breaking news
Pragathi Yadhati
-
న్యూయార్క్లో తెలుగు ప్రగతి
షేక్స్పియర్ సంభాషణలు బ్రిటిష్ వాళ్లే బాగా పలుకుతారా? ఒక తెలుగు అమ్మాయి పలకలేదా? పలకగలదు అని నిరూపించింది ప్రగతి. అదీ న్యూయార్క్లో. అక్కడి రంగస్థలం మీద ఇప్పుడు మెరుస్తున్న సంతకం ప్రగతి. ఆమె రచయిత్రి. కవయిత్రి. నాట్యకారిణి. స్త్రీకి విధించే మూసకట్టు పరిధిని ఛేదించగలిగితే అంబరానికి ఎగరొచ్చు అని ఎగిరి చూపిస్తోంది ప్రగతి. ‘‘చదువుకున్నామా, ఉద్యోగంలో చేరామా, పెళ్లి చేసుకున్నామా.. ఈ విధంగానే చాలా మంది ఆలోచనలు సాగుతుంటాయి. నా జీవితమూ ఇంతేనా .. అనుకున్నప్పుడు నాలో ఉన్న తృష్ణ ఏంటో కనుక్కోవాలనే మథనం మొదలైంది. ఆ అన్వేషణే నన్ను న్యూయార్క్ థియేటర్ వైపు నడిపించింది’’ అంటారు ప్రగతి. నాలుగేళ్ల వయసు నుంచి భరతనాట్యం, కథక్ నృత్య రీతులను ఔపోసన పట్టారు. పదహారేళ్లకు అరంగేట్రమ్ ఇచ్చి శాస్త్రీయ నృత్యకారిణిగా పేరుతెచ్చుకున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. విభిన్న అంశాలలో తన ప్రావీణ్యాన్ని వివరిస్తూ– ‘‘నేను, చెల్లెలు వెన్నెల ఏది నేర్చుకోవాలన్నా నాన్న యాధాటి కాశీపతి (సీనియర్ జర్నలిస్ట్), అమ్మ పుష్పలత అడ్డుచెప్పలేదు. న్యూయార్క్కి పై చదువుల కోసమే వెళ్లాను. అక్కడ పాశ్చాత్య నృత్యరీతులైన బెల్లీ డ్యాన్స్, హిప్హాప్, బ్యాలె అండ్ జాజ్, లాటిన్ బాల్రూమ్ డ్యాన్స్.. వంటివన్నీ నేర్చుకున్నాను. ఆ సమయం లో స్నేహితుల ద్వారా అక్కడి ప్రపంచ నాటక రంగాన్ని చూసే ఛాన్స్ దొరికింది. అక్కడి థియేటర్ ఆర్ట్ చూశాక నా ఆలోచనలే మారిపోయాయి. ఆ కళలో ఒదిగిపోయే కళాకారులు అందులో ప్రాణం పెట్టడం చూశాను. ఎన్నాళ్లుగానో వెతుకుతున్న పెన్నిధి కాలికి తగిలినట్టనిపించింది. అంతే, మరేమీ ఆలోచించకుండా లీ స్ట్రాస్బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్సిట్యూట్లో చేరిపోయాను. ఆ తర్వాత ఎమ్సీఎస్ థియేటర్లో ఆర్టిస్ట్కి కావల్సిన మెలకువలన్నీ నేర్చుకున్నాను. న్యూయార్క్లో బంధువులున్నా వారికి నేనెక్కడున్నానో కూడా చెప్పలేదు. చాలా రోజులు గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో తలదాచుకున్నాను అక్కడైతే ఖర్చు తక్కువ అవుతుందని. ఆర్థికసమస్యలు ఎప్పుడూ మనల్ని వెనకడుగు వేసేలా చేస్తాయి. కాకపోతే మన లక్ష్యం ముందు అవి ఎప్పుడూ ఓడిపోతాయి. చేసినవీ... రాసినవీ.. న్యూయార్క్ థియేటర్ ఆర్ట్లో షేక్స్పియర్ నాటకాల్లో ఎక్కువ నటించాను. ఇండియాకు వచ్చే ముందు చేసిన ‘7’ అనే నాటకం నాకు బాగా గుర్తింపు తెచ్చింది. ప్రపంచంలోని ఏడు దేశాల్లోని ఏడుగురు మహిళల గాథల్ని ఈ నాటకంలో చూపించారు. అందులో 27 ఏళ్ల ముక్తార్మై అనే పాకిస్తాన్ మహిళ పాత్ర పోషించాను. ముక్తార్మై కొన్ని బలీయమైన పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకుందామనుకుంటుంది. అలాంటి ముక్తార్మై నిలదొక్కుకొని అదే ఊళ్లో ఓ పాఠశాలను స్థాపించి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ పాత్ర నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఆ నాటకంలో నా పాత్ర చూసినవాళ్లు చాలా మెచ్చుకున్నారు. ‘సెవన్’ నాటకం ప్రపంచంలో మహిళల మీద ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా అనే విషయాలు నాకు అర్థమయ్యేలా చేసింది. నేను రాసిన నాటకం ‘హూజ్ టు బ్లేమ్’ ఇండియన్ సమాజం గురించిన రాసిన స్టోరీ. మన కుటుంబాల్లో ఆడపిల్లలకు మానసిక సమస్య ఉంటే అది బయట పెట్టరు. పిల్లలకు పెళ్లి అవదనో.. తమను అంటరానివాళ్లుగా చూస్తారనో..’ రకరకాల భయాలు. ఇప్పుడు డిప్రెషన్ కారణంగా సెలబ్రిటీలు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్న కథనాలు వింటున్నాం. డిప్రెషన్ను ఎలా డీల్ చేయాలో మనలో చాలా మందికి తెలియదు. రకరకాల మానసిక సమస్యలను ఎలా డీల్ చేయాలో ఆ నాటకంలో చూపించాను. మనసులో ఏ భావాలు కలిగినా రాయడం నాకు చిన్నప్పటి నుంచి ఓ ఆలవాటు. బహుశా మా నాన్నగారి నుంచే ఆ అలవాటు వచ్చి ఉంటుంది. అలా ఇప్పటికి చాలా కవితలు రాసాను. తెలంగాణ యాసలో ‘ఫొటో’ పేరుతో నవల రాశాను. మా పనిమనిషి కూతురు లచ్చిమి లైఫ్ను ఆధారంగా తీసుకొని రాసిన ఈ నవలలో కొంత ఫిక్షన్ జోడించాను. ఇప్పుడు నాటకం మీదే దృష్టంతా. స్త్రీకి శరీరం మాత్రమే లేదు.. న్యూయార్క్లో ఆర్టిస్టుగా సెటిల్ అయిపోతాను అనుకున్నాను. కానీ, నాన్న చనిపోవడంతో ఇండియా వచ్చాను. అప్పుడు గతంలో నాతో ఆయన చెప్పిన మాటలన్నీ గుర్తుకు వచ్చాయి. ‘ఇండియాలో మరాఠీ, బెంగాళీయులు నాటకరంగాన్ని బతికించుకున్నారు. తెలుగులో అంత ఇంప్రూవ్మెంట్ లేదు’ అనేవారు. నాన్న మాట నిలబెట్టడం కోసం ఒంటరిగా ఉన్న అమ్మకు తోడుగా ఇక్కడే ఉండాలనుకున్నాను. ఆర్టిస్టుగా రాణించే అవకాశం ఉన్న పాత్ర రావడంతో తెలుగులో ‘స్క్రీన్ ప్లే’ మూవీ చేశాను. పదమూడున్నర నిమిషాల సీన్ని సింగిల్ టేక్లో చేశాను. మహిళల సమస్యల మీద చేసిన ఈ చిత్రం గత మార్చిలో రిలీజైంది. స్త్రీకి శరీరం మాత్రమే కాదు మెదడు, మనసు, బుద్ధి, ఆత్మ ఉంటాయి. ఈ ముఖ్యమైనవన్నీ వదిలేసి కేవలం ఇక్కడ తెరపై స్త్రీ శరీరానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం వల్ల చాలా మంది ఆర్టిస్టుల నటన కృత్రిమంగా, అసంపూర్ణంగా ఉంటోంది. ఒక పాత్ర పోషించటం అంటే కేవలం శరీరాన్ని చూపటమే కాదు ఆ పాత్ర ఆత్మను, అంతరాత్మను ప్రేక్షకుల ముందు పరచటం. దీని వల్ల వినోదాన్ని మించి జీవితానికి అర్థం, అందం, చెప్పలేని ఆనందం లభిస్తాయి. అలాంటి ఆనందాన్నిచ్చే ఆర్టిస్టుగా నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం’’ అని ప్రగతి యాధాటి వివరించారు. – నిర్మలారెడ్డి -
తన గురించి తెలిశాక వద్దనుకున్నా..
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ తెర మీద తెలుగు అమ్మాయిలు అరుదే. దీనికి తెలుగు సినిమాలో హీరోయిన్లకు, వారి పాత్రలకు ఉన్న ప్రాధాన్యత కూడా ఒక కారణం. అయితే కొంత కాలంగా తెలుగులో సందేశాత్మక చిత్రాల నిర్మాణం పెరిగింది. దీంతో ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిలు వెండితెర వైపు చూస్తున్నారు. నగరంలో పుట్టి పెరిగిన ప్రగతి యాధాటి... విమర్శకుల ప్రశంసలకు నోచుకున్న స్క్రీన్ప్లే సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. టాలీవుడ్ తెరపై సందేశాత్మక చిత్రాల వెల్లువలో భాగంగా ‘స్క్రీన్ ప్లే’ సినిమా రూపుదిద్దుకుంది. ఇప్పటికే 5 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్కు ఎంపికైంది. జైపూర్లో నిర్వహించిన ఫిలింఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. కొన్ని అవార్డులూ దక్కించుకున్న ఈ సినిమాను మహిళా దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో మొదటిసారి హీరోయిన్గా చేస్తూనే నటనలో సహజత్వంతో అందరి ప్రశంసలు పొందింది ప్రగతి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన గురించిన విశేషాలు పంచుకున్నారు. ఆమె మాటల్లోనే... న్యూయార్క్లో నటిగా.. చిన్నప్పటి నుంచి నటన ఇష్టం. 4 సంవత్సరాల వయసులో బాగా డాన్స్ చేసేదాన్ని. సమాజంలో ఏదైనా మార్పు కోసం ప్రయత్నించాలంటే దానికి రచన లేదా నటన ద్వారానే సాధ్యం అని నా నమ్మకం. అందుకే సినిమా రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత న్యూయార్క్లోని లీస్ట్ రాస్ట్బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్కూల్లో 2 సంవత్సరాలు కన్సర్వేటరీ ప్రోగ్రామ్ చేశాను. దానికి ముందే ఎమ్సీఎస్ థియేటర్లో మైసినల్ టెక్నిక్లో శిక్షణ పొందాను. అక్కడే కొన్ని శక్తివంతమైన పాత్రల్లో నటించాను. ‘సెవన్’ అనే అవార్డ్ విన్నింగ్ డాక్యూమెంట్రీ ప్లేలో ముక్తాన్ మహి అనే పాకిస్తానీ మహిళ పాత్రలో నటించాను. అదొక సామూహిక అత్యాచారానికి గురైన మహిళ నిజ జీవిత కథ. తను ఇప్పుడు చదువు నేర్చుకొని ఒక స్కూల్ ప్రారంభించి, మహిళా విద్యకు కృషి చేస్తోంది. ఇండియాకి తిరిగి వచ్చి.. నాన్న చనిపోవడంతో ఇండియా వచ్చేశా.. నాన్న (యాధాటి కాశీపతి) మొదటి నుంచి అభ్యుదయవాది. ఆలోచనా విధానం మార్పు కోసం తన పోరాటం, తపన నాపై చాలా ప్రభావం చూపింది. ఇండియా వచ్చాక సినిమాల్లో కొన్ని అవకాశాలుగా వచ్చినా నా ఆలోచనా విధానానికి దగ్గరగా ఉండే ఒక మంచి బలమైన కథాంశం కోసం కొన్ని కమర్షియల్ సినిమాలను రిజెక్ట్ చేశా. గంగి గోవు పాలు గరిటెడైన చాలు, కడివెడైన నేమి కరము పాలు అన్నట్టు, మంచి పాత్ర ఒక్కటి చేసినా చాలు అనుకుంటాను. అందుకే ఈ సినిమాను ఒప్పకున్నా. ఈ సినిమా అర్థం పర్థం లేని చెత్త ఆలోచనలు జనాల మీద రుద్దదు. ఈ సినిమాలో రాధికగా నా పాత్ర ప్రేమ, కోపం, బాధ, అమాయకత్వం ఇలా పలు రకాల భావోద్వేగాలు ప్రదర్శించాలి. ఈ పాత్రకి న్యాయం చేయడం కోసం బాగా రీసెర్చ్ చేశా. నా నటనను చాలా మంది మెచ్చుకున్నారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పడ్డ కష్టం తాలూకు ప్రతిఫలం ఇక్కడ ఆవిష్కృతమైంది. నిజానికి నా మొదటి సినిమా ఒక పెద్ద దర్శకుడితో చేయాల్సింది, తన గురుంచి తెలిశాక వద్దనుకున్నా. ఏదేమైనా కమర్షియల్ సినిమాలైనా సరే.. అర్ధవంతమైన పాత్రలు అయితే చేయాలనుంది. (చదవండి: కాజల్ అగర్వాల్కు సమన్లు?) మార్పు అంటే అదే.. గాంధీజీ అన్నట్టుగా అర్ధరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా తిరగగలిగే రోజు వస్తుందా? మానసికంగా, శారీరకంగా అమ్మాయిలపైన జరిగే దాడులు ఆగుతాయా? ఇలాంటి సినిమాలు వస్తే జనంలో ఆలోచన పెరుగుతుంది. వినోదం కంటే ఆలోచనే ముఖ్యం అని నా అభిప్రాయం. అన్ని విషయాల్లో సామాజిక సృహ పెరగాలి. అది సినిమాలు, సోషల్ మీడియా ద్వారా జరిగినప్పుడే మార్పు మొదలవుతుంది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా సమాజంలో అశ్లీలత, ఉమెన్ని ఒక ఆబ్జెక్ట్గా చూపించడం లాంటివి పోవాలి. ఆమె మనసులోని ఆలోచనకు విలువ ఇవ్వాలి. ఎంతసేపు శారీరక అందాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వలన మాకు తెలీకుండానే మాపై ఒత్తిడి పెరుగుతుంది. అందం కావాలంటే తెల్లగా మారిపోవచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం కృత్రిమంగా ఏర్పర్చలేం. (నీ మీద ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంది)