breaking news
Tamil Nadu style
-
ఆరోగ్య ఉప జిల్లాలు
తమిళనాడు తరహాలో ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు సాక్షి, హైదరాబాద్: తమిళనాడు తరహాలో తెలంగాణలో ఆరోగ్య ఉప జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిఫార్సు చేసింది. ఆశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి నేతృత్వంలో ఇటీవల తమిళనాడులో పర్యటించిన అధికారుల బృందం... అక్కడి ప్రభుత్వ ఆసుపత్రులు, రోగులకు అందుతున్న సేవలపై అధ్యయనం చేసింది. అక్కడి ప్రభుత్వ వైద్య సేవలు ఆదర్శనీయంగా ఉన్నాయని బృందం భావించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, వైద్య సేవల్లోనూ అనేక మార్పులు చేపట్టాలని యోచిస్తోంది. ఈ పర్యటనపై ప్రత్యేకంగా సమావేశమైన అధికారులు ప్రభుత్వానికి అనేక సిఫార్సులు చేశారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉండే డీఎంహెచ్వోనే పీహెచ్సీలు మొదలు అన్ని ఆసుపత్రుల పర్యవేక్షణ చేయాల్సి వస్తోంది. అన్నింటి పర్యవేక్షణ సాధ్యంకాక వైద్య సేవలు కుంటుపడుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు మాదిరిగా ప్రతి జిల్లాలోనూ రెండు మూడు ఆరోగ్య ఉప జిల్లాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. ఒక్కో ఆరోగ్య ఉప జిల్లాకు ఒక డీఎంహెచ్వోను నియమిస్తారు. తమిళనాడులో ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్ కమిషనర్లు నెలకు దాదాపు 20 రోజులపాటు క్షేత్ర స్థాయిలో ఆసుపత్రులను పర్యవేక్షిస్తారు. ఈ అంశాన్ని కూడా మంత్రి బృందం పరిశీలనలోకి తీసుకుంది. మరికొన్ని కీలక సిఫార్సులివి... ♦ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 30 నుంచి 50 పడకలున్న అన్ని పీహెచ్సీ, సీహెచ్సీలను ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ సంచాలకుల విభాగం పరిధిలోకి తేవాలి. ♦ వైద్య విధాన పరిషత్ను రద్దు చేసి గ్రామీణ ఆసుపత్రి సర్వీసుల డెరైక్టరేట్ను ఏర్పాటు చేయాలి. దాని పరిధిలోకి 50 పడకలకు మించి ఉన్న అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను తీసుకురావాలి. తెలంగాణ వైద్య ఆరోగ్య నియామక బోర్డును ఏర్పాటు చేయాలి. శాశ్వత, తాత్కాలిక పోస్టుల భర్తీలన్నీ కూడా అదే చేపట్టాలి. తెలంగాణ ప్రజారోగ్య చట్టాన్ని నెలకొల్పాలి. 150 మంది సీనియర్ ప్రజారోగ్య అధికారులను డిప్యూటీ డీఎంహెచ్వోలుగా మార్చాలి. వారికి పీహెచ్సీ, సీహెచ్సీ తదితరాలపై పూర్తిస్థాయి ఆర్థిక, పరిపాలనాధికారాలు కల్పించాలి. ప్రసూతి సహా నవజాత శిశువుల సేవలకు ఇప్పుడున్న వాటిని హైరిస్క్ కేంద్రాలుగా మార్పు చేయాలి. ♦ గర్భిణులు, పిల్లల ఆరోగ్య రక్షణకు కొత్తగా పథకాన్ని నెలకొల్పాలి. (తమిళనాడులో డాక్టర్ ముత్తులక్ష్మి పథకం ద్వారా వీరి సంరక్షణకు ఏడాదికి రూ.12 వేలు మూడు విడతలుగా ఇస్తున్నారు. మన ప్రభుత్వం రూ.1,000 మాత్రమే ఇస్తోంది.) జిల్లా ఆసుపత్రుల్లో తల్లి పాల కేంద్రాలు నెలకొల్పాలి. ♦ 108 బైక్ అంబులెన్సులను తీసుకురావాలి. -
తమిళనాడు తరహా వేతనాలు ఇవ్వండి
హైదరాబాద్: రేషన్ డీలర్లకు కమీషన్ల పద్ధతి తొలగించి, తమిళనాడు తరహాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వేతనాలు ఇవ్వాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావుకు విజ్ఞప్తి చేసింది. ఎక్సైజ్శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్తో కలసి శనివారం సంఘం అధ్యక్షుడు నర్సింహ, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, గౌరవాధ్యక్షుడు దాసరి మల్లేష్ తదితరులు కేటీఆర్తో భేటీ అయ్యారు. ఉద్యోగ భద్రత కల్పిస్తే ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా డీలర్లు సేవలు అందిస్తారని ఈ సందర్భంగా వారు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. రేషన్ డీలర్లపై నిఘా కోసం పోలీసు శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ (ఎస్ఓటీ) లను వెంటనే తొలగించాలని వారు కోరారు. డీలర్లకు కమీషన్ పెంచేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పగా, తమకు కమీషన్ విధానమే వద్దని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఏ విధానం అమలవుతుందో పరిశీలించి ఐదు రాష్ట్రాలకు సంబంధించిన నివేదికను పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్కు ఇవ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.