడి’కి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రెస్టారెంట్ పురస్కారం లభించిన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉడిపి, కామత్ హోటల్స్ స్థాయిలో మన వంటకాలకు ఏ ప్రాంతంలోనైనా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ సాధించేందుకుగాను ఒక క్యులినరీ పాలసీని రూపొందించామన్నారు. ‘కాకతీయ థాలి’ పేరుతో తెలంగాణ వంటకాల ఫుడ్ఫెస్టివల్ను ప్రారంభించిన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ ఛైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ రుచులలో మన వంటకాలకు సాటిలేదని, వీటి కోసం ప్రత్యేకంగా రెస్టారెంట్స్ ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గదన్నారు. కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు శ్యామ్, అజయ్, కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.