breaking news
International Relations
-
హిజాబ్ వ్యవహారం మా అంతర్గతం: భారత్
న్యూఢిల్లీ: స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ను నిషేధించడం మత స్వేచ్ఛను కాలరాయడమేనంటూ అంతర్జాతీయ మత స్వేచ్ఛ(ఐఆర్ఎఫ్) సంఘంలో అమెరికా ప్రతినిధి రషద్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది. తమ అంతర్గత వ్యవహారాలపై రెచ్చగొట్టేలా మాట్లాడడం మానుకోవాలంది. దీనిపై కొన్ని దేశాలు చేసిన విమర్శలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శనివారం తిప్పికొట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా నోరు పారేసుకోవద్దని సూచించారు. వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు అవసరమైన వ్యవస్థలు, యంత్రాంగం తమకు ఉన్నాయన్నారు. ఈ వివాదాన్ని ఓ కుట్రగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అభివర్ణించారు. సుప్రీంలో పిల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్ని విద్యా సంస్థల్లోనూ ఉమ్మడి డ్రెస్ కోడ్ అమలయ్యేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మరోవైపు బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో నోటీస్ బోర్డుపై హిజాబ్ గురించి అభ్యంతరకరంగా రాశారంటూ తల్లిదండ్రులు నిరసనకు దిగారు. దీనికి బాధ్యురాలిగా ఓ టీచర్ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. -
చైనాకు క్వాడ్ పరోక్ష హెచ్చరికలు
వాషింగ్టన్: ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేస్తామని క్వాడ్ సదస్సు ప్రతిజ్ఞ చేసింది. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాంతంలో అంతర్జాతీయ నిబంధనలు అమలు కావాలని పిలుపునిచ్చింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి క్వాడ్ సదస్సు శుక్రవారం వైట్హౌస్లో జరిగింది. తొలిసారిగా నాలుగు దేశాధినేతలు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ సందస్సులో ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో తమ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇదో అవకాశమని నేతలు చెప్పారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగా సదస్సు అనంతరం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో చైనా పట్టు బిగిస్తున్న నేపథ్యంలో క్వాడ్ సదస్సు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సంయుక్త ప్రకటనలో నేరుగా చైనా పేరు ప్రస్తావించకుండా అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఏ దేశమైనా ప్రవర్తించాలని పేర్కొన్నారు. ‘ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా వాణిజ్యం జరగాలి. వివాదాలు శాంతియుతంగా పరిష్కారం కావాలి. దేశాల ప్రజాస్వామ్య విలువలు, ప్రాదేశిక సమగ్రత కాపాడేలా కలసికట్టుగా కృషి చేస్తాం’’అని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. అక్టోబర్ నుంచి భారత్ వ్యాక్సిన్ ఎగుమతుల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని క్వాడ్ సదస్సు స్వాగతించింది. పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందేలా కృషి చేయనున్నాయి. 2022 నాటికల్లా వంద కోట్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు అందజేయనున్నాయి. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం జరగడానికి వీలుగా మౌలిక సదుపాయాల కల్పనలో పరస్పరం సహకరించుకోనున్నాయి. వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఒక నిర్ణయానికొచ్చాయి. -
భారత్, చైనాలు కలసి పనిచేస్తే ఆసియాకు మేలు
సింగపూర్: భారత్, చైనాలు పరస్పర విశ్వాసంతో కలసి పనిచేస్తే ఆసియాకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొనేలా సమస్యలు పరిష్కరించుకోవడంలో ఇరు దేశాలు గొప్ప పరిపక్వత, విజ్ఞానాన్ని ప్రదర్శించాయని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం ‘షాంగ్రి–లా’ సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. 28 ఆసియా–పసిఫిక్ దేశాల అంతర ప్రభుత్వ భద్రతా వేదిక అయిన ఈ కార్యక్రమాన్ని 2002 నుంచి సింగపూర్లోని షాంగ్రి–లా అనే హోటల్లో ఏటా నిర్వహిస్తున్నారు. విభేదాలు, స్పర్థలను పక్కనపెట్టి ఈ ప్రాంత దేశాలన్నీ కలసి పనిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రాంతీయ సముద్ర తీర వివాదాలను ప్రస్తావిస్తూ..ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ ఓ వ్యూహంగానో, కొందరి సభ్యుల క్లబ్గానో చూడదని ఉద్ఘాటించారు. ‘చర్చలు, ఉమ్మడి నిబంధనల ఆధారిత విధానాల ఆధారంగానే ఈ ప్రాంత అభివృద్ధి, భద్రత సాధ్యమని విశ్వసిస్తున్నాం. స్థిరమైన, వివక్షలేని అంతర్జాతీయ వాణిజ్య విధానాలకే భారత్ మద్దతిస్తుంది. పోటీ ఎక్కడైనా ఉంటుంది. కానీ పోటీ ఘర్షణగా, విభేదాలు వివాదాలుగా మారకూడదు’ అని వాణిజ్యంలో పెరిగిపోతున్న రక్షణాత్మక ధోరణులను పరోక్షంగా ప్రస్తావించారు. ఇండో–పసిఫిక్ ప్రాంత భవిష్యత్తుకు ఆసియాన్ కేంద్ర బిందువుగా ఉండబోతోందని జోస్యం చెప్పారు. ప్రాంతీయ అనుసంధానత వ్యాపారాభివృద్ధిని మించి వేర్వేరు దేశాలను చేరువ చేస్తోందని అన్నారు. అంతకు ముందు, మోదీ సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకూబ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతరాలను చెరిపేస్తున్న సాంకేతికత: మోదీ సాంకేతికత ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి గొంతుకగా మారి, సామాజిక అడ్డంకులను తొలగిస్తోందని మోదీ అన్నారు. సృజనాత్మకతకు మానవీయ విలువలు జోడించి ఈ శతాబ్దపు సవాళ్లను అధిగమించాలని పిలుపునిచ్చారు. సింగపూర్లోని ప్రతిష్టాత్మక నన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ)లో నిర్వహించిన ట్రాన్స్ఫార్మింగ్ ఆసియా త్రూ ఇన్నోవేషన్’ అనే సదస్సులో మోదీ ప్రసంగించారు. మార్పును వినాశకారిగా చూడొద్దని, సాంకేతికత ఆధారిత సమాజం వల్లే అంతరాలు నశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం 300 ఏళ్ల నుంచే.. ‘21వ శతాబ్దం ఆసియాదే. మరి మనకు ఈ సెంటిమెంట్ ఉందా అన్నదే అతిపెద్ద సవాలని అనుకుంటున్నా. ప్రతి సృజనాత్మకత తొలుత అవాంతరంగా కనిపిస్తుంది. సమాజంలోని అంతరాలను సాంకేతికత సాయంతో పారదోలొచ్చు. సాంకేతికత అందరికీ అందుబాటులో ఉంటూ వినియోగదారుడికి అనుకూలంగా ఉండాలి. డిజిటల్ యుగానికి తగినట్లుగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీరు, గాలి కాలుష్యం, శరవేగంగా పెరుగుతున్న పట్ణణీకరణ, వాతావరణ మార్పులు, ఎక్కువ కాలం నిలిచే మౌలిక వసతుల నిర్మాణం, సముద్ర వనరుల పరిరక్షణ తదితరాలు నేడు మనకు సవాళ్లు విసురుతున్నాయి. సుమారు 1600 ఏళ్ల పాటు ప్రపంచ జీడీపీలో భారత్, చైనాల వాటానే 50 శాతంగా ఉండేది. గత 300 ఏళ్ల నుంచే పాశ్చాత్య దేశాల ఆధిపత్యం మొదలైంది. సాంకేతికతను ఆయుధాల తయారీకి వినియోగిస్తే ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు తప్పవు’ అని మోదీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్టీయూ, భారత వర్సిటీల మధ్య విద్య, పారిశ్రామిక భాగస్వామ్యానికి సంబంధించి ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇక్కడ నిర్వహించిన ఎగ్జిబిషన్కు హాజరైన మోదీ..మనుషులతో సంభాషించే ఓ రోబోతో మాట్లాడారు. లూంగ్కు బౌద్ధ జ్ఞాపిక ప్రదానం.. చర్చల సందర్భంగా లూంగ్కు మోదీ 6వ శతాబ్దం నాటి బౌద్ధగుప్త జ్ఞాపిక నమూనాను కానుకగా ఇచ్చా రు. బౌద్ధమతం భారత్ నుంచి ఆగ్నేయాసియాకు వ్యాపించిందనడానికి సాక్ష్యంగా భావిస్తున్న ఈ జ్ఞాపికపై సంస్కృత వాక్యాలున్నాయి. అలాగే, సింగపూర్ మాజీ రాయబారి టామీ కోహ్(80)కు ప్రధాని మోదీ పద్మశ్రీ పురస్కారాన్ని అందజేశారు. ఈ ఏడాది పద్మశ్రీ పొందిన ఆసియాన్ దేశాలకు చెందిన 10 మందిలో కోహ్ ఒకరు. కోహ్ గతంలో అమెరికా, ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా చేశారు. 8 ఒప్పందాలపై సంతకాలు ఆర్థిక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించాయి. నావికా దళాల మధ్య రవాణా సహకారం సహా ఇరు దేశాల మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని లూంగ్తో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చించారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ)పై రెండో సమీక్ష సమావేశం విజయవంతమైందని మోదీ తెలిపారు. లూంగ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు పటిష్టమయ్యాయని అన్నారు. సింగపూర్ కంపెనీల సహకారంతో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పుణే విమానాశ్రయ అభివృద్ధిని ప్రస్తావించారు. -
కెరీర్ విత్ పొలిటికల్ సైన్స్
తెగలు, సమూహాలు, నగరాలు, దేశాలుగా నివసిస్తున్న ప్రజల మధ్య..వారి జీవన గమనానికి అవసరమైన నియమాలు రూపొందించడం, వాటిని అమలు చేయడం ద్వారా ప్రజలు కలసి మెలసి జీవించడానికి ఒక రకమైన వారధిగా నిలిచేవే రాజకీయాలు.. రాచరికం నుంచి ప్రజల చేతుల్లోకి అధికారం విస్తరించిన నేపథ్యంలో రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి..ప్రజలు తమకు కావల్సిన అవసరాల గొంతుకను రాజకీయమనే వ్యవస్థ ద్వారా వినిపిస్తుంటారు.. ఈ క్రమంలో రూపొందించే చట్టాలు, జరిగే నిర్ణయాలు, తీసుకునే చర్యలు వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్).. దేశాల పరిపాలనకు సంబంధించిన విధానాలు, ప్రభుత్వ నియమాలు, రాజ్యాంగం పాత్ర, చట్టాల తయారీ మార్గాలు, ఎన్నికలు... ఇలా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు అవసరమైన అన్ని అంశాలను విశ్లేషణాత్మకంగా చర్చించేదే రాజనీతి శాస్త్రం. ఇందులో రాజకీయ విలువలు, సంస్థలు, అవి పని చేసేతీరు, రాజ్యాంగం వంటి అంశాలు ఉంటాయి. లీడర్గా ఎదగడానికి: శరవేగంగా మార్పు దిశగా ప్రపంచం దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో సమాజాన్ని వివిధ మాధ్యమాల నుంచి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయాలు అనే కోణంలోనే కాకుండా.. ప్రస్తుత ఆధునిక యుగంలో ఒక వ్యక్తిలా కాకుండా నాయకుడిగా ఉండాల్సిన పరిస్థితి. కుటుంబం నుంచి పని చేసే సంస్థ వరకు నలుగురికీ ఆదర్శంగా నిలుస్తూ.. నడిపిస్తూ ముందుకు సాగాలి. అంటే విద్యార్హతలతోపాటు నాయకత్వ లక్షణాలు కూడా నియామక ప్రక్రియలో నిర్ణయాత్మకంగా నిలుస్తున్న తరుణంలో ఒక వ్యక్తిని పరిపూర్ణ మూర్తిమత్వం ఉన్న నాయకుడిగా తీర్చిదిద్దేందుకు కావల్సిన అవగాహనను పొలిటికల్ సైన్స్ అందిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్లో రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకునే వారికి కావల్సిన పరిజ్ఞానాన్ని కూడా కల్పిస్తుంది (రాజకీయాల్లో రాణించాలంటే పొలిటికల్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు). కేవలం సంబంధిత రంగ పోకడలను, నేపథ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ శాస్త్రం వీలు కల్పిస్తుంది. అధ్యయనం ఇక్కడి నుంచే: పొలిటికల్ సైన్స్ను అధ్యయనం చేయడం పాఠశాల దశ నుంచే ప్రారంభమవుతుంది. అయితే ఆ స్థాయిలో కేవలం పౌర విధులు, ఎన్నికలు, నాయకులను ఎన్నుకునే విధానం, నాయకత్వ అర్హతలు వంటి అంశాల చుట్టే కేంద్రీకృతమవుతుంది. డిగ్రీ స్థాయికి వచ్చేసరికి పొలిటికల్ సైన్స్గా ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్గా విస్తృత పరిధిలో ఆవిష్కృతమవుతుంది. కేవలం జాతీయ స్థాయి అంశాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసే అవకాశం ఇక్కడ లభిస్తుంది. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ తర్వాత పోస్ట్గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ వంటి కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉంటే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న లేదా మనుగడలో ఉన్న అంశాలను ఎంపిక చేసుకుని.. దాని ఆధారంగా పరిశోధనలు చేయవచ్చు. కాలక్రమేణా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని రాజనీతి శాస్త్రానికి సంబంధించి పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వంటి కొత్త సబ్జెక్ట్లను ప్రవేశపెట్టారు. పబ్లిక్ పాలసీ: సమగ్రాభివృద్ధిలో పబ్లిక్ పాలసీ అనేది ఒక విడదీయరాని భాగం. భవిష్యత్ విధాన నిర్ణేతలు, విశ్లేషకులకు, ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థలు ఒక పథకాన్ని రూపొందించేటప్పుడు చేయాల్సిన ఊహాత్మక కూర్పు, ఆచరణాత్మక నైపుణ్యాలు, సిద్ధాంతాలు వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి రూపొందించిన కోర్సు పబ్లిక్ పాలసీ. ఒక విధానాన్ని రూపొందించేటప్పుడు..దాని సాధ్యాసాధ్యాలకు సంబంధించి అన్ని కోణాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడానికి ఈ కోర్సు దోహదం చేస్తుంది. ఇందులో హెల్త్ పాలసీ, ఎన్విరాన్మెంటల్ పాలసీ, ఉమెన్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీ వంటి ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కార్పొరేట్ కంపెనీల్లోని సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల్లో, ఎన్జీవోలు, మెకన్సీ, డెలాయిట్ వంటి కన్సల్టెంగ్ కంపెనీలు, కమ్యూనికేషన్ కంపెనీల్లో పీఆర్ విభాగాల్లో, మీడియా హౌస్లలో, పరిశోధన సంస్థల్లో, యునెటైడ్ నేషన్స్, యూనిసెఫ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో కన్సల్టెంట్స్గా, ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఆడిట్ ఫార్మ్స్ వంటి సంస్థలు కెరీర్ వేదికలుగా నిలుస్తున్నాయి. ఈ విభాగానికి సంబంధించి కేవలం మాస్టర్స్ స్థాయిలో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. అందిస్తున్న సంస్థలు: ఐఐఎం-బెంగళూరు (కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్మెంట్, వెబ్సైట్: www.iimb.ernet.in), టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-ముంబై (వెబ్సైట్: www. tiss.edu), నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ-బెంగళూరు (కోర్సు: మాస్టర్ ఇన్ పబ్లిక్ పాలసీ, వెబ్సైట్: www.nls.ac.in), సెయింట్ జేవియర్స్ -ముంబై (వెబ్సైట్: http://xaviers.edu), టెరీ యూనివర్సిటీ (కోర్సు: ఎంఏ-పబ్లిక్ పాలసీ అండ్ సస్టెయినబిలిటీ డెవలప్మెంట్, వెబ్సైట్: www.teriuniversity.ac.in), జిందాల్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ-సోనిపట్ (కోర్సు: మాస్టర్ ఇన్ పబ్లిక్, వెబ్సైట్: www. jsgp.edu.in), ఢిల్లీ యూనివర్సిటీ (కోర్సు: ఎంబీఏ-పబ్లిక్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, వెబ్సైట్: www.du.ac.in). ఇంటర్నేషనల్ రిలేషన్స్: అంతర్జాతీయ రాజకీయాలను విశ్లేషణాత్మక దృష్టితో అధ్యయనం చేసే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సును ప్రారంభించారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి జాతీయ/అంతర్జాతీయ ఎన్జీవోలు, యునెటైడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ ఏజెన్సీలు, పరిశోధనా సంస్థలు, మీడియా హౌస్లలో అవకాశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సు పీజీ/పీహెచ్డీ స్థాయిలో మాత్రమే అందుబాటులో ఉంది. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ-న్యూఢిల్లీ (వెబ్సైట్: www.jnu.ac.in), జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ (వెబ్సైట్: www.jsia.edu.in), పాండిచ్చేరి యూనివర్సిటీ (వెబ్సైట్: www.pondiuni.edu.in). కెరీర్ అవెన్యూస్: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ ప్లానింగ్, సోషల్ పాలసీ, అకడమిక్స్, పబ్లిక్ అఫైర్స్, అనాలిసిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫారెన్ కరస్పాండెంట్, సిటీ ప్లానర్, డిప్లొమాట్, ఇంటెలిజెంట్ ఎక్స్పర్ట్,ఇంటర్నేషనల్ ఆర్గనైజర్, ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్, రాయబార కార్యాలయాల్లో ట్రాన్స్లేటర్, ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు, ఎన్జీవోలు, యూనివర్సిటీలు, బిజినెస్ హౌస్, కార్పొరేట్ కంపెనీలు, మీడియా హౌస్లు తదితరాలు కెరీర్ అవెన్యూస్గా నిలుస్తున్నాయి. పొలిటికల్ సైంటిస్ట్: ప్రస్తుత రాజకీయ వ్యవస్థను పొలిటికల్ సైంటిస్ట్లు అధ్యయనం చేస్తుంటారు. అంటే ఒక సమూహం పోకడను నిశితంగా గమనిస్తుంటారు. ఉదాహరణకు ఎవరైనా ఒక అం శంపై ప్రజా అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం సర్వేలు నిర్వహిస్తుంటారు. అలాంటప్పుడు వీరి సేవలు అవసరమవుతాయి. వివిధ రకాల సర్వేలు నిర్వహించడం, వాటి ఫలితాలను విశ్లేషించడం, సంబంధిత వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం, సంబంధిత డాక్యుమెంట్స్ స్క్రూటినీ, వివిధ సంస్థలకు సలహాదారులుగా వ్యవహరించడం, ప్రభుత్వ సంస్థల కోసం కన్సల్టింగ్ వర్క్ నిర్వహించడం, నిర్దేశిత అం శాలపై పత్రికలకు వ్యాసాలు రాయడం వంటివి వీరి విధులు. రీసెర్చ్: రాజనీతి శాస్త్రం వల్ల విశ్లేషణాత్మక సామర్థ్యం, డేటా అనాలిసిస్, కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే కాకుండా ఓరల్, రిటెన్ స్కిల్స్ కూడా మెరుగుపడతాయి. తద్వారా రీసెర్చ్ అసిస్టెంట్గా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే కెరీర్ ప్రారంభించవచ్చు. పొలిటికల్ సైన్స్ కోర్సులను అందిస్తున్న కాలేజీలు, యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో టీచింగ్తో సమాంతరంగా పరిశోధనా కార్యకలాపాలు కూడా తప్పనిసరి. ఎందుకంటే సంబంధిత అంశంపై సమకాలీనంగా చోటుచేసుకుంటున్న మార్పులపై అప్డేట్గా ఉండాలంటే పరిశోధనా విభాగం పాత్ర ఎంతో. కాబట్టి ఆయా ఇన్స్టిట్యూట్లలో రీసెర్చర్గా కూడా చేరొచ్చు. పాలసీ మేకింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్: పొలిటికల్ సైన్స్ను ప్రభావవంతంగా అన్వయించే లక్షణం ఉన్న వారికి అవకాశాలు కల్పిస్తున్న మరో విభాగం పాలసీ మేకింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే కొన్ని కీలక రంగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. ఆ నిర్ణయాల పర్యవసానాలను సామాజికంగా అన్వయించాల్సి ఉంటుంది. ఆ సమయంలో పొలిటికల్ సైన్స్ అభ్యర్థులు కీలకంగా మారతారు. హౌసింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ రిలేషన్స్, కార్పొరేట్ హైరింగ్ స్ట్రాటజీస్, హెల్త్, లా వంటి విభాగాల్లో ఈ తరహా రిక్రూట్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. హెచ్ఆర్ విభాగాల్లో: పొలిటికల్ సైన్స్లో పీజీ లేదా అడ్వాన్స్డ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో కూడా అవకాశాలు ఉంటాయి. పరిశ్రమల్లో వీరిని ఇండస్ట్రియల్ పొలిటికల్ సైంటిస్ట్లుగా నియమించుకుంటారు. ఉత్పాదకత విషయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి, ఉద్యోగుల మధ్య సంబంధాలను నెలకొల్పడం వంటి అంశాలను నిర్వహించడానికి వీరి సేవలను వినియోగించుకుంటారు. ప్రభుత్వ పథకాల విశ్లేషణ: పొలిటికల్ సైన్స్ అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల విశ్లేషణ/మాల్యాంకనం లేదా సంబంధిత పరిశోధనలో లేదా సమస్య పరిష్కార రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో ఆయా పథకాల అడ్మినిస్ట్రేటర్స్, మేనేజర్స్, డెవలపర్స్గా స్థిరపడొచ్చు. రాష్ట్ర స్థాయిలో అర్బన్ ప్లానింగ్, హెల్త్ ప్లానింగ్, క్రిమినల్ జస్టిస్ వంటి వీరి సేవలను ఎక్కువగా వినియోగించుకుంటారు. సహకారం: న్యూస్లైన్, కేయూ క్యాంపస్, వరంగల్ జిల్లా. కావల్సిన లక్షణాలు పొలిటికల్ సైన్స్ కోర్సును ఎంచుకున్న వారికి కావల్సిన లక్షణాలు. అవి.. రిటెన్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిపోర్ట్ రైటింగ్ స్కిల్స్ విశ్లేషణాత్మక-సృజనాత్మక ఆలోచన తార్కిక వివేచన-సమస్య పరిష్కార నైపుణ్యం సత్వరంగా నిర్ణయం తీసుకునే నేర్పు విమర్శను స్వీకరించే గుణం ఓపెన్ మైండ్ మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం అన్ని సామాజిక శాస్త్రాలలోఅంతర్భాగంగానే రాజనీతిశాస్త్రం కూడా ముఖ్యమనేది గుర్తించాలి. రాజనీతిశాస్త్ర అధ్యయనం చేసిన విద్యార్థుల్లో సంకుచిత స్వభావాలు తొలిగి విశాల దృక్పథం అలవడుతుంది. కులం మతం ప్రాంతాలకు అతీతంగా విశ్వమానవ కల్యాణానికి ప్రపంచాన్ని జాగృతం చేయటం అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనం చేసిన విద్యార్థుల్లో ఉంటుంది. రాజనీతిశాస్త్ర అధ్యయనం వివిధ కాంపిటీటివ్ ఉద్యోగాల కోసం రాసే రాతపరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్ పోస్టులకు. రాజీకీయాల అవగాహనకు కూడా రాజనీతిశాస్త్రం అధ్యయనం కూడా అవసరమే. - డాక్టర్ ఎ.హరిప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజనీతిశాస్త్ర విభాగం-కాకతీయ యూనివర్సిటీ. ఇతర అవకాశాలు పొలిటికల్ సైన్స్ కోర్సు పూర్తి చేసిన వారికి టీచింగ్, రీసెర్చ్, పబ్లిషింగ్, బిజినెస్, జర్నలిజం రంగాల కేంద్రీకృతంగా అవకాశాలు ఉంటాయి. మిగతా అభ్యర్థుల మాదిరిగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు నిర్వహించే అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరు కావచ్చు.టీచింగ్పై ఆసక్తి ఉంటే బీఈడీ, డీఈఈసెట్, పీఈసెట్, లాంగ్వేజ్ పండిట్స్ పరీక్షలకు హాజరుకావచ్చు. సంబంధిత కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు/ కాలేజీలు/ యూనివర్సిటీలలో ఫ్యాకల్టీగా కెరీర్ ప్రారంభించవచ్చు. మీడియా, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా రోజురోజుకూ విస్తరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. -
తప్పులను తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటాను!
మై ఫిలాసఫీ జీవితం చాలామందికి పూలబాట కాకపోవచ్చు. పూలబాట అయినవాళ్లకు...అది శాశ్వతం కాకపోవచ్చు. ఈ ఎరుక మనలో ఉంటే కష్టాల్లోనైనా, సుఖాల్లోనైనా స్థిరచిత్తంతో ఉండే గుణం అలవడుతుంది. ‘నా శక్తి ఇది’ అని గొప్పగా చెప్పుకునే వాళ్లకు ‘నా బలహీనత ఇది’ అని చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. అప్పుడే లెక్క కుదురుతుంది! మిగతా విషయాలను గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా... నా తప్పులను మాత్రం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. కొన్ని సమయాల్లో ‘అహం’ వాస్తవాలను చూడడానికి నిరాకరిస్తుంది. అహాన్ని పక్కన పెడితే వాస్తవం చేరువవుతుంది. అహాన్ని వదులుకోవడం అంటే ఒక మెట్టు కిందకి దిగడం కాదు... రెండు మెట్లు పైకి ఎక్కడం. ఉత్తినే సలహాల కోసం సలహాలు ఇచ్చే వారి దగ్గర సలహాలు తీసుకోవడం కంటే, తీసుకోకపోవడం వల్లే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాత్రలు నచ్చకపోయినా ‘నటించాలి’ అనే నియమమేదీ పెట్టుకోలేదు. ‘ఇంటర్నేషనల్ రిలేషన్స్’లో డిగ్రీ ఉంది. సిటీబ్యాంకులో ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. చెప్పొచ్చేదేమిటంటే సినిమాలు నచ్చనప్పుడు హాయిగా ఉద్యోగం చేసుకోగలను. ఈ చిన్న జీవితంలో మనం చేయడానికి ఎంతో ఉందని నమ్ముతాను. కష్టాలు, నష్టాల గురించి ఆలోచించడం వృథా. ఇంత పెద్ద జీవితంలో ఆలోచించడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆలోచనా శక్తిని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. బాగా సంపాదించాలి, బాగా కీర్తి గడించాలి... ఇలాంటి కోరికలు ఏమీ లేవు. సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతాను. ఆర్థిక స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇస్తాను. ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటాను. - సోహా అలీ ఖాన్, హీరోయిన్