breaking news
Rani ki Vav
-
బావి దిగి చూడు.. ఎవరెస్టు ఎక్కినట్లే!
ఆకాశం అంచుల్ని తాకితేనేనా.. శిఖరాగ్రాలను చేరుకుంటేనేనా.. ...ప్రపంచాన్ని జయించిన సంతోషం కలిగేది! ఈ బావిలోకి దిగి చూడండి. ఎవరెస్టును ఎక్కినట్లే ఉంటుంది! విజయ పతాకాన్ని ఎగరేసినట్లే ఉంటుంది. ఇది రాణి గారి బావి. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరానికి 130 కి.మీల దూరాన ఉంది. ఇది ఏడు నిలువుల లోతు బావి. పేరు రాణీ కీ వావ్. ఈ బావిలోకి దిగడమే ఓ విచిత్రం. ఏ మెట్టు నుంచి మొదలు పెట్టామో తిరిగి అదే మెట్టు మీదకు చేరతాం. ఏడంతస్థుల రాణి గారి బావిలో విశాలమైన వరండాలుంటాయి. వరండా స్థంభాల మీద అందమైన శిల్పాలున్నాయి. బుద్ధుడు, విష్ణు, దశావతారాలు, కల్కి, రాముడు, మహిసాసురమర్దని, నరసింహుడు, వామన, వరాహవతారాలతోపాటు నాట్య భంగిమలో నాగకన్యల శిల్పాలుంటాయి. ఏడంతస్తుల బావి నిర్మాణంలో సుమారు ఎనిమిది వందల శిల్పాలు ఉండవచ్చని అంచనా. ఇప్పుడు ఐదు అంతస్తులు మాత్రమే సరిగ్గా ఉన్నాయి. 64 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 27 మీటర్ల లోతున్న ఈ బావిలోకి దిగడం సాహసమేనేమో అనిపిస్తుంది. కానీ తీరా బావి అడుగు అంతస్థులోకి చేరిన తర్వాత ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలుగుతుంది. ఎవరెస్టును అధిరోహించినంత గర్వంగానూ ఉంటుంది. మంచి గాలి ఈ ప్రదేశాన్ని పదకొండవ శతాబ్దంలో సోలంకి రాజవంశం పాలించింది. ఆ రోజుల్లో మొదటి భీమదేవుని భార్య రాణి ఉదయమతి భర్త జ్ఞాపకార్థం ఈ బావిని నిర్మించింది. ఈ బావి గుజరాత్లోని పఠాన్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో సరస్వతి నది తీరాన ఉంది. ఆ నదికి వచ్చిన వరదల్లో బావి మునిగిపోయి కొన్ని శతాబ్దాల పాటు ఇసుకమేటలోనే ఉండిపోయింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో 1980లో బయట పడిన ఈ బావిని యునెస్కో 2014లో ‘వరల్డ్ హెరిటేజ్ సైట్’ జాబితాలో చేర్చింది. సాధారణ బావుల్లోకి దిగితే కొంత సేపటికి ఆక్సిజెన్ తగినంత అందక ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ ఆ అసౌకర్యం ఉండదు. విశాలమైన వరండాలు, స్తంభాల మధ్య నుంచి గాలి ధారాళంగా ప్రసరిస్తుంది. నాలుగో అంతస్తు నుంచి మరొక బావి నుంచి ఈ ప్రధాన బావితో అనుసంధానమై ఉంటుంది. దీని ఆకారం పై నుంచి చూస్తే దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. లోతుకు వెళ్తే కొద్దీ వలయాకారంగా ఉంటుంది. నీటి సంరక్షణ కోసం గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇలాంటి దిగుడు బావులు ఎక్కువ. మన తెలంగాణలో కూడా ఇటీవలి తవ్వకాల్లో ఇలాంటి బావులు బయటపడ్డాయి. భూగర్భ జలాలను రక్షించుకోవడానికి క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం ఇది. వీటిని సామాజిక ప్రయోజనం కోసమే నిర్మించేవారు. పనిలో పనిగా దీనిని విహారకేంద్రంగా కూడా మలుచుకునేవారు. ఇప్పుడు గోలీవుడ్ (గుజరాత్ సినిమా ఇండస్ట్రీ) పాటల చిత్రీకరణకు మంచి లొకేషన్ అయింది. ఎండాకాలంలో ఇవి చక్కటి వేసవి విడుదులు. ఈ దిగుడు బావుల్లో మే నెలలో కూడా నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ దిగుడు బావుల పరిసరాల నుంచి ఓ పది అడుగుల దూరంలో ఎండ తీవ్రత భరించలేనంత తీక్షణంగా ఉన్నప్పుడు కూడా దిగుడు బావి దగ్గర శీతల పవనాలు వీస్తుంటాయి. అప్పటి ఆర్కిటెక్టులకు నేచురల్ ఎయిర్కండిషనింగ్ టెక్నాలజీ ఏదో తెలిసే ఉంటుంది. తవ్వే కొద్దీ బయట పడుతున్న సాంకేతిక చాతుర్యం ఇది. -
లావెండర్ రంగులో కొత్త వంద రూపాయల నోటు..
-
‘వావ్’.. వంద నోటు!
న్యూఢిల్లీ: త్వరలో విడుదలకానున్న రూ.100 నోటు నమూనాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం అధికారికంగా ప్రకటించింది. లావెండర్ (లేత వంగ పువ్వు) వర్ణంలో ఉన్న ఈ నోటు వెనుక వైపు గుజరాత్లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ఏడంతస్తుల బావి ’రాణీ కీ వావ్’ ని ముద్రించింది. 66 ఎంఎంగీ142 ఎంఎం పరిమాణంలో ఉన్న ఈ కొత్త నోటు.. ప్రస్తుతం ఉన్న వంద నోటు కంటే కాస్త చిన్నగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న వంద నోటు కూడా చెల్లుతుందని స్పష్టంచేసిన ఆర్బీఐ పాత నోటు సైజు 73 ఎంఎంగీ157 ఎంఎంగా ఉన్నట్లు పేర్కొంది. త్వరలోనే బ్యాంకుల ద్వారా కొత్త వంద నోటు అందుబాటులోకి రానుందని, ముద్రణ ఆధారంగా క్రమంగా విడుదల పెరుగుతుందని తెలిపింది. -
ప్రపంచ వారసత్వ సంపదగా‘రాణి కీ వావ్’
న్యూఢిల్లీ: గుజరాత్లోని పఠాన్ పట్టణంలో ఉన్న చారిత్రక ‘రాణి కీ వావ్’కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల (వరల్డ్ హెరిటేజ్ సైట్స్) జాబితాలో రాణి కీ వావ్కు చోటు దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఖతార్లోని దోహాలో జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాల్లో యునెస్కో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవడంలో నాటి సాంకేతిక అభివృద్ధికి రాణి కీ వావ్ అత్యద్భుత నిదర్శనంగా నిలిచిందని యునెస్కో కొనియాడింది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఏడు భూగర్భ అంతస్తుల బావి భారత్లో నాటి ప్రత్యేక భూగర్భ నిర్మాణ కౌశలానికి, కళాత్మకతకు ఉదాహరణగా నిలిచిందని ప్రశంసించింది. వరదలకుతోడు నాటి భూగర్భ మార్పుల వల్ల సరస్వతి నది కనుమరుగు కావడంతో ఈ బావి దాదాపు ఏడు శతాబ్దాలపాటు మట్టిలో కూరుకుపోయింది. అనంతర కాలంలో భారత పురావస్తుశాఖ ఈ బావిని గుర్తించి అది పాడవకుండా చర్యలు చేపట్టింది. దీనిని పఠాన్ రాజు సిద్ధార్థజైసింగ్ నిర్మించారు. ఇందులో గంగాదేవి ఆలయం ఉంది.