
స్ఫూర్తి ప్రదాత గాంధీజీ
ఏలూరు టౌన్: మహాత్మాగాంధీజీ ఆశయాలైన సత్యం, అహింస, దేశభక్తి మార్గాల్లో నడవాలని, సత్ప్రవర్తనతో కొత్త జీవితాలు మొదలు పెట్టేందుకు సిద్ధం కావాలని ఖైదీలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి హితవు పలికారు. ఏలూరులోని ఏలూరు వన్టౌన్లోని జిల్లా కేంద్ర కారాగారంలో గురువారం గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఆమె గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఖైదీలు తమ పాత జీవన విధానాన్ని విడిచిపెట్టి నూతన జీవనం ప్రారంభించాలని ఆకాంక్షించారు. ఎందరో శిక్ష అనుభవించిన అనంత రం మంచిగా మారి సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు పొందారన్నారు. న్యాయసేవా ధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడు తూ జిల్లా జైలులోని ఖైదీలకు ఉచిత న్యా యసహాయం అందిస్తున్నామనీ, బెయిల్ వస్తే ష్యూరిటీ మొత్తం కట్టుకోలేని రిమాండ్ ఖైదీలకు ప్రభుత్వమే ఆ డబ్బులు చెల్లించి విడుదల చేయిస్తున్నామని తెలిపారు. జైలు సూపరింటెండెంట్ సీహెచ్ఆర్వీ స్వామి, జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ప్రతినిధులు కూన కృష్ణారావు, లేళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ అబ్బూరి అరుణ, వైద్య అధికారి డాక్టర్ స్వరూప్, న్యాయవాదులు మునేశ్వరరావు, వెంకటేశ్వరరావు, జైలర్లు వి.రమేష్, కె.శ్రీనివాసరావు, కె.వీర వసంతరావు ఉన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): టైమ్ బౌండ్ ప్రమోషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీపీహెచ్సీడీఏ) ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. పీహెచ్సీ వైద్యులు పదోన్నతులు లేక ఇబ్బంది పడుతున్నారని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు తమ న్యాయమైన హక్కు అని నినదించారు. పీహెచ్సీ వైద్యులు కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షించారన్నారు. పదోన్నతుల కోసం ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఉద్యమ బాట పట్లామన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వైద్యాధికారులు కోరారు.
భీమవరం (ప్రకాశంచౌక్): స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రస్థాయిలో ఒకటి, జిల్లాస్థాయిలో 49 అవార్డులు గెలుపొందినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. 17 విభాగాల్లో నిర్వహించిన సర్వేలో అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారన్నారు. రాష్ట్రస్థాయిలో బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ విభాగంలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో బొబ్బిలి రామాంజనేయులను ఎంపిక చేశారన్నారు. అలాగే జిల్లాస్థాయిలో బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్స్, బెస్ట్ స్వచ్ఛత ఎన్జీవోస్, బెస్ట్ స్వచ్ఛత వారియర్స్, స్వచ్ఛ అంగన్వాడీలు, బెస్ట్ బస్స్టేషన్, స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, స్వచ్ఛ ప్రభుత్వ హాస్పిటల్స్, స్వచ్ఛ వసతి గృహాలు, స్వచ్ఛ పరిశ్రమలు, స్వచ్ఛ మున్సిపాలిటీస్, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ఎస్, స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్ విభాగంలో మొత్తం 49 అవార్డులకు ఎంపికై నట్టు కలెక్టర్ వివరించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరంలో ఈనెల 10న నిర్వహించనున్న పెన్షన్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతి ప్రియ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. పెన్షన్ అదాలత్–ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎట్ యువర్ డిస్ట్రిక్ట్ కార్యక్రమాన్ని జిల్లాల వారీగా చేపట్టామన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తామని రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. ప్రభుత్వ శాఖల డ్రాయింగ్ ఆఫీసర్లు, పెన్షన్ మంజూరు అధికారులకు మార్గనిర్దేశం, ఉద్యోగులు, పెన్షనర్లకు పెన్షన్ ప్రతిపాదనలపై అవగాహన కల్పించడం, ఫిర్యాదుల పరిష్కారం, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు.

స్ఫూర్తి ప్రదాత గాంధీజీ