poor education qualities
-
‘ఇంజనీరింగ్’ ప్రక్షాళన
దేశంలో ప్రపంచీకరణ విధానాల అమలు మొదలయ్యాక అంతక్రితం లేని ఆక ర్షణను సంతరించుకున్న ఇంజనీరింగ్ విద్యకు చాలా త్వరగానే గ్రహణం పట్టింది. పట్టుమని పాతికేళ్లు గడవకుండానే అదిప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇంజనీరింగ్ విద్యకు అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళిక, వర్తమాన అవసరాల స్పృహ, భవిష్యత్తులో అది ఎదిగే క్రమం ఎలా ఉంటుందన్న అంశాల్లో ఇంజనీరింగ్ కళాశాలలకుగానీ, వాటి పర్యవేక్షణను చూసే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కుగానీ అవగాహన కొరవడుతున్నదని అర్ధమవుతోంది. ప్రమాణాలు పతనం కావడానికీ...పట్టా తీసుకుని బయటికొస్తున్నవారిలో అత్యధి కులు నిరుద్యోగులుగా మిగిలిపోవడానికీ ఇదే కారణం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధన తీరుతెన్నులపై మంగళవారంనాటి ‘సాక్షి’లో వెలు వడిన కథనం ఈ దయనీయ స్థితిని వెల్లడిస్తోంది. తమ పిల్లలు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని ఆశించే తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదువుల కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వాలు ఎగ్గొడుతున్నా వారు వెనక్కు తగ్గడంలేదు. అలాంటివారంతా చివరకు దగాపడుతున్నారు. మన దేశంలో ఒక విచిత్రమైన స్థితి నెలకొని ఉంది. పరిశ్రమల్లో అయితేనేమి, వివిధ రంగాల్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అయితేనేమి నిపుణుల అవసరం ఎంతగానో ఉంది. అటు ఏటా ఆరు లక్షలమంది ఇంజనీరింగ్ గ్రాడ్యు యేట్లు బయటికొస్తున్నారు. కానీ వారిలో 80 శాతంమందికి ఆయా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం ఏమాత్రం లేదని మొన్న జనవరిలో విడుదలైన ‘యాస్పై రింగ్ మైండ్స్’ సంస్థ నివేదిక వెల్లడించింది. వీరికి తాము చదువుకున్న కోర్సుల్లో అవగాహన మాట అటుంచి, కనీసం తమ గురించి తాము చెప్పుకోవడానికి అవసరమైన ఇంగ్లిష్ భాషా నైపుణ్యం కూడా లేదని ఆ నివేదిక వివరించింది. ఐటీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 25 శాతంమంది మాత్రమే కొలువుకు పని కొస్తారని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కాం నిరుడు ప్రకటించింది. తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాల్లో 33,706మంది అధ్యాపకులు అవసరం కాగా కేవలం 25,000మంది మాత్రమే ఉన్నారని ‘సాక్షి’ కథనం వెల్లడిస్తోంది. ఇందులో సగం మందికిపైగా బీటెక్ చదివినవారే! ఇక ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లోనూ తగిన అర్హతలున్నవారు తక్కువే. ఒకపక్క విద్యార్థులనుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ తాత్కాలిక అధ్యాపకులతో, నామమాత్ర వనరులతో మెజారిటీ ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్నాయి. వేరే కళాశాలలో బోధించే అధ్యాపకులనే తమ కళాశాల అధ్యాపకులుగా చూపడం వంటి చేష్టలు మితిమీరాయి. అధ్యాపకులకు వేతనాలు సరిగా చెల్లించకపోవడం, చివరకు విసుగు చెంది వారు తప్పుకోవాలని నిర్ణయించినప్పుడు బకాయిలు ఎగ్గొట్టడం వంటి ధోరణులు పెరిగాయి. తప్పుడు లెక్కలతో అటు విద్యార్థులనూ, ఇటు ప్రభు త్వాలనూ బోల్తా కొట్టించడం అలవాటుగా మారింది. 90వ దశకంలో దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమయ్యాక సాంకేతిక రంగానికి ఊతమివ్వాలని, ఆ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందింపజేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పెరిగిన గిరాకీకి అనుగుణంగా భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి నివ్వాలని కూడా నిర్ణయించింది. ఫలితంగా వ్యాపార ధోరణులు కట్టలు తెంచు కున్నాయి. తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని సంపన్నులు, రాజకీయ నాయకులు కళాశాలలకు అనుమతులు తెచ్చుకున్నారు. ఏఐసీటీఈ దీనికంతకూ వంతపాడింది. ఎడాపెడా గుర్తింపులిచ్చింది. వీటన్నిటి పర్యవసానంగానే ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్య ఇలా అఘోరించింది. ఇప్పుడు ఏఐసీటీఈలో కదలిక వచ్చింది. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాల, యూనివర్సిటీల వైఖరి కూడా మారింది. ఇంజనీరింగ్ కళా శాలల్లో జరుగుతున్నదేమిటో తెలుసుకునే ప్రయత్నం మొదలైంది. మరోపక్క ఇంజనీరింగ్ విద్యవైపు మొగ్గు కూడా క్రమేపీ తగ్గింది. 2014లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కన్వీనర్ కోటాలో 73,000 సీట్లు మిగిలిపోగా, నిరుడు అది 84,000కు చేరుకుంది. తెలంగాణలో నిబంధనలు పాటించని అనేక కళాశాలలను కౌన్సెలింగ్కు దూరం చేయగా...కొన్ని కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసు కోవడమే మానుకున్నాయి. ఇది ఒక రకంగా మంచి పరిణామం. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్యతోపాటు ఇప్పుడున్న దాదాపు 17 లక్షల సీట్లను పది లక్షలకు తగ్గించేందుకు చర్యలు ప్రారంభించామని ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్ర బుధే ఆమధ్య ప్రకటించారు. ఇంజనీరింగ్ విద్యకు సంబంధించిన నియంత్రణను చూసే ఏఐసీటీఈకి ఇంకా చాలా వ్యాపకాలున్నాయి. అది ఇంజనీరింగ్ విద్యతో పాటు ఫార్మాస్యూటికల్, ఆర్కిటెక్చర్, అర్బన్ ప్లానింగ్, టూరిజం, మేనేజ్మెంట్ కోర్సుల వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తుంది. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య వైపు మొగ్గు చూపడం ప్రారంభించాక, నాణ్యతా ప్రమాణాలపై ఫిర్యాదులందడం మొదలయ్యాక కేంద్ర ప్రభుత్వం మేల్కొనవలసింది. ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించే వ్యవస్థ అవసరం ఉన్నదని గుర్తించవలసింది. ఆ పని జరగలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన చర్యలన్నీ ప్రారంభించాలి. ఇంజనీరింగ్ కళాశాలలకు నిర్దిష్టమైన ప్రమాణాలను నిర్దేశించి వాటిని తప్పనిసరిగా పాటించేలా చూడాలి. వాటి ఆధారంగా ర్యాంక్లను నిర్ణయించి...జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఏ కళాశాల స్థాయి ఏమిటో ఏటా తేల్చాలి. ఏ అంశంలో వెనకబడి ఉన్నా వెనువెంటనే సరిదిద్దుకోమని హెచ్చరించాలి. తగిన సమయమిచ్చి చూసి మారకపోతే గుర్తింపును కూడా రద్దు చేయాలి. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా సాగాలి. అప్పుడే ఇంజనీరింగ్ విద్యకు గత వైభవం సాధ్యమవుతుంది. -
బీటెక్లో ‘లోటెక్’ బోధన!
రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న ఐదున్నర లక్షల మందిలో 32,729 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు! ఎంటెక్ చేసిన వారు 1,836! గ్రూపు-2కు దరఖాస్తు చేసిన వారిలో బీటెక్ పట్టభద్రులు 9,204. ఎంటెక్ చేసిన వారు 2 వేల మంది!! టీఎస్పీఎస్సీ వన్టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న బీటెక్ గ్రాడ్యుయేట్లు 2,49,061 మంది. ఏ నోటిఫికేషనొచ్చినా రాసేందుకు రెడీగా ఉన్నారు. - సరైన అర్హతలు లేకుండానే అధ్యాపకుల పాఠాలు - రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 33 వేల మంది అధ్యాపకులు అవసరం - కానీ ఉన్నది 25 వేలే.. అందులో సగం మందికి కేవలం బీటెక్ అర్హత - 16 వేల మంది పీహెచ్డీ సిబ్బంది ఉండాలి.. ఉన్నది కేవలం 1,500 - బీటెక్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పాఠాలు చెబుతున్నవారెందరో.. - తప్పుడు లెక్కలతో మసిపూసి మారేడు కాయ చేస్తున్న యాజమాన్యాలు - నాణ్యమైన విద్యకు దూరమవుతున్న విద్యార్థులు సాక్షి, హైదరాబాద్ అరకొర నైపుణ్యాలతో పట్టాలు పుచ్చుకొని కాలేజీల నుంచి వస్తున్న లక్షలాది మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు చివరకు కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధన ప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చదివిన రంగంలో ముందుకు సాగ లేక.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకోలేక.. ఏదోలా గట్టెక్కిన డిగ్రీతో ఇతర రంగాల వైపు చూస్తున్నారు. విద్యార్థుల ఈ స్థితికి ప్రధాన కారణం బోధన సమస్యలే! కాలేజీల్లో నాణ్యమైన బోధన లేక, అర్హులైన అధ్యాపకుల్లేక ఇంజనీరింగ్ విద్య అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. అర్హులైన అధ్యాపకులేరి? రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1,26,468 ఇంజనీరింగ్ సీట్లకు గాను 33,706 మంది అధ్యాపకులు అవసరం. కానీ రాష్ట్రంలోని 246 ఇంజనీరింగ్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య 25 వేలు మాత్రమే. అందులో సగం మంది బీటెక్ పూర్తి చేసినవారే ఉన్నారు. ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్డీ కలిగి, బోధనలో కనీసం ఐదేళ్లు అనుభవం ఉన్న వారు అర్హులు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు కూడా పీహెచ్డీ ఉండాలి. రాష్ట్రంలోని బీటెక్, ఎంటెక్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 16,667 మంది అవసరం. కానీ ప్రస్తుతం ఉన్నది కేవలం 1,500 మంది. అందులోనూ సగం మంది రిటైర్ అయిన వారే ఉన్నట్లు అంచనా. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఎంటెక్ పూర్తి చేసి, బోధనలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. కానీ చాలా కాలేజీల్లో బీటెక్ అర్హత గలవారే పాఠాలు బోధిస్తున్నారు. నిబంధన ప్రకారం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1:2:6 నిష్పత్తిలో ఉండాలి. ఈ లెక్కల రాష్ట్రంలో 33,706 మంది బోధనా సిబ్బంది అవసరం. అందులో 22,470 మంది ఎంటెక్ అర్హత కలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 11,236 మంది డాక్టరేట్ అర్హత కలిగిన అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు కావాలి. కానీ డాక్టరేట్ అర్హత కలిగినవారు 1500 మాత్రమే ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలోని 171 ఎంటెక్ కాలేజీల్లో 22,470 మంది అధ్యాపకులు అవసరం ఉన్నా 15,152 మందితోనే నడుస్తున్నాయి. తప్పుడు లెక్కలతో మాయాజాలం కొన్ని కాలేజీల యాజమాన్యాలు అధ్యాపకుల తప్పుడు లెక్కలతో విద్యార్థులు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయి. ఒక కాలేజీలో బోధించే వారినే మరో కాలేజీలో బోధిస్తున్నట్లు లెక్కలు చూపాయి. దీన్ని గ్రహించిన జేఎన్టీయూహెచ్ ఇటీవల 903 మంది అధ్యాపకులను బ్లాక్లిస్టులో పెట్టింది. వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో అధ్యాపకులుగా కొనసాగుతున్న ఏడుగురిని కూడా బ్లాక్లిస్టులో పెట్టింది. ఇలా తప్పుడు లెక్కలతో పేపర్పైనే అర్హులైన అధ్యాపకులు ఉన్నట్లు చూపడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వమే కాదు ప్రైవేటు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ‘యాస్పైరింగ్ మైండ్స్’ సంస్థ చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన వేల మంది విద్యార్థులకు కనీసం ఇంగ్లిషు మాట్లాడే నైపుణ్యం లేదని తేలింది. నాణ్యత ప్రమాణాలపైనే సర్కారు దృష్టి.. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యలో ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేస్తోంది. మౌలిక సదుపాయాలతోపాటు అధ్యాపకుల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తోంది. పక్కాగా అన్ని రకాల సదుపాయాలు ఉన్న కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ చర్యలు తీసుకుంటోంది. దీంతో 2016-17 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య మొత్తంగా 40 వేల వరకు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోని 58 కాలేజీల్లో దాదాపు 10 వేల సీట్లు తగ్గిపోనున్నాయి. మరోవైపు 46 ఎంటెక్, బీటెక్ కాలేజీల విజ్ఞప్తి మేరకు ఆ కాలేజీల్లోని పలు కోర్సులకు ఏఐసీటీఈ ఈసారి గుర్తింపును రద్దు చేసింది. వాటిల్లో 10 వేల వరకు సీట్లకు కోత పడే అవకాశం ఉంది. మరో 7 కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేయగా ఏఐసీటీఈ ఓకే చెప్పింది. వాటిల్లో 5 వేలకు పైగా సీట్లు తగ్గిపోనున్నాయి. ఇక గతేడాది అందుబాటులో ఉంచిన 1,26 లక్షల సీట్లలో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలో భర్తీ అయినవి కేవలం 75 వేలే! ఈ నేపథ్యంలో ఈసారి అనుబంధ గుర్తింపు ప్రక్రియను పకడ్బందీగా చేస్తుండడంతో మరో 15 వేల సీట్లకు కోత పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.