breaking news
TEKKALI Area Hospital
-
ఆస్పత్రిలో పాము హల్చల్
టెక్కలి రూరల్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ టెక్కలి ఏరియా ఆస్పత్రిలో గురువారం ఒక పాము హల్చల్ చేసింది. ఆస్పత్రిలోని ట్రామా వార్డులో రోగులు కిక్కిరిసి ఉన్న సమయంలో పాము కనిపించడంతో అంతా భయంతో బయటకు ఉరుకులు పరుగులు తీశారు. వార్డులోని మరుగుదొడ్డికి వెళుతూ ఇది కనిపించడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు పాముని హతమార్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం వార్డుల్లోని రోగులు మాట్లాడుతూ మరుగుదొడ్డిలో లైట్లు, తలుపులు లేవని వివరించారు. దీని వల్లే పాములు వస్తున్నాయని వాపోయారు. -
టెక్కలి ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
టెక్కలి(శ్రీకాకుళం): ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు మృతి చెందాడంటూ అతని కుటుంబీకులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన ఈ ఘటనలో ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానిక భూలోకమాతవీధికి చెందిన నవీన్కుమార్ ఆదివారం రాత్రి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. నవీన్ ఆస్పత్రిలో చనిపోయాడు. అయితే, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే చనిపోయాడని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. వారు ఏరియా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పటంతో విరమించారు. తిరిగి సోమవారం ఉదయం ఆస్పత్రి వద్దకు చేరుకుని నవీన్కు వైద్యం అందించిన వైద్యులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని శాంతపరిచేందుకు ప్రయత్నిస్తున్నా వెనక్కి తగ్గటం లేదు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ఆశలు తీరేదెప్పుడు?
టెక్కలి:ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగుల ఆశలు తీరలేదు. వారికష్టాలు చూసి చలించిన ట్రైమాక్స్ సంస్థ ఆర్థిక సాయం చేసినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడివారికి ఆ ఫలం అందలేదు. అధిక మొత్తాలు వెచ్చించి సుదూర ప్రాంతానికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఈ ప్రాంత కిడ్నీ రోగుల బాధలు తీర్చడానికి 2012 అక్టోబర్ లో ట్రైమాక్స్ సంస్థ అధినేత కోనేరు ప్రసాదరావు టెక్కలి ఏరియా ఆసుపత్రిని సందర్శించి డయాలసిస్ ప్రాజెక్టు కోసం కోటి రూపాయలు వెచ్చిస్తామని ప్రకటించారు. డయాలసిస్ యూనిట్ ఏర్పాటు విషయంలో జిల్లా స్థాయి అధికారులు, స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు, ఆసుపత్రి ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రకటించిందే తడవుగా కోటి రూపాయల విలువైన పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. అయితే నెఫ్రాలజీ వైద్యులు, మిగిలిన సిబ్బంది నియామకం, డయాలసిస్ నిర్వహణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పూర్తిగా దృష్టి సారించకపోవడంతో, సుమారు రెండు సంవత్సరాల నుంచి ఆ పరికరాలన్నీ ఆస్పత్రిలో నిర్లక్ష్యంగా మూలుగుతున్నాయి. 2013 సంవత్సరంలో కోనేరు ప్రసాదరావు మరోసారి ఆస్పత్రిని సందర్శించి పరికరాల పరిస్థితి చూసి నివ్వెరపోయారు. అంతేగాకుండా జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో, ఆసుపత్రిలో ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ లక్ష్మణరావుకు విశాఖ కేజీహెచ్లో 20 రోజుల పాటు డయాలసిస్పై శిక్షణనిచ్చారు. మరో ఇద్దరు స్టాఫ్ నర్స్లకు శ్రీకాకుళం రిమ్స్లో శిక్షణ ఇచ్చారు. కానీ ఏడాది పూర్తయినా యూనిట్ ప్రారంభం కాకపోవడంతో వారి శిక్షణ కూడా వృధా అయింది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు మంత్రి హోదాలో ఈ డయాలసిస్ కేంద్రం తెరిపిస్తానంటూ ప్రకటనలు చేశారు. కానీ అది కూడా అమలు కాలేదు. శ్రీకాకుళం రిమ్స్లో డయాలసిస్ నిర్వహిస్తున్న ‘బీబ్రాన్’ సంస్థకు టెక్కలి డయాలసిస్ నిర్వాహణ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు చేశారు. వారు నిరాకరించడంతో ‘శాండర్’ అనే సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆస్పత్రి ఉన్నతాధికారులు వెల్లడించారు. అది కూడా విఫలమవ్వడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఓ వితరణశీలి సామాజిక స్పృహతో కిడ్నీ రోగుల కోసం కోటి రూపాయల విలువైన డయాలసిస్ పరికరాలు అందజేస్తే వాటిని నిర్వహించడంలో అటు ప్రజాప్రతినిధులు గాని అధికార యంత్రాంగం గాని పూర్తిగా విఫలం కావడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రిమ్స్లో మాత్రమే ఈ డయాలసిస్ కేంద్రం ఉండడంతో, జిల్లా నలుమూలలకు చెందిన కిడ్నీ రోగులు డయాలసిస్కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు మూలకు చేరిన డయాలసిస్ను ప్రారంభించే ప్రయత్నాలు చేపడితే మంచిది.