breaking news
expenditure of parliament election
-
అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. లోక్సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితిని రూ. 70 నుంచి 95 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 54 నుంచి 75 లక్షలు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిని రూ. 28 నుంచి 40 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 20 నుంచి 28 లక్షలకు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు) పెంచుతున్నట్లు ఈసీ గురువారం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. రాబోయే ఎన్నికల నుంచి ఈ నూతన పరిమితులు అమల్లోకి వస్తాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
పార్లమెంట్ ఎన్నికలు వ్యయంపై నిఘా
పింప్రి, న్యూస్లైన్: వచ్చే లోక్సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల వ ్యయంపై నిఘా కోసం పోలీసులతో ప్రత్యేక ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాళ్ వీడియో కాన్ఫ్రెన్స్ ద్వారా పోలీసులకు శనివారం అనేక సూచనలిచ్చారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లోని నేరగాళ్లపై దృష్టి సారించాలన్నారు. ఎన్నికల సమయంలో గెలుపు కోసం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయని, అందువల్లనే పోలీసులతో ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇక ఈ నాలుగు నియోజకవర్గాల్లోని నేరగాళ్లపై దృష్టి సారించాలన్నారు. అవసరమైతే వారి మోకా చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం, నగర బహిష్కరణ వంటి చర్యలు కూడా తీసుకోవాలన్నారు. ఎవరి ఒత్తిళ్లకు లొంగిపోవద్దన్నారు. అదేవిధంగా అనుమతి పొందకుండా ఆయుధాలను వినియోగిస్తున్నవారిపైనా దృష్టి సారించాలన్నారు. సారా బట్టీలపైనా దృష్టి సారించాలన్నారు. తర చూ దాడులకు ఆదేశించారు. కాగా పుణే పోలీసు కమిషనరేట్ పరిధిలో పుణే, బారామతి, వడగావ్, మావల్ శిరూర్ పార్లమెంటు నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 656 పోలింగ్ కేంద్రాలు, 3,668 పోలింగ్ బూత్లున్నాయి. ఇందులో 77 కేంద్రాలలోని 594 పోలింగ్ బూత్లు సమస్యాత్మకమైనవి. కమిషనరేట్ పరిధిలోని 33 పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఆయా బూత్లను ఇటీవల సందర్శించారు. అవి ఎక్కడ ఉన్నాయి? అందులో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? అనే అంశాలను వారు ఈ సందర్భంగా నిశితంగా పరిశీలించారు. సమస్యాత్మక బూత్లవద్ద ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.