breaking news
Synthetic chemicals
-
ఊపిరాడక ఇద్దరి మృత్యువాత
రేణిగుంట (తిరుపతి జిల్లా): ఇక్కడి గాజులమండ్యం కెమికల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గురువారం ఇద్దరు యువకులు కెమికల్ సింథటిక్ ట్యాంకును శుభ్రంచేస్తూ మృతిచెందారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం వెలుగుచూసింది. గాజులమండ్యం సీఐ ఆరోహణరావు, ఎస్ఐ ధర్మారెడ్డి కథనం మేరకు.. మండలంలోని పిల్లపాళెం దళితవాడకు చెందిన క్రిష్ణయ్య, సుబ్బరత్నమ్మ కుమారుడు నరేంద్ర (23), గంగయ్య, చిన్నక్క కుమారుడు వెంకటేష్ (22) గాజులమండ్యంలోని సాయిరాధా బయోటెక్ కెమికల్ కర్మాగారంలో పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీలోని కెమికల్ వేస్టేజ్ ఆయిల్ ఉన్న పెద్ద సింథటిక్ ట్యాంకును గురువారం మధ్యాహ్నం శుభ్రంచేసేందుకు తొలుత నరేంద్ర ట్యాంకులోకి ఇనుప నిచ్చెన వేసుకుని దిగాడు. ట్యాంకులోపల ఉన్న కెమికల్ వేస్టేజ్ ఆయిల్ ఘాటైన వాసన వెదజల్లడంతో దాన్ని పీల్చి క్షణాల్లో అపస్మారక స్థితికి చేరుకుని కిందపడిపోయాడు. పైనున్న వెంకటేష్ అతన్ని కాపాడేందుకు ట్యాంకులోకి దిగి అతను కూడా ఆ వాసన పీల్చాడు. దీంతో ఇద్దరూ ట్యాంకులో సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడున్న వారు ట్యాంకును పగలగొట్టి వీరిద్దరినీ బయటకు తీసి తిరుపతి రుయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కర్మాగారానికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. మృతుల కుటుంబీకుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని.. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే చర్యలు చేపడతామని సీఐ తెలిపారు. ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు మృత్యువాత పడిన యువకులిద్దరికీ తల్లిదండ్రులు లేరు. నరేంద్ర తల్లిదండ్రులు క్రిష్ణయ్య, సుబ్బరత్నమ్మ పదేళ్ల కిందటే మరణించగా.. అతన్ని చిన్నాన్న వెంకటరమణ చేరదీశాడు. మరో యువకుడు వెంకటేష్ తల్లిదండ్రులు గంగయ్య, చిన్నక్క కూడా కొన్నేళ్ల కిందట మృతిచెందడంతో వెంకటేష్ ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేస్తూ బతుకుతున్నాడు. -
జుట్టుకు జామ...
బ్యూటిప్స్ జుట్టు ఎంత పొడవున్నా జీవం లేనట్టుగా.. పొడిబారిపోయి కనిపిస్తూంటే ప్రయోజనం ఏముంది... అందుకు ఇంట్లోనే ఓ ఔషధం తయారు చేసుకోవచ్చు. గుప్పెడు జామాకులను నీళ్లలో బాగా మరిగించాలి. తర్వాత ఆకులను తీసేసి నీరు గోరువెచ్చగా అయ్యాక ఆ నీటితో మాడుకు మర్దన చేయాలి. ఓ 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. జామాకుల్లో ఉండే పోషకాల వల్ల జుట్టు కుదుళ్లు దృఢపడటమే కాకుండా హెయిర్ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. తలకు కృత్రిమ రసాయనాలతో తయారైన కండిషనర్లకు బదులు గ్రీన్ టీని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. షాంపూతో కానీ కుంకుడురసంతో కానీ తలస్నానం చేసి తర్వాత గ్రీన్ టీని రాసుకొని రెండు నిమిషాలు ఆగి చల్లటి నీటితో జుట్టును కడిగేసుకోవాలి. తల దురదగా ఉండటానికి పేలు, చుండ్రు మాత్రమే కాదు అలర్జీ కూడా కారణమే. దీనిని నివారించాలంటే మెంతి ఆకుల పేస్టును తలకు పట్టించి, అరగంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేస్తే సరి... వారానికి రెండు సార్లైనా ఈ చిట్కా పాటిస్తే అలర్జీ నుంచి తప్పించుకోవచ్చు. -
వంగ బంగారమే
* సీతాఫలం, కలబంద, వేపాకుల కషాయంతో పురుగులు పరారీ * సింథటిక్ రసాయనాల అవసరం లేదు * ప్రకృతి సేద్య పద్ధతిలో పూర్తిగా విషరహితమైన పంట * సేంద్రియ ఎరువుతో దీటైన దిగుబడి ఎప్పుడో ఏళ్లనాటి మాట. ఒక ఊరిలో ఇద్దరు అత్తాకోడళ్లు.. అత్తగారు కాకిని తోలిన ఎంగిలి చేయిని కూడా కోడలి ముందు విదిల్చేది కాదట. అంత వేధించి వేపుకు తింటున్నా.. కోడలు కొడిగడుతున్న ప్రాణాలు కండ్లలో పెట్టుకొని కాపాడుకుంటూ బతుకెళ్లదీస్తున్నది. ఇంతలో అత్తగారికి కాలం మూడింది. మహిషవాహనుడి పరివారం వచ్చి అమ్మా.. ఇక్కడి నీ పెత్తనానికి సెలవిచ్చి మాతో తరలిరా అని ఆదేశించారట. మంచం మీద వాలి యమభటుల ఆదేశాలందుకొని అలాగే కనుమూసుకొందట. కోడలు నాడి పట్టుకు చూసి అత్త పుటుక్కుమందని గ్రహించేసింది. ఎన్నాళ్ల నుంచో అన్నపానీయాలకు మొహం వాచి పోయి ఉందేమో... అప్పటికే అత్తవారు వండి ఉట్టి మీద పెట్టిన వంకాయ కూర కుండను దించి కంచంలో వేడి అన్నం పెట్టుకొని వంకాయ ముక్కలు అంచుకు ఇంత నెయ్యి వేసుకొని కొసిరి కొసిరి కొరుకుతూ... అత్తో.. అత్తా.. వంకాయ తొడిమి వేయించి తింటున్న లేవమ్మ లే.. నీకింత పెడతమ్మా లేవమ్మ లే.. అంటూ రాని దుఃఖంతో కాకి శోక రాగం అందుకుందట. అప్పటికే యమభటుల వారెంట ఊరుదాటి వెళ్లిన ఆ తల్లి వంకాయ తొడిమ వేపుడు మాట వినగానే భటులవారిని నాలుగు భజాయించి పోండేహె.. వంగతోట ఒడిసిన తరువాత వచ్చి కనపడండి. అప్పటి వరకూ సచ్చినా వచ్చేది లేదు అని దబాయించేసి.. మంచం మీద లేచి కూర్చొని కోడలిని కోటొక్కతిట్లు తిట్టడం మొదలు పెట్టిందట. ఇది కథ. వంకాయ ప్రశస్తిని చెప్పే ఇలాంటి కథలు పుంఖాను పుంఖాలు. వంకాయ అంటే నోరూరని వారెవరూ ఉండరనేది అతిశయోక్తి కాదు. ఇంత ప్రశస్తి పొందిన వంకాయను పండించడం కూడా అంతే గగనం. మనుషులకే కాదు చీడపీడలకు కూడా వంగ తోట ప్రీతి పాత్రమే. అందుకే మొక్క ఆరాకుల దశకు ఎదిగింది మొదలు వివిధ రకాల పురుగులు దాడి మొదలు పెడతాయి. ఇందులో మొదటిది కాండం తొలిచే పురుగు, తరువాత దశలో వచ్చేది కాయతొలిచే పురుగు. చీడపీడల ఉధృతిని గమనించే పెద్దలు వంగ పండించినోడు ఏ పంట సాగుకూ వెనుకాడడన్నారు. వంగ మీద చీడపీడలను అదుపు చేసి ఫలసాయం అందుకో గలిగినవాడు ఏ పంట యాజమాన్యమైనా చేయగలడన్నది పెద్దల మాట. అయితే ఆధునిక వ్యవసాయపద్ధతిలో వంగ పంట తీయాలంటే తోటను నిత్యం పురుగుమందుల్లో జలకాలాడించాల్సిందే. మిరప తరువాత అతి ఎక్కువగా పురుగు మందుల వాడకం వంగ తోటలోనే అన్నది అతిశయోక్తి కాదు. పురుగు మందు చల్లిన మరుసటి రోజే కాయలు కోసి మార్కెట్కు తరలించాల్సిన పరిస్థితి. ఎంతో ఇష్టంగా వంకాయను ఆరగించే వినియోగదారుడు దానిలో ఇంకిపోయిన విషాన్ని కూడా భుజిస్తున్న పరిస్థితి. విషరహితమైన వంకాయలు తినాలంటే ప్రకృతి సేద్య విధానమొక్కటే మార్గం. అందుకే ప్రకృతి సేద్య విధానంలో వంగ తోట సస్యరక్షణ నిర్వహణను తెలుసుకుందాం. ఇది ఉష్ణమండలపు కూరగాయ. విటమిన్ ఎ, బి పుష్కలంగా లభించే వంకాయను మధుమేహ రోగులూ తినొచ్చు. సాగు విధానం: వంగసాగుకు దుక్కి చేసేముందే దుక్కిలో పశువుల ఎరువు, కోడి పెంట సమపాళ్లలో వేసుకొని దుక్కి చేసుకోవాలి. వంగ మొక్కలు నాటుకోవడంతో పాటు చుట్టూ ఎరపంటగా ఆముదం వేసుకోవాలి. ఇది క్రిమికీటకాలను ఆకర్షించడం వలన ప్రధాన పంటకు రక్షణలభిస్తుంది. అంతర పంటగా వంగతోటలో ఉల్లి, వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వలన కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగుల బెడద తగ్గుతుంది. అంతర పంటగా సోయకూర వేసుకోవడం మంచిది. ఇది కూడా కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులను దరి చేరనీయదు. మొక్క 50 రోజుల వయసు వచ్చే నాటికి ఎకరాకు 40 కిలోల వేపగింజల చెక్క వేస్తే దిగుబడి పెరుగుతుంది. తామర పురుగుల నివారణకు 4 కిలోల వేపగింజల పొడి, 4 కిలోల సన్నగా తరిగిన కలబందను 100 లీటర్ల నీటిలో 10 రోజుల పాటు ఊరనివ్వాలి. ఈ ద్రావణాన్ని వడకట్టుకొని పిచికారీ చేస్తేతామరపురుగు, ఇతర రసం పీల్చే పురుగుల బెడద ఉండదు. పసుపు పొడి, బూడిద సమపాళ్లలో కలిపి ఉదయం వేళల్లో ఆకుల మీద చల్లితే పచ్చదోమ, తెల్లదోమ దరి చేరవు. వంగ తోటకున్న మరో బెడద పిండినల్లి. దీన్ని సున్నం చల్లి నివారించవచ్చు. మొక్క మొదలుకు వేప చెక్క వేస్తే.. వేరు, కాండం కుళ్లును నివారిస్తుంది. కాండం తొలిచే పురుగు, పెంకు పురుగు, కంపు నల్లిని నివారించడానికి సీతాఫలం, వేపపిండి కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ముద్దగా నూరిన కిలో సీతాఫలం ఆకులు, కిలో వేప చెక్క, 2.5 లీటర్ల ఆవుమూత్రంలో ఒక రోజంతా నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని వడకట్టి పిచికారీ చేస్తే కాండం తొలిచే పురుగులతో పాటు అన్ని రకాల కీటకాలు పోతాయి. ప్రకృతి సేద్య విధానం అనుసరిస్తున్న రైతులు అనేక మంది ఈ విధంగా వంగ సాగు సాధ్యమేనని విజయవంతంగా చాటుతున్నారు. - జిట్టా బాల్రెడ్డి, సాగుబడి డెస్క్