Hyderabad Police Bust Nepali Gang For 5 Cr Burglary, Arrest Them At Border - Sakshi
Sakshi News home page

బోర్డర్‌లో చిక్కిన నేపాలీ ముఠా సూత్రధారులు

Jul 26 2023 8:30 AM | Updated on Jul 26 2023 8:30 AM

చోరీ సొత్తును చూపుతున్న పోలీసు అధికారులు (ఇన్‌సెట్‌లో) నిందితులు - Sakshi

చోరీ సొత్తును చూపుతున్న పోలీసు అధికారులు (ఇన్‌సెట్‌లో) నిందితులు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నేపాలీ గ్యాంగ్‌ ఇటీవల ఓం టవర్స్‌లో చేసిన భారీ చోరీ కేసును పోలీసులు కొలిక్కి తెచ్చారు. ఈమేరకు రూ.41 లక్షల నగదుతో పాటు రూ.5 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇంత తక్కువ కాలంలో అరెస్టులు, ఈ స్థాయిలో రికవరీ ఇదే తొలిసారని కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. నార్త్‌జోన్‌ డీసీపీ చందనా దీప్తి, టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.

ఆరేళ్లు నమ్మకంగా పనిచేసి...

నేపాల్‌కు చెందిన షాకర్‌ మాన్‌సింగ్‌ సౌద్‌ అలియాస్‌ కమల్‌ తన భార్య పార్వతి, కుమారుడు వికాస్‌ సౌద్‌లతో కలిసి నగరానికి వలసవచ్చాడు. ఆరేళ్లుగా పీజీ రోడ్‌లోని ఓం టవర్స్‌కు వాచ్‌మెన్‌గా పని చేస్తూ అక్కడే గదిలో కుటుంబంతో ఉండేవాడు. ఇదే అపార్ట్‌మెంట్‌లో స్టీల్‌ వ్యాపారి విజయ్‌ కుమార్‌ గోయల్‌ కుటుంబం నివసిస్తోంది. కాపలా కాయడంతో పాటు వాహనాలు శుభ్రం చేయడం, ఇంటి పనులు చేసి పెట్టడం తదితర కార్యకలాపాలతో కమల్‌ అందరి వద్దా నమ్మకం సంపాదించుకున్నాడు. ఉమ్మడి కుటుంబమైన విజయ్‌ వద్ద భారీగా బంగారు, వజ్రాభరణాలతో పాటు నగదు ఉంటుందనే విషయం తెలుసుకున్న కమల్‌ అదును చూసుకుని పంజా విసరాలని నిర్ణయించుకున్నాడు.

మరో రెండు నేపాలీ కుటుంబాలతో కలిసి.

ఈ విషయాన్ని పక్క అపార్ట్‌మెంట్స్‌లో పని చేసే లాల్‌ సింగ్‌ థాపా, సునీల్‌ చౌదరిలకు చెప్పాడు. ఈ నెల 9న విజయ్‌ కుటుంబం రెండు రోజుల పాటు మెయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు వెళ్తున్నట్లు తెలుసుకున్న కమల్‌ అదే రోజు చోరీకి స్కెచ్‌ వేశాడు. వీరితో పాటు పుణేలో పని చేస్తున్న తన సోదరుడు మోహన్‌ సౌద్‌, అతని భార్య భారతి సౌద్‌, కుమారుడు విశాల్‌ సౌద్‌, ఇతడి భార్య పూజ సౌద్‌లతో పాటు బ్రిజేష్‌ నాథ్‌, అతడి భార్య బర్షా నాథ్‌లకు చెప్పాడు. వీరూ చోరీ చేయడానికి ముందుకు వచ్చారు. తాళాలు పగులకొట్టడంలో నేర్పరి అయిన భరత్‌ బిస్తాను కూడా కమల్‌ తమ ముఠాలో చేర్చుకున్నాడు. వీరందరూ నగరానికి చేరుకుని మధ్యాహ్నం వరకు కమల్‌ గదిలోనే ఉండి పార్టీ చేసుకున్నారు. ఆపై ప్రకాష్‌నగర్‌లోని మోహన్‌ ఇంటికి వెళ్ళారు. అక్కడే మహిళలు ఉండిపోగా..పురుషులు వచ్చి విజయ్‌ ఇంట్లో చోరీ చేశారు.

సొత్తు పంచుకుని పుణే మీదుగా...

వీరంతా కమల్‌ గదిలోనే కూర్చుని సొత్తు పంచుకున్నారు. ఆపై ద్విచక్ర వాహనం, ఆటోల్లో ప్యారడైజ్‌ వరకు వెళ్లి అక్కడ భోపాల్‌ వెళ్లే బస్సు ఎక్కాలనుకున్నారు. అది మిస్‌ కావడంతో కూకట్‌పల్లి చేరుకుని అక్కడ నుంచి బస్సులో ముంబై వెళ్లారు. అంతా కలిసి ఒకే చోట ఉంటే ఇబ్బందని భావించిన వీళ్ళు అక్కడ మూడు బృందాలుగా విడిపోయారు. కమల్‌, పార్వతి, సునీల్‌ సగం సొత్తు, నగదుతో పుణే, గుజరాత్‌ మీదుగా లక్నో చేరుకున్నారు. మోహన్‌, విశాల్‌, వికాస్‌, బ్రిజేష్‌, బర్షా, పూజ కొంత సొత్తుతో కాన్పూర్‌, లక్నో మీదుగా సరిహద్దులకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. భరత్‌, తాప బెంగళూరు చేరుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చోరీ విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, నార్త్‌జోన్‌ పోలీసులు కమల్‌ రూమ్‌ పరిశీలించి వారు చేసిన నేరంగా తేల్చారు. ప్రకాష్‌నగర్‌ నుంచి మోహన్‌ కుటుంబం కూడా పరారు కావడంతో నిర్థారించుకున్నారు.

ఎస్‌ఎస్‌బీ పోలీసుల సహకారంతో...

ఈ మూడు బృందాల కోసం విమానాల్లో పుణే, ముంబై, లక్నోలతో పాటు నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న బర్సోలా చెక్‌ పోస్టు వద్దకు పోలీసు బృందాలు వెళ్లాయి. కమల్‌ తదితరులు లక్నో నుంచి వినోద్‌ కుమార్‌కు చెందిన ఇన్నోవా కారులో సొత్తుతో సహా బర్సోలా వైపు పయనమయ్యారు. అప్పటికే నగర పోలీసులు అక్కడ ఉండే సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) అధికారులకు వీరి ఫొటోలు పంపి అప్రమత్తం చేశారు. కమల్‌ కుటుంబాన్ని రిసీవ్‌ చేసుకోవడానికి నేపాల్‌ నుంచి వచ్చిన దీపక్‌ కొద్దిసేపు వేచి చూసి వెనక్కు వెళ్ళిపోయాడు. దీంతో వాళ్ళు కచ్చితంగా ఆ మార్గంలోనే వస్తారని భావించిన అధికారులు నిఘా ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇన్నోవాలో వస్తున్న ముగ్గురూ ఎస్‌ఎస్‌బీతో పాటు అక్కడే ఉన్న నగర పోలీసులకు సొత్తుతో సహా చిక్కారు. వినోద్‌కు నోటీసు ఇచ్చిన పోలీసులు అతడి వాహనం సీజ్‌ చేశారు.

ఎవరూ అనుమానించరని వెనక్కు వచ్చి...

మోహన్‌తో కూడిన మరో బృందం ఈ నెల 11న ఝాన్సీ, గ్వాలియర్‌ మీదుగా లక్నో వెళ్లడానికి ప్రయత్నించిన విషయం సాంకేతిక నిఘా ఆధారంగా నగర పోలీసులు గుర్తించారు. దీంతో వీరిని పట్టుకోవడానికి లక్నోలో ఉన్న పోలీసు టీమ్‌ ప్రయత్నాలు మొదలెట్టింది. గ్వాలియర్‌ వద్ద ఓ దాబాలో భోజనం చేసిన మోహన్‌ తదితరులు అక్కడ మరో బస్సు ఎక్కడానికి ప్రయత్నించారు. వర్షం కారణంగా కాలు జారి పడిన మోహన్‌ మోకాలి చిప్ప విరిగింది. మధుమేహ బాధితుడైన ఇతడి చేతికి అప్పటికే ఇన్‌ఫెక్షన్‌ సోకింది. దీంతో వైద్యం అత్యవసరం కావడంతో అతడిని తీసుకుని మిగిలిన వాళ్ళు సిటీకి వచ్చేశారు. తాము తిరిగి హైదరాబాద్‌ వస్తామని ఎవరూ అనుమానించరని భావించి యశోద ఆస్పత్రిలో చేర్పించారు. సాంకేతిక నిఘా ఆధారంగా పోలీసుల బ్రిజేష్‌ కొత్త సిమ్‌ వాడుతున్నట్లు గుర్తించారు. అతడి నుంచి ఎక్కువ కాల్స్‌ వెళ్తుడటంతో ప్రకాష్‌నగర్‌లోని మోహన్‌ ఇంటిపై దాడి చేసిన పోలీసులు నిందితులను పట్టుకుని మరికొంత సొత్తు రికవరీ చేశారు. వీరిచ్చిన సమాచారంతో యశోద ఆస్పత్రిలో మోహన్‌ను అరెస్టు చేశారు. ఈ నిందితుల నుంచి పోలీసులు రూ.41.60 లక్షల నగదు, 2.8 కేజీల బంగారం, వజ్రాభరణాలు, 9.56 కేజీల వెండి ఆభరణాలు, 10 ఖరీదైన వాచీలు, డాలర్లు, యూరోలు, దిరమ్స్‌ సహా 85 శాతం సొత్తు రికవరీ చేశారు. మిగిలిన 15 శాతం పరారీలో ఉన్న భరత్‌, భారతి, పూజ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక బృందం ముమ్మరంగా గాలిస్తోంది.

సిటీలోనే పట్టుబడిన మరికొందరు

కొలిక్కివచ్చిన ఓం టవర్స్‌ భారీ చోరీ కేసు

తొమ్మిది మందిని పట్టుకున్న నగర పోలీసులు

రూ.41 లక్షలతో పాటు రూ.5 కోట్ల సొత్తు స్వాధీనం

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement