breaking news
kerala assembly elections 2016
-
ఇటలీలో పుట్టినా.. ఈ మట్టిలోనే కలిసిపోతా!
తిరువనంతపురం: అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ సోనియాగాంధీకి ఇటలీతో సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి దీటుగా బదులిచ్చారు. 'నా నిజాయితీని సవాల్ చేస్తూ మోదీ ఎంతకైనా దిగజారొచ్చు. కానీ, భారత్ పట్ల నాకు చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నాయన్న సత్యాన్ని ఆయన ఏనాడూ మరుగుపరుచలేరు' అని సోనియా పేర్కొన్నారు. తిరువనంతపురంలో మంగళవారం జరిగిన ఎన్నికల సభలో ఆమె ప్రసంగిస్తూ. 'ఔను, నేను ఇటలీలోనే పుట్టాను. 1968లో ఇందిరాగాంధీ కోడలిగా నేను భారత్లో అడుగుపెట్టాను. 48 ఏళ్లు నేను భారత్లోనే గడిపాను. ఇది నా ఇల్లు. ఇది నా దేశం. ఈ 48 ఏళ్ల కాలమంతా బీజేపీ, ఆరెస్సెస్, ఇతర పార్టీలు పుట్టుక విషయమై నన్ను విమర్శిస్తూ సిగ్గుపడేలా చేద్దామనుకుంటున్నారు. నిజాయితీపరులైన తల్లిదండ్రులకు నేను పుట్టానని గర్వంగా చెప్తాను. వారి గురించి నేనెప్పుడూ సిగ్గుపడను. ఔను, నాకు ఇటలీలో బంధువులు ఉన్నారు. 93 ఏళ్ల నా తల్లి, ఇద్దరు చెల్లెళ్లు అక్కడే ఉన్నారు' అని సోనియా పేర్కొన్నారు. 'ఇక్కడే, ఈ గడ్డమీదనే నేను తుదిశ్వాస వదులుతాను. ఇక్కడే నా ఆస్తికలు నా ఆప్తులతో కలిసిపోతాయి. ఈ ఆత్మీయ భావనను ప్రధాని అర్థం చేసుకుంటారని నేను భావించను. కానీ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తాను' అని సోనియా భావోద్వేగంగా పేర్కొన్నారు. -
ముగ్గురు సినీనటుల పోటీ.. ఎవరిదో విక్టరీ
పఠానపురం(కేరళ): కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పఠానపురం నియోజకవర్గం నుంచి ముగ్గురు సినీనటులు పోటీ పడుతున్నారు. ఇక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా మలయాళ హీరో కె.బి.గణేశ్ కుమార్ ఉన్నారు. ఆయన మూడు సార్లు యూడీఎఫ్ నుంచి గెలుపొంది ప్రస్తుతం ఎల్డీఎఫ్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ప్రముఖ కమెడియన్ జగదీశ్ యూడీఎఫ్ నుంచి, విలన్ పాత్రలు పోషించే రఘు దామోదరన్ అలియాస్ భీమన్ రఘు బీజేపీ నుంచి నామినేషన్ వేయడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా ఉంది. ఓటరు ఏ నటుడికి పట్టం కడతాడో ఎన్నికల ఫలితాల వరకూ వేచిచూడాల్సిందే. మే 16న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.