breaking news
Sangeetha Richard
-
దేవయానికి ప్రమోషన్
న్యూఢిల్లీ : పనిమనిషి పాస్పోర్టు విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని, ఆమెకు సరిగా జీతం చెల్లించకుండా వేధింపులకు గురిచేశారనే కారణంగా 2013లో అరెస్టైన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకు సెంట్రల్ అడ్మినిస్ట్రేవ్ ట్రిబ్యునల్(క్యాట్)లో ఊరట లభించింది. 1999 బ్యాచ్కు చెందిన దేవయానికి పదోన్నతి కల్పించడంతో పాటు 2016 నుంచి దీనిని వర్తింపచేయాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను క్యాట్ ఆదేశించింది. దీంతో జాయింట్ సెక్రటరీగా ఆమె పదోన్నతి పొందనున్నారు. ఆమెపై నమోదైన కేసు విచారణలో జాప్యం చేసినందుకు ఆ శాఖను తప్పుపట్టింది. భారత్కు చెందిన తన పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారనే కారణంతో 2013లో న్యూయార్క్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దీనివల్ల భారత్- అమెరికాల మధ్యనున్న దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. మీడియాలో కూడా ఈ విషయం గురించి చర్చ జరగడంతో దేవయానిపై విమర్శలు వెల్లువెత్తాయి. తన పిల్లల పౌరసత్వానికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేసిందనే కారణంగా విదేశీ వ్యవహారాల శాఖ ఆమె ప్రమోషన్ను నిలిపివేసింది. అంతేకాకుండా తండ్రితో పాటు అమెరికాలో నివసిస్తున్న దేవయాని ఇద్దరు కుమార్తెలకు భారత పౌరసత్వాన్ని తిరస్కరించింది. ఇండియన్ పాస్పోర్టు, పౌరసత్వ చట్టాన్ని ఉల్లంఘించించారన్న ఆరోపణలతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశం గురించి దేవయాని మాట్లాడుతూ... ‘ఈ కేసులో పిటిషనర్ తల్లి(దేవయాని) ఎప్పుడూ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయలేదు. తన భర్త, తనపై ఆధారపడిన వారి గురించి కూడా విదేశీ పౌరసత్వం కల్పించాలని కోరలేదు. భారత విదేశీ విధానం-1961 నిబంధనల ప్రకారం ఇది చట్టాన్ని మీరినట్టు కాదు. 16 ఏళ్ల సర్వీసులో నేను చాలా బాగా పనిచేశానని’ పేర్కొన్నారు. ఈ అంశాల గురించి అఫిడవిట్లో కూడా ప్రస్తావించారు. -
దేవయానిపై అరెస్ట్ వారంట్
తాజాగా అమెరికా అభియోగపత్రం అక్కడికి వెళితే అరెస్టు చేసే అవకాశం వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రభావం: భారత్ న్యూయార్క్: అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే వీసా మోసం వ్యవహారంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేవయానిపై శనివారం అమెరికా విచారణాధికారులు తాజా అభియోగాలతో అరెస్ట్ వారంట్ జారీ చేశారు. దీంతో ఆమె అమెరికా వెళితే మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉంది. పనిమనిషి సంగీతా రిచర్డ్కు తక్కువ జీతం చెల్లించడంతో పాటు ఆమెను వేధింపులకు గురిచేసిందనే అభియోగాలపై డిసెంబర్ 12న దేవయానిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆమెను భారత్లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలు అమెరికాలోనే నివాసం ఉంటున్నారు. అయితే దేవయానికి దౌత్యపరమైన రక్షణ ఉన్నందున గతంలో ఆమెపై ఉన్న కేసును బుధవారం అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. పాత చార్జిషీట్పై అరెస్ట్ చేయకూడదని చెప్పిన కోర్టు.. మరోసారి అభియోగపత్రాన్ని దాఖలు చేసే విషయాన్ని మాత్రం తోసిపుచ్చలేదు. కేసు కొట్టివేయడంపై అమెరికా ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేసిన దరిమిలా మరోసారి చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. దేవయానిపై తాజాగా అభియోగాలు నమోదు చేసినట్లు మన్హటన్లోని అమెరికా ప్రభుత్వ న్యాయవాది, భారత సంతతికి చెందిన ప్రీత్ బరారా యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జికి లేఖ ద్వారా తెలిపారు. తన పనిమనిషి వీసా దరఖాస్తు విషయంలో అన్నీ తెలిసుండే దేవయాని తప్పుడు సమాచారంతో పాటు పలు తప్పుడు ప్రాతినిధ్యాలు ఇచ్చారని తాజా చార్జిషీట్లో పేర్కొన్నారు. చార్జిషీట్కు సంగీత ఉద్యోగ ఒప్పంద పత్రాన్ని, భారత్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా జతచేశారు. భారత్లో దేవయాని ఇచ్చిన సమాచారానికి, అమెరికా ఎంబసీకి తెలిపిన సమాచారానికి మధ్య చాలా వ్యత్యాసముందని కోర్టుకు తెలిపారు. దీనిని బట్టి బాధితురాలి వీసా ఇంటర్వ్యూ సమయంలో ఖోబ్రగడే అమెరికా ఎంబసీని మోసం చేశారని, న్యాయసూత్రాలను అతిక్రమించారని తాజా చార్జిషీట్లో అభియోగాలు నమోదు చేశారు. భారత్ ఘాటు హెచ్చరిక దేవయానిపై తాజాగా అభియోగాలు నమోదు చేయడంపై భారత్ ఘాటుగా స్పందించింది. ఇదొక అనవసరపు చర్య అని పేర్కొన్న భారత్.. దీని ప్రభావం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై పడుతుందని హెచ్చరించింది. భారత్ దృష్టిలో ఆ కేసులో ఏవిధమైన యోగ్యతలు లేవని, దేవయాని కూడా భారత్ తిరిగి వచ్చేయడంతో అమెరికా కోర్టు పరిధిలో లేరని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి చెప్పారు. మరోసారి చార్జిషీట్ దాఖలు చేయడంపై చాలా అసంతృప్తిగా ఉన్నామన్నారు.