
ఒక్కచాన్స్ ప్లీజ్!
● టికెట్ల కోసం ఆశావహుల ఆరాటం ● నేతల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు ● అభ్యర్థిత్వం ఖరారు కోసం యత్నాలు ● జిల్లాలో వేడెక్కిన స్థానిక సమరం
‘ఎప్పట్నుంచో పార్టీని పట్టుకొని తిరుగుతున్న.. రాకరాక రిజర్వేషన్ సౌకర్యం కలిసొచ్చింది.. మన పార్టే అధికారంలో ఉంది.. టికెట్ ఖరారు చేస్తే నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికవుత.. ప్లీజ్.. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నా’ అంటూ ఆశావాహులు కొందరు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అన్నా.. ఒకేఒక్క చాన్స్ ఇవ్వండని, కచ్చితంగా గెలిచి చూపెడతామని నిత్యం నేతల ఇళ్లచుట్టూ తిరుగుతూ ప్రాధేయపడుతున్నారు.
సాక్షి పెద్దపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. కలిసొచ్చిన రిజర్వేషన్లతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. తొలుత ప్రాదేశిక ఎన్నికలు జరగనుండగా.. వీటిని పార్టీ సింబల్తో నిర్వహించనున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్లు దక్కించుకునేందుకు ఆశావహలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
నేతలను ప్రసన్నం చేసుకునేందుకు..
అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఆశావహులు స్థానిక ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశించేవా రు మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రు. బీజేపీ టికెట్లు ఖరారు చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ సీనియర్లతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు.
ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం
ప్రధాన పార్టీలు స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలను అత్యధికంగా గెలుచుకోవాలని కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఇందుకోసం ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. ప్రతీ స్థానం నుంచి రెండు, మూడు పేర్లతో కూడిన జాబితా తీసుకుని ప్రజాదరణ ఉన్నవారిని ఎంపిక చేసేలా కసరత్తు చేస్తున్నాయి. బలాలు, బలహీనతలు, సామాజికవర్గాల మద్దతు, ఖర్చు భరించేస్థాయి, పరపతి గలవారు?.. ఇలా అన్ని కోణాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ఆరా తీస్తున్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించి వడపోత తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేయాలని అన్ని పార్టీల నేతలు లక్ష్యంగా నిర్దేశించారు. స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అంశంపై హైకోర్టు తీర్పు అనంతరం అభ్యర్థుల ప్రకటన చేయాలని, అప్పటివరకు ఎవరికీ భరోసా ఇవ్వొద్దనే భావనలో ఉన్నారు.
కమిటీలతో ఎంపిక
రాష్ట్రంలో అధికారం, జిల్లాలోని అన్ని అసెంబ్లీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ అన్నిస్థానాల్లో హస్తం పాగా వేసేలా కాంగ్రెస్ నేతలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, జిల్లాలో క్లీన్స్వీప్ చేయాలని కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రంలోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ముగ్గురు చొప్పున ఆశావహులను ప్రతిపాదించి జిల్లా ఇన్చార్జి మంత్రికి నివేదించేలా జిల్లా కాంగ్రెస్ కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. పీసీసీ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పార్టీ ఎమ్మెల్యేల సూచనలను పరిగణనలోకి తీసుకొని గెలిచే అవకాశం ఉన్నవారినే ప్రతిపాదించేలా ముందుకు సాగుతున్నారు.
కమలంలో గెలిచే వారికే టికెట్లు..
ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, దీనిని ఆసరాగా చేసుకుని బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) యోచిస్తోంది. మెజార్టీ స్థానాల్లో పాగావేసి కమలం సత్తా చా టాలని ఉవ్విళ్లూరుతోంది. కమలం పార్టీలో నెలకొ న్న గ్రూపులు, వర్గాలకు తావులేకుండా గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని జిల్లా పార్టీ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో నేతలు నిర్ణయించారు.
మాజీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే..
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాభిమా నం చూరగొన్నామని, ఇదే ఊపుతో అత్యధిక స్థానా లు కై వసం చేసుకోవాలని కారు పార్టీ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అసెంబ్లీ ఇన్చార్జీలు, మాజీ ఎ మ్మెల్యేలే బీ–ఫారాలు ఇవ్వనున్న నేపథ్యంలో.. ఆ శావహలు వారిచుట్టే తిరుగుతున్నారు. కోర్టు తీర్పు అనంతరమే పేర్లు ప్రకటించాలని భావిస్తున్నారు. మొత్తంగా ప్రధాన పార్టీలు ఆశావహుల బలాబలాలపై క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకుంటుండం.. ఆశావహులు నేతలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నం కావడం రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి.