గో సంరక్షణకు కృషి
ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో భజన మందిరాల నిర్మాణం
టీటీడీ బోర్డు పాలకమండలిసభ్యుడు, ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం అర్బన్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గో సంరక్షణ కార్యక్రమం చేపడుతున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యుడు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. టీటీడీ నిధులతో నిర్మిస్తున్న టేకులపల్లి(ఖమ్మం)లోని శ్రీ వేంకటేశ్వర గోశాల పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. సామాజిక స్ఫూర్తితో గో సంరక్షణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. టేకులపల్లిలో రూ. 24 లక్షలతో షెడ్డు నిర్మాణం చేపట్టామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రూ. 8 లక్షల వ్యయంతో భజన మందిరాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో భజన మందిరాలకు స్థానికుల నుంచి రూ 2 లక్షల కంట్రిబ్యూషన్ ఉంటే మిగతా∙రూ. 6 లక్షలు ఇచ్చేవారని తెలిపారు. దీంతో నిర్మాణాలకు ముందుకు సాగడం లేదని ఇటీవల తిరుపతిలో జరిగిన బోర్డు సమావేశంలో తాను లేవనెత్తగా మొత్తం ఖర్చు రూ 8 లక్షలు కూడా టీటీడీ నుంచే ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జిల్లాలో 15 భజన మందిరాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, వాటిలో ఆరింటికి రూ. 50 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.
భద్రాచలానికి రూ. 4 కోట్లు
భద్రాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సీతారామచంద్రస్వామి వారి ఆలయ అభివృద్ధికి రూ. 4 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ. 40 లక్షలతో జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపానికి నూతన హంగులు కల్పిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఉపయోగపడే విధంగా వసతి గదులు నిర్మించనునున్నట్లు వివరించారు. కూసుమంచి మండలం ఈశ్వరమాధారం దేవాలయం, ఎర్రుపాలెం మండలంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, ఏన్కూరు మండలంలోని నాచారం శ్రీవేంకటేశ్వర ఆలయం, ఖమ్మం ఖానాపురంలోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తొలుత వెంకటేశ్వరస్వామి ఆలయంలో సండ్ర పూజలు నిర్వహించారు. ఆయన వెంట దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఈఈ ఎస్.చంద్రశేఖర్, డీఈ కె.రాధాక్రిష్ణ, ఏఈ సి. రమేష్, కార్పొరేటర్ హనుమాన్, గోశాల నిర్వహకుడు, అర్చకుడు ఆరుట్ల శ్రీనివాసరావు, గోశాల అభివృద్ధి కమిటీ సభ్యులు యల్లంపల్లి హనుమంతురావు, గొడ్డెటి మాధవరావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి హరిక్రిష్ణ, కోలేటి రాధాకృష్ణ, చిరుమావిళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.