breaking news
Mumbai regional developed Organization
-
అరికట్టేదెలా?
సాక్షి, ముంబై : కాలుష్యపు కోరల్లో చిక్కుకుని నగరం విలవిల్లాడుతోంది. ముఖ్యంగా విపరీతంగా పెరిగిన ధ్వని కాలుష్యం వల్ల చెవుడు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించడంతో తేరుకున్న మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నగరంలో కీలకమైన 1,200 చోట్ల ధ్వని కాలుష్యాన్ని నియంత్రించే ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏ కంపెనీ బీఎంసీకి దొరకడం లేదు. పరిపాలన విభాగం ఆందోళనలో పడిపోయింది. రోజురోజుకూ అనేక రకాల కాలుష్యాలతోపాటు ధ్వని కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సెలైన్స్ జోన్లోనూ యథాతథం నగరంలో విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, ఆస్పత్రులున్న ప్రాంతాలను రెండు సంవత్సరాల కిందట హై కోర్టు ‘సెలైన్స్ జోన్’ గా ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో పరిస్థితులు యథాతథంగా ఉన్నాయి. కొన్ని సార్వజనిక ఉత్సవాలను నియంత్రించారు. వాహనాల నుంచి వెలువడే ధ్వని కాలుష్యం ఏ మాత్రం తగ్గలేదు. నియమాల ప్రకారం సెలైన్స్ జోన్ ప్రకటించిన ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలి. అందుకు నగరంలో అధ్యయనం చేయగా 1,200 చోట్ల ధ్వని కాలుష్యన్ని కచ్చితంగా నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ఉపాయాన్ని ఆలోచించేందుకు సలహాదారుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రకాశ్ పాటిల్ చెప్పారు. రెండు సార్లు టెండర్లను ఆహ్వానించినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఆసక్తి కనబర్చ లేదు. ఎమ్మెమ్మార్డీయే ఆధ్వర్యంలో.. ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) కొద్ది రోజుల కిందట పవయి. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిసరాల్లో ధ్వని కాలుష్య నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసింది. అప్పట్లో ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, ఆస్పత్రులున్న ప్రాంతాల్లో వేగ నియంత్రణ (స్పీడ్ బ్రేకర్స్) ఏర్పాటు చేసింది. వీటివల్ల కొంత శాతమే నియంత్రించగలిగారు. పూర్తగా అరికట్టేందుకు బీఎంసీ ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ నగరంలో ఏర్పాటు చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పెరిగిన వాహనాల సంఖ్య నగరంలో విపరీతంగా పెరిగిపోయిన వాహనాల సంఖ్యవల్ల ధ్వని కాలుష్యం కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. అస్పత్రులున్న చోట వాహనాలకు అనుమతివ్వక పోవడం, కొన్ని కీలకమైన రహదారులపై భారీ వాహనాలకు నిషేధించడం, నో హార్న్ జోన్గా ప్రకటించడం లాంటి ప్రయత్నాలు చేసింది. అవికూడా అనుకున్నంతమేర ఫలితాలివ్వలేకపోయాయి. త్వరలో నియమించనున్న సలహదారుల కమిటీ సూచనల ప్రకారం స్వయంగా ఆ ప్రాజెక్టు చేపట్టాలని యోచిస్తున్నట్లు పాటిల్ చెప్పారు. -
నష్టాల ఊబిలో మోనోరైలు
సాక్షి, ముంబై: ఇటీవల ప్రారంభమైన మోనోరైలుకు ఇంకా మంచి రోజులు రాలేదు. నిత్యం దీనికి దాదాపు రూ.రెండు లక్షల వరకు నష్టం వస్తోంది. దేశంలోనే మొదటిసారిగా ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన మోనోరైలు ప్రాజెక్టుకు ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తుందని ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) భావించింది. ప్రజలకు, ముఖ్యంగా ఉద్యోగులకు సౌకర్యవంతంగా లేకపోవడంతో ఎక్కువ మంది దీని సేవలను వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే మోనో నష్టాలు బాట పట్టిందని చెబుతున్నారు. గత ఆదివారం నుంచి మెట్రో సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం, సాయంత్రం ఉద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోంది. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఉద్యోగుల్లో అత్యధికులు ఆఫీసులకు వెళ్లేందుకు మెట్రోరైలును ఆశ్రయిస్తున్నారు. ఇది అందుబాటులోకి రావడంవల్ల ట్యాక్సీ, ఆటోచార్జీలు, సమయం ఆదా అవుతున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళ ల్లో మెట్రోరైళ్లన్నీ ఉద్యోగులతో కిటకిటలాడుతున్నాయి. చెంబూర్-వడాలా వరకు నిర్మించిన మోనో రైలు మార్గంలో కార్పొరేట్ కార్యాలయాలు అంతగా లేవు. దీంతో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పరుగులు తీస్తున్న మోనో రైలు రోజుకు రూ.రెండు లక్షల మేర నష్టాన్ని చవిచూస్తోంది. దీని నిర్వహణ బాధ్యతలు సేకరించిన స్కోమీ ఇంజినీరింగ్ సంస్థ రైలు ట్రిప్పుల సంఖ్యను తగ్గించింది. ప్రతీ 15 నిమిషాలకు ఒక రైలును నడుపుతోంది. గడియారంలోని ముల్లులాగా పరుగులు తీసే ముంబైకర్లకు మోనో రైలు సేవలు అంతగా ఉపయోగపడడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రైల్లో రోజుకు 20 వేల మంది ప్రయాణికులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సరదా కోసమే ఈ రైల్లో ప్రయాణిస్తున్నారు. మెట్రోరైలు ప్రారంభించిన మరుసటి రోజు నుంచి దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వడాలా-సాత్రాస్తా రెండో దశ పనులు వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ మార్గం పూర్తయితే మోనో మరిన్ని ప్రాంతాలకు విస్తరించి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ఎమ్మెమ్మార్డీయే డెరైక్టర్ దిలీప్ కవట్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు.