breaking news
cattle meat ban
-
పాడి సంతలైన పశువుల సంతలు
సందర్భం కేంద్ర ప్రభుత్వం జంతువుల మార్కెట్ల క్రమబద్ధీకరణపై తీసుకొచ్చిన కొత్త నిబంధనల్లో గొడ్డు మాంసాన్ని నిషేధించలేదు. కేంద్రం అన్ని వాస్తవాలను సవివరంగా ప్రజానీకానికి వెల్లడిస్తే.. అసంపూర్తి సమాచారంపై ఆధారపడిన రాజకీయ పగలను నివారించవచ్చు. భారత ప్రభుత్వ పర్యావరణం, అడవుల మంత్రిత్వశాఖ 2017 మే 23న అన్ని రాష్ట్రాలలోను జంతువుల మార్కెట్లను క్రమబద్ధీకరించడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ మార్కెట్లు రైతులకు మాత్రమే ఉద్దేశించినవి. ఇక్కడ రైతులు వ్యవసాయ అవసరాల కోసం పశువులను కొనవచ్చు, అమ్మవచ్చు. జంతువులSపట్ల క్రూరత్వ నివారణ చట్టం క్రింద ప్రకటించిన ఈ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు.. 1. జిల్లా జంతువుల మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయాలి. 2. పశు వైద్యసేవలు, ఆశ్రయం, నీరు, పశుగ్రాసం వంటి అన్ని రకాల సౌకర్యాలను నిర్వహిం చాలి. ఈ నిబంధనలు ఆవులు, దూడలు, గేదెలు, ఒంటెలు, కోళ్ళు వంటి వాటికి వర్తిస్తాయి. కాని గొర్రెలకు, మేకలకు కాదు. ఈ వార్త మీడియాలో మే 25వ తేదీన వెలుగు చూసింది. 29వ తేదీన మద్రాస్ హైకోర్టు (మదురై బెంచి)లో కొందరు రాజ్యాంగ పరమైన అంశాలుపైకి చాలెంజ్ చేస్తే ఈ నోటిఫికేషన్ను నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ఫెడరల్ వ్యవస్ధని దెబ్బ తీస్తుంది కనుక దీన్ని మేం అమలు చేయమని ఒక సీఎం అన్నాడు. ఇంకో సీఎం అయితే తామే మిగిలిన సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నోటిఫికేషన్ని వ్యతిరేకిస్తాం అన్నాడు. మరో సీఎం ఇది కేంద్ర నోటిఫికేషన్, దీన్ని అమలు చేయకండి అని మాంస వ్యాపారాలకు పత్రికా ముఖంగా పిలుపునిచ్చాడు. ఒక పార్టీ కార్యకర్తలు బీఫ్ పెస్టివల్ పెట్టి ఒక దూడనే క్రూరంగా, అన్యాయంగా, చట్ట విరుద్ధంగా చంపి బహిరంగ విందు చేసుకున్నారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు, కొందరు విశ్లేషకులు, పరిశోధకులు, వకీళ్లు మీడియా ద్వారా కేంద్ర నోటిఫికేషన్ని వ్యతిరేకిస్తూ రకరకాల వాదనలు చేస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం, పశువుల పెంపకం రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశాలు అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఎందుకు ప్రకటించింది అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. 2014 నుంచి జరిగిన కొన్ని చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే అటువంటి ప్రశ్నలకు జవాబు లభిస్తుంది. ఆ వాస్తవాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి: గౌరి మలేఖ అనే జంతు సంక్షేమ కార్యకర్త సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 881/2014 నంబరుతో 2014లో దాఖలైన ఈ వ్యాజ్యంపై విచారణ 14 అక్టోబర్ 2014న మెుదలైంది. నేపాలీ హిందువులు ప్రతి ఐదేళ్లకోసారి గథిమా పండుగ జరుపుతారు. ఈ పండుగ ఆచారాలలో భాగంగా లక్షలాది పశువులను బలి ఇస్తారు. 2014లో జరిగిన పండుగలో దాదాపు 2.5 లక్షల పశువులను బలి ఇచ్చారని అంచనా. దీని కోసం మనదేశం నుండి లక్షల సంఖ్యలో పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. ఇలా జరుగుతున్న పశువుల అక్రమ రవాణాను నిరోధించడం ఈ వ్యాజ్యంలో ప్రధాన అభ్యర్థన. ఈ అక్రమ రవాణా వలన మన సరిహద్దు భద్రతాదళం వివిధ కార్యాచరణ సమస్యలను ఎదుర్కొంటోంది. హోం మంత్రిత్వశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ 203 సంఖ్య గల నివేదికలో పశువుల అక్రమ రవాణా గురించి చర్చిం చింది. నివేదికలో పేర్కొన్న గణాంకాల ప్రకారం ప్రతి ఏటా లక్షలాది పశువులను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపింది. సాధారణంగా ఈ విధంగా స్వాధీనం చేసుకున్న పశువులను కస్టమ్స్ శాఖకు అప్పగిస్తారు. గడచిన సంవత్సరాలలో వీరు స్వాధీనం చేసుకున్న పశువుల సంఖ్య : 2012–1,20,724, 2013–1,22,000, 2014–1,09,999, 2015–1,53,602. కమిటీ నివేదిక పేరా 2.6.9 లో ఈ విధంగా సిఫారసు చేసింది. ‘‘అన్ని రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్, అస్సాం వైపు పశువుల సామూహిక గమనం జరుగుతున్నదని కమిటీ అంగీకరిస్తోంది. సరిహద్దు రాష్ట్రాల వైపుగా జరుగుతున్న పశువుల గమనాన్ని ఆపడంలో వివిధ రాష్ట్రాల పోలీసు దళాలు విఫలమయ్యాయని, పశువుల కదలికలను అడ్డుకోవడంలోను లేదా ఆపడంలోను పశ్చిమ బెంగాల్ పోలీసులు విఫలమయ్యారని కమిటీ భావిస్తోంది. లోతుగా పాతుకుపోయిన దుష్ట సంబంధాలే ఈ సమస్య విస్తరించడానికి కారణమని, దీనిని పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం ఈ మూలాలపై దెబ్బతీయాలని కమిటీ భావిస్తోంది’’. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, త్రిపుర, రాష్ట్ర ప్రభుత్వాలను కక్షిదారులుగా చేర్చింది. పశువుల అక్రమ రవాణాను నిరోధించడానికి ముసాయిదా మార్గదర్శకాలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్ను సుప్రీంకోర్టు కోరింది. ఈ వ్యాజ్యంపై విచారణ 14 సార్లు జరిగింది. 12 జూన్ 2016 న సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చింది. వీటి ప్రకారం జంతువుల పట్ల క్రూరత్వ నివారణ చట్టం క్రింద నిబంధనలను మూడు నెలలలోపు ప్రకటించాలని కేంద్ర పర్యావరణం, అడవుల మంత్రిత్వశా ఖను కోరింది. తదనుగుణంగా 16 జనవరి 2017న పర్యావరణం, అడవుల మంత్రిత్వశాఖ ముసాయిదా నిబంధనలను విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలను ఆహ్వానించింది. కొత్త నిబంధనల ప్రకారం జంతువుల మార్కెట్లు రైతుల కోసం ఉద్దేశించినవి కనుక, అక్కడ వ్యవసాయేతర అవసరాలకు జంతువులను కొనాలనే వారుగాని, అమ్మాలనుకునే వారుగాని, వధశాలల ప్రతినిధులు గాని వ్యవహారాలు జరుపకూడదు. వధించడం కోసం జరిగే జంతువుల క్రయ, విక్రయాలు ఈ మార్కెట్ల వెలుపలే జరగాలి. అయితే, ఆ విధంగా విక్రయించే అన్ని జంతువుల ఆరోగ్యం గురించి పశువైద్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. 31 మే 2017 న కేరళ హైకోర్టు ఈ నియమాల రాజ్యాంగ బద్ధతను ధ్రువీకరిస్తూ, ఈ నియమాలు గొడ్డు మాంసాన్ని నిషేధించలేదని, యదార్థంగా ఈ నియమాలను పూర్తిగా చదవకుండానే ప్రజలు స్పందిస్తున్నారని చెబుతూ, దీనిపై వచ్చిన అభ్యర్థనను రద్దు చేసింది. పై వివరణను అర్థం చేసుకున్న వాళ్లకి కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్య నిస్సందేహంగా సత్యమనే అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నియమాలను ప్రకటించే ముందు అన్ని వాస్తవాలను సవివరంగా ప్రజానీకానికి వెల్లడిస్తే ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాలను ప్రజలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, దాంతో ప్రజాధన వృధాను, అసంపూర్తి సమాచారంపై ఆధారపడిన రాజకీయ పగలను నివారించవచ్చు. వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ ఛైర్మన్ పి. వేణుగోపాల్ రెడ్డి 9490470064 -
వధ పేరుతో రాజకీయ వంటకం
రెండో మాట సమాజంలో కొందరికి ‘అంత్యజులు’ (ఆఖరివాళ్లు) ముద్రవేసి మానవులన్న మాట మరిచి, వారిని సమాజ బహిష్కృతులుగా ఎప్పటికీ పరిగణించేందుకే– దళిత, మైనారిటీ ప్రజా బాహుళ్యం ఆహార అలవాట్లపై సరికొత్త మార్గంలో దండయాత్ర ప్రారంభమైందని భావించాల్సి వస్తోంది. అప్పుడు వేదం వింటే చెవుల్లో సీసం పోయమన్నారు. నేడు గోమాంసం తింటే నోట్లో సున్నం కొట్టమంటున్నారు. యాజ్ఞవల్క్య మహామునికి మాత్రం గొడ్డు మాంసం అంటే మహా ప్రీతి అని వైదికార్యులే పేర్కొన్నారు. ‘వధ నిమిత్తం విక్రయించేందుకు పశువులను సంతలకు తరలించడాన్ని నిషేధిస్తూ గత నెల (మే 23న) జారీ చేసిన అధికారిక ప్రకటనను పునఃసమీక్షించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ ప్రకటన ఉద్దేశం ప్రజల ఆహారపు అలవాట్లను మార్పించడం మాత్రం కాదు. ఈ అంశం తన గౌరవానికి భంగకరమని ప్రభుత్వం భావించడం లేదు.’ – హర్షవర్ధన్ (కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, 4–6–17) ‘జంతువులను క్రూరంగా హింసించే పద్ధతిని నిరోధించే పేరుతో కేంద్రం తాజాగా రూపొందించిన నిబంధనల ప్రకారం ముందుకు వెళితే ఆహార అవసరాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం పశువులను వినియోగించడం దుర్లభమవుతుంది. ఎందుకంటే, ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనల ప్రకారం తన పశువులపైన యాజమాన్య హక్కును నిరూపించుకోవడం సామాన్య రైతులకు కష్టసాధ్యమైన విషయం. జంతు బలి నిషేధం పేరుతో ప్రభుత్వం తలపెట్టిన చర్య– గ్రామీణ ఆర్థికవ్యవస్థలో కీలకమైన పశుసంపద వ్యాపార లావాదేవీల నిర్వహణ కోసం ఏర్పడిన సంతలను దెబ్బతీసి, వాటిపై ఆధారపడిన దళిత, మైనారిటీ వర్గాల జీవన మార్గాన్నే దెబ్బతీస్తుంది. ప్రభుత్వ చర్య వల్ల ఇప్పటికే క్రయవిక్రయ మార్కెట్లో ధరలు 60 శాతం పడిపోయాయి.’ – పాలగుమ్మి సాయినాథ్ (ప్రసిద్ధ పత్రికా రచయిత, 4–6–17) ఎలాంటి ప్రయోజనం లేకుండా వ్యాపారి వరదలో ప్రయాణానికి సిద్ధపడడు. అలాగే రేపటిరోజున జరిగే అర్థంతర, మధ్యంతర ఎన్నికలలో పాక్షిక ప్రయోజనాల కోసమే బీజేపీ పాలనా వ్యవస్థ కుల, మత, వర్గ, వర్ణ వివక్షా విధానాలను బాహాటంగానే అనుసరిస్తున్నది. అవే వేధింపులు. అదే హింసాకాండ. ఇంతకు ముందు కూడా కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు ఇలాంటి అలవాటు ఉంది. ఆ ఉభయపక్షాలు మనకు తెలియకుండానే, మన కళ్లముందే దేశ విభజన సిద్ధాంతాన్ని మరింత గోప్యంగా, మరొక దారిలో చాపకింద నీరులా తీసుకువస్తున్నాయి. అందుకే జంతు హింసా నిరోధక చట్టానికి సవరణ పేరుతో, సరికొత్త నిబంధనల పేరుతో విభిన్న ఆహారపు అలవాట్లపైన దాడి చేయడానికి, సమాజ విభజన కోసం జరుగుతున్న ప్రయత్నం గురించి చైతన్య భారతం తక్షణం మేల్కొనవలసి వచ్చింది. అది రాష్ట్రాల పరిధిలోనిది నిజానికి జంతుబలులనూ, యజ్ఞయాగాదుల పేరిట జరిగే జంతు హింసనూ సుప్రీంకోర్టు ఎప్పుడో నిషేధించింది. అయినా ఇంకా కొనసాగుతూ ఉండడానికి అసలు కారణం– పాలక రాజకీయ పక్షాలు (కాంగ్రెస్, బీజేపీ) మైనారిటీల, దళితుల ఓట్ల కోసం సుప్రీంకోర్టు ఆదేశాలను సుగ్రీవాజ్ఞలుగా శిరసావహించడానికి నిరాకరిస్తూ రావడమే. ఇప్పుడు కూడా పశువుల విక్రయాన్ని నిషేధించే నిబంధన వెనుక రహస్యం–దళితవర్గాల, ముస్లిం మైనారిటీల, ఆదివాసీ సంచారజాతుల మాంసభక్షణ అలవాట్లను మార్చడమే. గోమాంసం సహా, విభిన్న పశుజాతుల మాంసం వీరు తీసుకుంటారన్నది సత్యం. గోమాంస ఉత్పత్తులు, తోళ్ల మీద ఆధారపడిన దేశవాళీ చర్మకారుల వృత్తులు, పాదరక్షల పరిశ్రమ వంటి వాటితో జరిగే ఎగుమతుల విలువ లక్ష కోట్ల రూపాయలని (ఏడాదికి) ఒక అంచనా. ఇవన్నీ ఎలా ఉన్నా, పశువుల క్రయవిక్రయాలకు సంబంధించి పాలనాపరంగా వినిపించిన పెద్ద అబద్ధం ఒకటి ఉంది. ఇది ఈ నిషేధం దరిమిలా జరిగిన చర్చలలో వెల్లడైంది. మద్రాసు హైకోర్టులో జరిగిన ఈ చర్చ విన్న తరువాత కేంద్రం తాజా నిబంధనలలో రెండింటిని నాలుగు వారాలపాటు అమలు కాకుండా ఆ కోర్టు నిలిపివేసింది. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తూ ఒక దరఖాస్తును హైకోర్టుకు సమర్పించారు. ఆ సందర్భంలోనే న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వ పరిధిని గురించి గుర్తు చేశారు. ‘పశువధ అంశమే కేంద్రం పరిధిలోనిది కాదు, రాజ్యాంగం ప్రకారం అది రాష్ట్రాల పరిధిలోనిది మాత్రమే, సెక్యులర్ భారతదేశంలో ఇది రాష్ట్రాల జాబితాలోనిదే’అని న్యాయమూర్తులు స్పష్టం చేయవలసి వచ్చింది. పిటిషనర్ తరఫున వాదించిన మరొక సీనియర్ న్యాయవాది, ‘కేంద్రం విధించిన నిబంధనల ప్రకారం దేశంలోని ఏ ప్రాంతంలోను పశువులను విక్రయించడానికి వీలులేకుండా సంతల పరిధిని నిర్వచించార’ని పేర్కొన్నారు. ‘నేను అమ్మదలుచుకున్న పశువులను నా ఇంటి దగ్గర కూడా అమ్మలేను, కొనలేను. ఇదీ నా పరిస్థితి’అని కూడా ఆయన న్యాయమూర్తులకు విన్నవించారు. ఈ వివాదంలో మరొక కోణం ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పేమా ఖందూ కేంద్ర ప్రకటనను విమర్శించారు. ‘పశుహింస నిషేధం పేరుతో ఈశాన్యభారత వాస్తవ సమస్యలను పక్కదారులు పట్టిస్తున్నారు’అని బీజేపీ ముఖ్యమంత్రి పేమా ప్రధాని మోదీ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని దక్షిణ, తూర్పు భారత రాష్ట్ర ప్రభుత్వాలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్లు కూడా వ్యతిరేకించాయి. వేదమంత్రాలతో మాయ విచిత్రాలన్నీ మన దేశంలోనే జరుగుతూంటాయనిపిస్తుంది. బౌద్ధ, జైన ధర్మాలు భారత భూమిని ప్రగతిశీల దృక్పథంతో సాకినంతకాలం (రెండువేల సంవత్సరాలు); ఆచరణలో అహింసకూ, సామాజికుల మధ్య సమధర్మానికీ, న్యాయానికీ పాదులు తీసి, నీరుపెట్టి పోషించినంతకాలం; యజ్ఞయాగాదులను, పశుబలులను నిషేధించి సమాజంలో శాంతిని నెలకొల్పినంతకాలం ఎలాంటి గొడవలూ లేవు. కానీ యజ్ఞయాగాల ఆధారంగా రాజ్య విస్తరణ తలపెట్టినప్పుడు, బౌద్ధ ధర్మ వ్యాప్తివల్ల తమ ఉదర పోషణకు ఇబ్బందులెదురయ్యాయని యాజ్ఞికులు, ఛాందసులు గ్రహించడం మొదలైనప్పుడు ఆ బౌద్ధానికి వ్యతిరేకంగా కత్తులు దూశారు. ఈ సందర్భంగా వేదమంత్రాల పేరుతో ప్రజలను ఎలా మూర్ఖులుగా (ఛాందసులుగా) మలచవచ్చునో నిరూపించడానికి ఒక ‘గారడీ’ ప్రయోగం చేశాడు: ‘భారతదేశంలో నేను గనుక కొన్ని వేద మంత్రాలను తీసుకొని, గారడీ చేసి వాటికి విపరీతార్థాన్ని చెప్పడం మొదలెడితే.. ఆలోచనా శక్తి లేని మూర్ఖులు (ఛాందసులు) తండోపతండాలుగా నా వెంట నడుస్తారు, నమ్మండి’’ అన్నారు స్వామీ వివేకానందులు. యూపీ, మరో నాలుగు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో లబ్ధి కోసం బీజేపీ చెప్పిన నల్లధనం మంత్రం కూడా వివేకానందుడు చెప్పిన ప్రయోగం లాంటిదే. వేద కాలంనాటి (తొలి వైదికం, అనంతర వైదిక యుగాలు) భారతీయ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసిన దేశీయ, పాశ్చాత్య మహా మహా పండితులు రైస్ డేలిస్, విట్నా, మాక్స్ముల్లర్లతో పాటు, రామకృష్ణ పరమహంస, తులసీదాసు, రాహుల్ సాంకృత్యాయన్, లక్ష్మణ శాస్త్రి, జోషీ, పండిత శ్రీరామ శర్మ ఆచార్య, స్వామి రామతీర్థ, విద్యానంద ‘విదేహ’– ఇలా ఎందరెందరో మహానుభావులు వైజ్ఞానికంగా, వాస్తవ ప్రపంచానికి హేతుయుక్తంగా వేదాలకు భాష్యాలు చెప్పారు. పాలక వర్గాల మాదిరిగా పెడార్థాలు తీయలేదు. బుద్ధుడి ప్రగతిశీల భావనా ప్రపంచం లాంటివే స్వామి ‘రామతీర్థ’ ప్రవచనాలు కూడా. అందుకే ఆది వైదికం వేరు. అనంతర వైదికం స్వార్థ బుద్ధులతో కూడిన విద్య అయింది. ‘మూఢులు కాకండి. కళ్లు మూసుకుని దేనినీ నమ్మకండి. వేదాలను కొంతమందిలా గుడ్డిగా వల్లించకండి. ఇతరుల ప్రమాణాలను తీసుకొని దేనినీ నమ్మకండి. నీవే స్వయంగా ప్రయోగశాలలో పరీక్షించు. నీ స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను అమ్ముకోవద్దు’అన్నాడు స్వామి రామతీర్థ. గోమాంస భక్షణ, యజ్ఞయాగాదుల్లో పశుబలులు కొత్తగా వచ్చినవి కావు, విదేశీ ఆర్య సంస్కృతి దిగుమతితో ప్రారంభమై, వైదిక యుగానంతర వైదికం నుంచీ రుషులు అసంఖ్యాకంగా అన్ని రకరకాల మాంస రుచుల్ని మరిగినవారే. ‘సుర’(కల్లు) లేనిదే ‘జర కిక్కు’ లేదు. ఛాందస వర్గాలన్నీ నాడు ఈ ఆహారపు అలవాట్లను సమర్థించినవే. ఏ ‘మిల్’అనే బ్రిటిష్ వలసవాద చరిత్రకారుడు భారత చరిత్రను సమన్వయ దృష్టితో కాకుండా ముస్లిం యుగం, బ్రిటిష్ యుగం, హిందూ యుగంగా మత ప్రాతిపదికమీద విభజిం చినది మొదలు ఈ రోజుదాకా అదే విభజనను ఆధునిక భారత పాలకులు కూడా కొనసాగిస్తున్నారు. అందుకే డాక్టర్ అంబేడ్కర్ ‘మేధావులనబడే మహర్షులు కూడా ఏమీలేని అశ్లీల వేదాలను పట్టుకుని పాకులాడుతూ, మహోన్నతంగా పరిగణించడం ఆశ్చర్యకరం’అన్నాడు. ఆవు ఒక్కటే పవిత్రమైనదా? సమాజంలో కొందరికి ‘అంత్యజులు’(ఆఖరివాళ్లు) ముద్రవేసి మానవులన్న మాట మరిచి, వారిని సమాజ బహిష్కృతులుగా ఎప్పటికీ పరిగణించేందుకే– దళిత, మైనారిటీ ప్రజా బాహుళ్యం ఆహార అలవాట్లపై సరికొత్త మార్గంలో దండయాత్ర ప్రారంభమైందని భావించాల్సి వస్తోంది. అప్పుడు వేదం వింటే చెవుల్లో సీసం పోయమన్నారు. నేడు గోమాంసం తింటే నోట్లో సున్నం కొట్టమంటున్నారు. యాజ్ఞవల్క్య మహామునికి మాత్రం గొడ్డు మాంసం అంటే మహా ప్రీతి అని వైదికార్యులే పేర్కొన్నారు. చివరికి ‘గౌ’ అసలర్థం వేరు. వేదభాషలో ఒక్కో మాటకు అనేక అర్థాలున్నందున నేడు బీజేపీ శాఖీయులు ప్రచారం చేసే ‘గౌ’శబ్దాన్ని వేద భాషలో ‘ఆవు’కు ఉపయోగించనే లేదని వేదమూర్తి పండిత శ్రీరామశర్మ ఆచార్య రాస్తున్నారు. ‘గౌ’ అనే మాటను ఆవునుంచి లభించే పాలు, పెరుగు, పేడ, మూత్రం, దూడలు అనే అర్థంలో వాడారని స్పష్టం చేశారు. ‘యజ్ఞం’ మాటకు ‘సేవ’ అని, నవ కల్యాణం అనీ అర్థం. కానీ నేటి ‘యజ్ఞం’ ప్రభు వర్గాలకు, వారి ‘సేవ’ల్లో మునిగి సంపాదనా సేవలో తేలుతూన్న పాలకులు, ఛాందసులూ తరించడానికి చిట్కాలయ్యాయి. హేతువాదం నశించింది. ప్రాణికోటిలో ప్రతి జీవి ఒక ప్రాణిగా పవిత్రమైనదే. ఆవు ఒక్కటే పవిత్రమైనది కాదు. సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in