
ఓట్ చోర్ గద్ది చడో పాదయాత్ర
జయపురం: మహాత్మా గాంధీ జయంతి నాడు అవిభక్త కొరాపుట్ మల్కన్గిరి జిల్లా మోటు నుంచి ప్రారంభించిన ‘ఓట్ చోర్ గద్ది చడో’ పాదయాత్ర శనివారం మధ్యాహ్నాం జయపురం చేరింది. పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ దాస్, విధానసభలో కాంగ్రెస్ నేత, పొటగి ఎమ్మెల్యే రామ చంద్ర కడమ్, పీసీసీ ఉపాధ్యక్షులు సంతోష్ సింగ్ సాలుజ, పీసీసీ మాజీ ఉపాధ్యక్షులు నీరజ శంకర్, మాజీ ఎమ్మెల్యే భుజబల మఝి, రాష్ట్ర సేవాదల్ అధ్యక్షుడు శుభేందు మహంతి, మీడియా సెల్ అధ్యక్షులు అరవింద దాస్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ చంద్ర మహంతి, మల్కన్గిరి మాజీ ఎమ్మెల్యే నిమయి చరణ సర్కార్ తదితరులు శనివారం మధ్యాహ్నం జయపురం చేరగా వారికి స్థానిక ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షీ బాహిణి పతి, కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, లక్ష్మీపూర్ ఎమ్మెల్యేలతో పాటు అనేకమంది జిల్లా కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. పీసీసీ అధ్యక్షులు భక్త చరణ దాస్కు పూల మాలలతో స్వాగతం పలికారు. ‘ఓట్ చోర్ గద్ది చడో’ నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. నేతలు డీసీసీ భవనానికి చేరుకొని అక్కడ ఉన్న మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో భక్త చరణ దాస్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అబద్ధపు వాగ్దానాలు చేసి ఓట్లు దొంగిలిచి అధికారం చేపట్టారని దుయ్యబట్టారు.ఉభయ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల అరికట్టటంలో బీజేపీ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ కుతంత్రాలను, ఓట్ల చోరీ సంఘటనలను వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ మల్కనగిరి జిల్లా మోటు నుంచి గాంధీ మార్గంలో శాంతియుతంగా పాదయాత్ర చేపట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత నేత రాహుల్ గాంధీ సూచనతో రాష్ట్రంలోని 314 సమితిలలో ఆరు వేల కిలోమీటర్ల పాదయాత్ర జరుపుతున్నామన్నారు. రోజుకు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. పాదయాత్ర సందర్భంగా బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల సంతకాల సేకరణ జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే బాహిణీపతి మాట్లాడుతూ.. ఓట్ చోర్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని అన్నారు. కొరాపుట్ జిల్లాలో లక్ష సంతకాలు చేయించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఓట్ చోర్ గద్ది చడో సంతకాల పోస్టర్ను ఆవిష్కరించారు.

ఓట్ చోర్ గద్ది చడో పాదయాత్ర

ఓట్ చోర్ గద్ది చడో పాదయాత్ర

ఓట్ చోర్ గద్ది చడో పాదయాత్ర