మిర్యాలగూడలో నిలిచిన ఫలక్నూమా ఎక్స్ప్రెస్
మిర్యాలగూడ అర్బన్ : హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నూమా ఎక్స్ప్రెస్ ఇంజన్లో సాంకేతిక సమస్య కారణంగా మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో సోమవారం నిలిచిపోయింది. సోమవారం హౌరా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ మిర్యాలగూడ సమీపంలోకి రాగానే ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది రైల్వేస్టేషన్లోని ఫ్లాట్ఫాం–1 లో రైలును నిలిపివేశారు. స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు రామన్నపేట రైల్వేస్టేషన్ నుంచి మరో రైలు ఇంజన్ రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. గంటన్నర తరువాత వచ్చిన రైలు ఇంజన్ సహాయంతో రైలు బయలు దేరింది. గంటన్నర సమయం మిర్యాలగూడలో రైలు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చివరకు రైలు కదలడంతో ఊపిరి పిల్చుకున్నారు.
మూసీకి పెరిగిన వరద
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు సోమవారం వరద ప్రవాహం పెరిగింది. ఆదివారం సాయంత్రం 2,248 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సోమవారం ఉదయానికి ఒక్కసారిగా 8,761 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఐదు క్రస్ట్గేట్లను పైకెత్తి 7,137 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 533 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 644.15 అడుగుల(గరిష్ట నీటిమట్టం 645 అడుగుల) వద్ద స్థిరంగా ఉంచుతూ ఎగువ నుంచి వస్తున్న వరదను విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.
బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి
నల్లగొండ టూటౌన్ : స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి కోరారు. సోమవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను సేకరించేందుకు మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి మండలం నుంచి మూడు పేర్లను జిల్లా కార్యాలయానికి పంపాలని.. ఆ పేర్లను ఈ నెల 8న నల్లగొండకు వస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్కు అందిస్తామని తెలిపారు. సమావేశంలో నాయకులు బొగరి అనిల్ కుమార్, గోలి మధుసూదన్రెడ్డి, వీరేల్లి చంద్రశేఖర్, పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, పోతెపాక సాంబయ్య, మంగళపల్లి కిషన్, బాకి నరసింహ, వెంకట్రెడ్డి, కొత్తపల్లి వెంకట్, రుక్మగౌడ్, పంజాల యాదగిరి, నాగరాజ్గౌడ్ పాల్గొన్నారు.
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
గుర్రంపోడు : సెలవుల అనంతరం విద్యార్థుల హాజరును రెండురోజుల్లో వందశాతం పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బి.భిక్షపతి అన్నారు. సోమవారం గుర్రంపోడులోని కేజీబీవీ, పిట్టలగూడెం ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. కేజీబీవీలో సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థునులను రప్పించేలా తల్లిదండ్రులతో మాట్లాడాలని సిబ్బందికి సూచించారు. కేజీబీవీలో వంట గది, స్టోర్రూమ్ను పరిశీలించి ఎస్ఓ విజయశ్రీకి సూచనలు చేశారు. పిట్టలగూడెం పాఠశాలల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు అద్దంకి సునీల్కుమార్, నర్సింహ ఉన్నారు.
మిర్యాలగూడలో నిలిచిన ఫలక్నూమా ఎక్స్ప్రెస్
మిర్యాలగూడలో నిలిచిన ఫలక్నూమా ఎక్స్ప్రెస్


