breaking news
Narla Venkateswara Rao
-
అయినా పేషెంటునే!
పత్రికా సంపాదకులు నార్ల వేంకటేశ్వరరావు గంభీర స్వభావులన్న సంగతి చాలామందికి తెలుసు. కానీ సంభాషణా చతురులనీ, హాస్య కుశలురనీ తెలిసినవాళ్లు కొద్దిమందే. నార్ల వారి ఉత్తరాల్లో ఆయన హాస్య చమత్కారాలు మబ్బుల చాటున మెరుపుతీగల్లాగా మెరిసిపోతుంటాయి. 1981లో ఆయన సీతజోస్యం నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. నేను ఆ పుస్తకం గురించి వ్యాసం రాస్తున్నాననీ, వారి జీవిత రచనా విశేషాలు తెలపమని ప్రార్థిస్తూ వారికి ఓ ఉత్తరం రాశాను. మరుటపాలో ఓ చిన్న ఇంగ్లిష్ పుస్తకంతో పాటు ఓ టైపు చేయబడ్డ ఉత్తరం వచ్చింది. నార్ల ఇలా రాశారు: ‘‘నాకు ఐదుమంది కొడుకులు. ఐదుగురూ డాక్టర్లే. ఐదుమంది కోడళ్లు కూడాడాక్టర్లే. వీళ్లంతా విదేశాల్లో స్థిరపడ్డారు. నా ముగ్గురు కుమార్తెలూ, అల్లుళ్లూ డాక్టర్లే. ఒక్క కూతురూ, అల్లుడు మాత్రమే ఇక్కడ వున్నారు. మరి నాకేమో రెండు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. మా కుటుంబంలో నా భార్య తప్ప మిగతావారంతా డాక్టర్లే. ఆమెకు కూడా ఏ విశ్వవిద్యాలయమైనా గౌరవ డాక్టరేట్ ఇస్తే బావుంటుంది. అప్పుడు మా ఇంట్లో అందరూ డాక్టర్లే అవుతారు. కాని ఇంతమంది డాక్టర్లున్నా నేనెప్పుడూ పేషెంటునే. తల నుంచి కాలు దాకా నేనో రోగాల పుట్ట.’’ నార్ల వారి అరుదైన చమత్కార మాటలివి. -పినాకిని -
ఒక ఖైదీ ప్రేమకథ
దొంగతనానికి ఇంట్లో జోరబడ్డాడని కేసు పెట్టి, అతడికి ఒక్క సంవత్సరం శిక్ష వేశారు. కోర్టులో ఆ ముసలివాడి ధోరణీ, నేరం జరిగిన పరిస్థితులూ వింతగా తోచినందున ఖైదీని చూడడానికి అనుమతిని సంపాదించాను. మొట్టమొదట్లో అయితే నీతో నాకేమిటి పొమ్మన్నాడుగాని, చాలా అనునయించిన తర్వాత, తన జీవితకథను చెప్పడానికి అంగీకరించాడు. ‘‘మీ ఊహ నిజమే. నేను బ్రతికి చెడినవాణ్ణి. బాగా చదువుకున్నాను. ఇంజనీరింగ్ నా వృత్తి. కుర్రతనంలో చేతిలో కాస్తో కూస్తో పైసా ఆడుతూ ఉండేది. అది పెట్టి సరదాగా బతుకుతూవుండేవాణ్ణి. ప్రతిసాయంత్రం తప్పకుండా విందుకుగాని, డాన్సుకుగాని పోతూ వుండేవాణ్ణి. రాత్రి అయ్యేసరికి తప్పతాగి ఈ లోకంలో వుండేవాణ్ణికాదు. ఆరోజు నాకు మహాజ్ఞాపకం. అప్పటి అతిసామాన్య విషయాలు సైతం పూర్తిగా గుర్తున్నాయి. అయినా, నా స్మృతిపథంలో కొంత వెలితి ఉంది. దాన్ని పూడ్చుకోవడానికి నా క్షుద్ర జీవిత శేషాన్ని వినియోగిస్తాను. నైనాతో సంబంధం వున్న ప్రతి విషయాన్నీ జ్ఞాపకం తెచ్చుకోవాలనే నా యత్నం. ఆవిడ పేరు నైనా. సందేహం లేదండీ, నైనాయే ఆవిడ పేరు! నైనా భర్తకు రైల్వేలో చిన్న ఉద్యోగం. వాళ్ళు పేదవాళ్ళు. అయితేనేమి? తన బుద్ధిసూక్ష్మత కొద్దీ దారిద్య్రముద్రాంకితులైన స్వీయజీవితపరిసరాలను నైనా సుమధురం చేసుకునేది. ఇంటి పనులన్నింటినీ స్వయంగా చక్కబెట్టుకునేది. అయినా, నైనా చేతులు పల్లవకోమలంగా వుండేవి. అతి సామాన్యమైన దుస్తులు ధరించేది. అయినా అవి స్వప్నజగత్తును స్ఫురింపజేసేవి. మీరు నమ్మండి, నమ్మకపోండి ఈ ప్రపంచం కూడా ఆమె సన్నిధానంలో స్వర్గతుల్యం అయ్యేది. నేను సైతం ఆవిడ పరిచయం ఏర్పడ్డ తర్వాత కొత్తవాణ్ణి అయిపోయాను. ఆ పుణ్యమూర్తి సందర్శన భాగ్యం వల్ల నాలోని మాలిన్యం తొలిగిపోయింది. ‘ఈ దౌర్భాగ్యుణ్ణి ప్రేమించిన పాపం ఆవిడకు చుట్టకోకుండా వుండాలి! దుర్భరమైన పరిసరాలలో, మొరటు మానవుల మధ్య బతుకుతూ వున్న నైనా, అందచందాలు, యవ్వనమూ వున్న నన్ను, ఎన్నో ప్రేమగీతాలు కంఠస్థంగా వచ్చిన నన్ను...ప్రేమించకుండా వుండలేకపోయింది. ఎప్పుడు, ఎక్కడ, ఏవిధంగా నాకు ఆవిడతో ప్రథమ పరిచయం కలిగిందో చెప్పమంటే సరిగా చెప్పలేను. విస్తృతి తమస్సును చీల్చుకుని, ఒకదానితో ఒకటి సంబంధం లేని ఆవిడ జ్యోతిర్మయ చిత్రాలు మాత్రం నాకు కనబడుతూ వుంటాయి. ఇదిగో చూడండి.. సంతోషంగా, ఆనందంగా వుంది. తన్మయత్వంలో నాటకాన్ని చూస్తూవుంది. నాపై దరహాస మధువు చిలుకుతూ వుంది... ఆ దరహాసం నాకు బాగా జ్ఞాపకం. ఆ తర్వాత ఇద్దరమూ కలిసి ఎక్కడికో వెళ్లాము. ఆవిడ నా ముఖంలో ముఖం పెట్టి ‘నాకు తెలుసు, నా ఈ సుఖస్వప్నం త్వరలోనే తెగిపోతుంది. అయినా జీవించాననే సంతృప్తి మిగులుతుందిగా! అంతేచాలు’ అని అంది. ఈ మాటలు నాకు బాగా గుర్తు. కాని ఆ తరువాత ఏంజరిగిందో తెలియదుగానీ, నైనాతో కలిసి వుండగానే ఇదంతా జరిగిందా అని అడిగితే మాత్రం ఖండితంగా ఏమిచెప్పలేను. సందేహం లేదండి, నేనే నైనాను పరిత్యంజించాను. ఇది నా దృష్టికి అతి సహజంగా కనబడింది. అప్పటి నా స్నేహితులందరూ సరిగ్గా ఇలాగే ప్రవర్తించేవారు. ఎవతో ఒక వివాహితతో నాలుగురోజుల పాటు కులాసాగా గడపడం, ఆ తర్వాత ఆవిణ్ణి తోసిపారవెయ్యడం! అందరిలా నేను కూడా నడుచుకున్నాను. తప్పు చేస్తున్నాను కదా అని అప్పటిలో నాకు తోచనైనా లేదు. డబ్బు దొంగిలించడం, అప్పులు ఎగవెయ్యడం, సి.ఐ.డీగా పనిచెయ్యడం తప్పుగాని, ప్రేమించిన వనితను పరిత్యజించడం మామూలే! నా జీవితం, నా భవిష్యత్తు వదులుకుని, ప్రేమాగీమా అంటూ ఎవర్తెనో ఒకర్తెను కనిపెట్టుకుని వుంటానా? తెగతెంపులు చేసుకుపోవడం నిజంగా బాధగా అనిపించింది. అయినా గుండె రాయి చేసుకున్నాను. నైనా భర్తకు దక్షిణాదికి ఎక్కడికో బదిలీ అయ్యిందనీ, అక్కడికి వెళ్లిన కొద్దిరోజులకే ఆవిడ చనిపోయిందని విన్నాను. అయితే, నైనాతో గడిపిన ఆ రోజులు జ్ఞాపకం వస్తే అతి బాధాకరంగా వుండేది. అంచేత, ఆవిణ్ణి గురించిన వార్తలు నా చెవిన పడకుండా తప్పించుకు తిరిగేవాణ్ణి. ఆవిణ్ణి గురించి ఆలోచించకుండా వుండాలని కూడా ప్రయత్నించేవాణ్ణి. ఆవిడ బొమ్మను దేన్నీ దగ్గర వుంచుకోలేదు. ఆవిడ రాసిన ఉత్తరాలను తిరిగి ఆవిడకే ఇచ్చేశాను. మమ్మల్ని పరస్పరం ఎరిగున్న మిత్రులు ఎవ్వరూ లేరు. ఈ కారణాల వల్ల నైనా చిత్రం క్రమక్రమంగా నా హృదయఫలకం నుంచి చెరిగిపోయింది. ఈ చోద్యం విన్నారా? క్రమక్రమంగా నైనాను నేను మరిచిపోయాను! ఆవిడ ముఖాన్నీ, ఆవిడ పేరునూ అన్నింటిని మరిచిపోయాను. ఆవిడ నా హృదయకవాటాలను తెరుచుకొని, అసలు ఎన్నడూ లోనికి తొంగైనా చూడనట్లే అయిపోయింది. ఇంత సంపూర్ణంగా విస్మరించగల తన శక్తిని చూసుకుని పురుషుడు నిజంగా సిగ్గు పడాలి సుమండీ! సంవత్సరాలు దొర్లిపోయాయి. నా వృత్తిలో ఎలా ప్రవేశించానో, ఎలా నెగ్గుకు వచ్చానో...ఆ వివరాలు మీకు అనవసరం. నైనా లేకపోయిన తర్వాత లౌకికవ్యవహారాల్ని గురించి, ధనార్జన్ని గురించీ మాత్రమే నా కలలన్నీ! ఒక సమయంలో నేను ఆశించిన విజయాన్ని దాదాపుగా పొందాను కూడా! వేలకు వేలు ఖర్చుపెట్టగలిగాను. విదేశ పర్యటన సైతం చెయ్యగలిగాను. వివాహం చేసుకున్నాను. సంతానం కూడా కలిగింది. ఆ తర్వాత చేపట్టిన ప్రతిపనీ మసికాసాగింది. వేసిన ప్లానులన్నీ తప్పిపోయాయి. భార్య చనిపోయింది. ఒంటిగాణ్ణి. పిల్లల్ని సాకలేక, వాళ్లను బంధువుల పైకి తోలివేశాను. వాళ్లు బతికి బట్టకట్టిందీ, లేందీ అయినా నాకు తెలియదు. నా అంతటి పాపాత్ముడు మరి వుండబోడుకదండీ! తర్వాత నేనేమి చేసింది వేరే చెప్పాలా? తప్ప తాగేవాణ్ణి...ఏజెన్సీ అంటూ ప్రారంభించాను. కాని దాని వల్ల ఏమీ లాభించలేదు. అప్పటికి మిగిలి వున్న కొంచెం ధనాన్ని, శక్తినీ అది మింగివేసింది. వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలనీ, తిరిగి పూర్వస్థితికి రావాలనీ జూదానికి దిగాను. దానిలో అబ్బింది ఏమిలేదు సరికదా, జైల్లో పడవలసిన యోగం కొద్దిలో తప్పిపోయింది. ఉన్న స్నేహితులు మోసం చేశారు. అక్కడి నుంచి అథఃపతనం ప్రారంభం! నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు మీరు వచ్చి చూశారే, ఈ స్థితికి దిగజారాను. ఉన్నత సంఘంలో నుంచి ఈ అగాథంలోకి తలకిందులుగా పడిపోయాను. కుళ్లు బట్టలతో ఉండే నేను ఏ మొహం పెట్టుకుని నలుగురిలో తిరగ్గలను? ఇటీవల కొన్ని సంవత్సరాల పాటు, తాగుడు లేని రోజుల్లో అప్పుడప్పుడూ ఫ్యాక్టరీలలో కూలీ చేస్తూ వచ్చాను. ఇలా కూలి చేస్తూ వుండగా, పురుగు తొలిస్తే చాలు, తిరిగి నేనూ నా తాగుడూ తయ్యార్. ఈ స్థితిలో వుండి కూడా నా పరిచయాల్ని చూస్తే నాకు అసహ్యమే! హఠాత్తుగా ఎప్పుడో అదృష్టచక్రం తిరుగుతుందనీ, తిరిగి సంపన్నుడనౌతాననీ కలలుగంటూ వుండేవాణ్ని. ఆకాశం నుంచి ఏదైనా వారసత్వం ఊడిపడుతుందనీ, ఇలాంటిదే మరేదైనా విచిత్రసంఘటన జరుతుందనీ ఊహలు పోతూవుండేవాణ్ణి. సరే, ఒకనాడు ఆకలిదప్పులతో నకనకలాడుతూ...అలా ఎందుకు వెడుతున్నానో కూడా తెలియకుండా ఒక పెరట్లోకి వెళ్లాను. వెళ్లేసరికి...‘ఇదిగో అబ్బీ! తాళాలు బాగు చేసేవాడివా?’ అని వంటమనిషి అడిగాడు. ఔనన్నాను. ఆ ఇంటి వారి రైటింగ్ టేబుల్ తాళం చెడిపోయింది, దాన్ని బాగు చేసేవాడు కావలసి వచ్చాడు. ఆ గది చిత్రపటాలతో, ఇతర అలంకారాలతో శోభయమానంగా ఉంది. పని ప్రారంభించి రిపేర్ పూర్తి చేశాను. ఇంటి ఇల్లాలు ఒక రుబుల్ ఇచ్చింది. డబ్బు చేతిలో వేయించుకున్నానో లేదో చిన్ని తెల్లటి పీఠం మీద పెట్టి ఉన్న స్ఫటికవిగ్రహం నాకంటబడింది. ఎంచేతనోగాని వెంటనే తలతిరిగినట్టయ్యింది. రెప్ప వాల్చకుండా అలాగే చూశాను. చూసి, నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను...నైనా!! నైనాను పూర్తిగా మరిచిపోయానని ఇదివరకే మనవి చేశాను కదా! అయితే ఆవిణ్ణి మరిచిపోయిన సంగతిని మొట్టమొదటిసారిగా గ్రహించినది ముఖ్యంగా అప్పుడే! ఆ క్షణంలోనే! ఒక్కసారిగా ఆవిడ అమృతమూర్తి నా మనోనేత్రం ఎదుట ప్రత్యక్షమైంది. నిద్రాణాలై, నిర్జీవాలై వున్న తలపులు, స్వప్నాలు, భావనలు ఒక్కుమ్మడిగా తిరిగి లేచాయి. జీవించాయి! ఆపాదమస్తకం కంపించిపోతూ ఆ స్ఫటిక విగ్రహానికి కళ్ళు రెంటినీ అప్పగించి, ‘అమ్మా! అది ఎవరి ప్రతిమో అడగవచ్చునా?’ అని వినయపూర్వకంగా ప్రశ్నించాను. ‘అదేనా? అది అమూల్యమైంది. అయిదువందల సంవత్సరాల క్రితం, పదిహేనో శతాబ్దిలో దాన్ని చెక్కారు. చెక్కిన వాడి పేరు కూడా ఆవిడ చెప్పింది. కాని, సరిగ్గా వినబడ లేదు. ఆవిడ భర్త దాన్ని ఇటలీ నుంచి తెచ్చాడట. దాన్ని గురించి ఇటాలియన్, రష్యన్ ప్రభుత్వాల మధ్య చాలా ఉత్తరప్రత్యుత్తరాలు కూడా నడిచాయట. అయితే ఈ విగ్రహం నీ మెప్పు పొందినట్టుందే! ఖర్మం!’ అంటూ ఆవిడ చరచర వెళ్ళిపోయింది. ఉక్కిరిబిక్కిరి అవుతున్నవాడిలా బయటికి వచ్చి పడ్డాను. ఇది వట్టి పోలిక కాదు. కేవలం అచ్చు! అంతేకాదు దాన్ని స్ఫటికశిలలో పునఃసృష్టి చెయ్యడం! నేను ఎరిగున్న ఆ స్త్రీ వదనబింబాన్ని పదిహేనో శతాబ్దంనాటి శిల్పి ఏ విధంగా సృష్టించగలిగాడో మీరు రవ్వంత చెప్పలగలరా? అచ్చంగా ఒక మాదిరినే ఉండే స్త్రీలు, ఒకరు పదిహేనో శతాబ్దంలోనూ, ఒకరు మన జీవితకాలంలోనూ వుండడం ఎలా సాధ్యం? ఏమీ సందేహం లేదు. శిల్పి చెక్కిన ఆ స్త్రీ నైనాయే! ఇద్దరూ సరిగ్గా ఒక్కటే! ఈ పోలికలు బాహ్యాకృతిలోనే కాదు...ప్రవృత్తిలోనూ, అంతరంగంలోను కూడా! ఆరోజు నా జీవితాన్ని మార్చివేసింది. నా పూర్వజీవితంలోని నైచ్యాన్నీ, నా పతనం యొక్క పరిమితినీ గ్రహించాను. పరమేశ్వరుడు నైనా అనే దేవతను పంపిస్తే, ఆవిణ్ణి గుర్తించలేకపోతినిగదా! అని తెలుసుకున్నాను. గతించినదానికి వగచి లాభం లేదు. అంచేత, అమూల్యమైన పుష్పధామం పగిలిపోతే, ఆ ముక్కల్ని చేర్చుకునేవాడిలా నైనా స్మృతి ఖండాలను పోగు చేసుకోవడం ప్రారంభించాను. అబ్బో! ఆ స్మృతిఖండాలు ఎంత స్వల్పం! ఎన్ని విధాల ప్రయత్నించినా, సంపూర్ణకృతి కుదర్నేలేదు. అన్నీ ముక్కలు, పెంకులు! కాని, వాటితోనే నా భావనావీధిలో కొత్తకొత్త ఆకృతుల్ని కల్పించుకోగలిగినప్పుడు ఎంత పొంగిపోతూవుండేవాణ్ణి! వీటిని గురించి ఆలోచిస్తూ, వీటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ గంటలకొద్దీ అలా గడిపి వేసేవాణ్ణి! నన్ను చూసి ప్రజలు నవ్వేవారు. కాని నా ఆనందం వారికేమి తెలుసు? నేను ముసలివాడినైపోయాను. తిరిగి జీవితాన్ని ప్రారంభించలేను. కాని, కనీసం నా అంతరాత్మ మాలిన్యాన్ని అయినా కడిగి వేసుకోలేకపోతానా? ఎలాగైనా సరే, ఇంకొక్కసారి ఆ శిలావిగ్రహాన్ని చూడాలనే కోరిక కలిగింది. ఆ ఇంటి చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేశాను. కిటికీలకు దూరంగా పెట్టారు ఆ విగ్రహాన్ని. అంచేత అది ఎన్నడూ నా కంట బడలేదు. ఎన్నో రాత్రులు ఆ ఇంటి ముందు గడిపేశాను. అక్కడ ఎవరెవరు నివసిస్తున్నారో ఏయే గది ఎలా వుంటుందో అంతా నాకు తెలుసు. ఇంటి నౌఖర్లలో ఒకడితో స్నేహం కూడా చేశాను. వేసవిలో ఇంటి ఇల్లాలు బంధుమిత్రులను చూసి రావడానికి కాబోలు వెళ్లింది. అప్పటికి నా ప్రగాఢవాంఛను ప్రతిఘటించలేకపోయాను. ఇంకొక్కసారి నైనా విగ్రహాన్ని చూడగలిగితే సర్వం జ్ఞాపకం తెచ్చుకోగలననిపించింది. అలా జ్ఞాపకం తెచ్చుకోగలిగితే ఇక నా జీవితం తరించినట్టేగా! అంచేత, నన్ను ఏ పనికైతే శిక్షించారో దాన్ని చెయ్యడానికి నిర్ణయించుకున్నాను. నా ప్రయత్నంలో నెగ్గలేక పోయానన్న సంగతి మీకూ తెలుసు! హాల్లో పట్టుకున్నారు. తాళాలు బాగు చేసేవాడిననే నెపంతో మొదట్లో ఇంట్లోకి వచ్చానని, తర్వాత ఇంటి చుట్టూ పదేపదే తిరిగాననీ, చివరకు ఎవ్వరూ లేకుండా చేసి తాళం పగలగొట్టి...ఏమైతేనేమి లెండి...కథ కంచికి వెళ్లింది! ‘‘అలా అంటే కాదు! మేము నీ తరపున అప్పీలు చేస్తాము. నిన్ను తప్పకుండా వదిలివేస్తారు’’ అని నేనన్నాను. ‘‘వృథా శ్రమ ఎందుకు బాబూ!’’ అని ముసలివాడు అభ్యంతరం చెప్పాడు. ‘‘నాకు జైలు ప్రాప్తి అయిందిగదా’’ అని ఏడ్చేవాడు. ఎవ్వడూ లేడు. పైగా, నాకు జామీను ఎవ్వరుంటారు? ఇంతేకాకుండా నైనా స్మరణ చెయ్యడానికి బయట వుంటే ఎంతో, జైల్లో వున్నా అంతే! ఇందుకు ఏమి జవాబు చెప్పాలో నాకు తోచలేదు. ఇంతలో ముసలివాడు విలక్షణమైన తన శుష్కనేత్రాలతో నన్ను తదేకంగా చూస్తూ ఇలా అన్నాడు: ‘‘ఒక్క సందేహమే నన్ను బాధిస్తుంది. నైనా అంటూ అంటూ అసలు ఒకవ్యక్తి లేదేమో! తాగుడు వల్ల కలిగిన మతిభ్రమణ కారణంగా, ఆ శిలావిగ్రహాన్ని చూసిన క్షణంలో ఈ ప్రణయగాథ అంతా నా పుర్రెలో పుట్టిందేమో!!’’ రష్యన్ మూలం : వెలెరీ బ్రూసోవ్ తెలుగు: నార్ల వెంకటేశ్వరరావు -
నవ చేతనా పాళి నార్ల
తెలుగుజాతిని కదిలించిన చేతనా పాళి నార్ల వెంకటేశ్వరరావు. గడుసుదనమే బాణిగా, వ్యంగ్య చమత్కారాలే పాళిగా, సూటిదనమే శైలిగా తెలుగు పత్రికా రంగాన్ని 5 దశాబ్దాలపాటు ఏలిన సంపాదక శిరోమణి నార్ల వెంకటేశ్వరరావు. 1940వ దశకంలో జాతి పిత మహాత్మాగాంధీ మాటకు తిరుగు లేదు. ఆయన బాటకు ఎదురు లేదు. అలాంటి సందర్భంలో గాంధీ నిర్ణయాన్ని సైతం ప్రశ్నించిన నిర్భీతికలిగిన పాత్రికేయుడు నార్ల. తెలుగు వారంటే చులకన బావమున్న చక్రవర్తుల రాజగోపాలాచారిని 1946లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు గాం«ధీ ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయితే గాంధీ నిర్ణయాన్ని, రాజాజీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ నార్ల ప్రశ్నించి సంచలనం కలిగించారు. 1908 డిసెంబరు 1న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన నార్ల ప్రాథమిక విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగింది. బాల్యం నుండి సామాజిక స్పృహ ఆధికంగా కలిగిన నార్ల వెంకటేశ్వరరావు తన కలంతో సామాజిక రుగ్మతలపై ఆలుపెరగని పోరుసల్పారు. పత్రికా రచనలో నూతన పోకడలకు శ్రీకారం చుట్టి వ్యక్తీకరణను అందులో చొప్పించారు. స్వరాజ్య, జనవాణి, ప్రజామిత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికల ద్వారా తెలుగు జాతిని జాగృతం చేసారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా తెలుగు పత్రికారంగ చరిత్రను కొత్త పుంతలు తొక్కిం చారు. వాడుక భాషకు పట్టం కట్టిన నార్ల పత్రికల్లో ‘బడులు వాడే వాడు బడుద్దాయి’ అని చమత్కరించారు. సంపాదకుడు కాదు ఎడిటర్ అనాలని సరి దిద్దారు. వీఆర్ నార్లగా నాటికలు, కవితలు, చరిత్ర గ్రంథాలు రాశారు. మూఢ విశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ ‘సీతాజోస్యం’ అనే నవల రచిం చారు. జాబాలి, నరకంలో హరిశ్చం ద్రుడు, ద్రౌపది, హిరణ్యకశ్యప వధ అనేవి ఆయన ఇతర రచనలు. ‘మనం మన దాస్యబుద్ధి’ అనే శీర్షికతో ఆయన ఎమర్జెన్సీని విధించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె తనయుడు సంజయ్గాంధీలపై చేసిన సూటి విమర్శ సంచలనం కలిగించింది. 1985 ఫిబ్రవరి 16న ఈ కలం యోధుడు తెలుగు పత్రికా రంగానికి శాశ్వతంగా వీడ్కోలు పలికి తుదిశ్వాస విడిచారు. (నేడు నార్ల వెంకటేశ్వరావు వర్ధంతి) వ్యాసకర్త :డా‘‘ యస్. బాబురావు మొబైల్ : 95730 11844 -
రామాయణం ఎందుకు నిలబడిందంటే...
మానవాతీత వ్యక్తులను కాక, లేదా మానవుల వలె నటిస్తున్న మానవాతీత వ్యక్తులను కాక, మానవులై వుండి, కొన్ని ఆశా నిరాశలకు, రాగ ద్వేషాలకు, కష్ట సుఖాలకు, జయాపజయాలకు నా వలె, మీ వలె, మరొకరి వలె లోనైన వ్యక్తులను మాత్రమే పాత్రలనుగా తీసుకొని, వాల్మీకి తన మహాకావ్యాన్ని రచించాడు. ఆ పాత్రల స్వరూపాన్ని ప్రక్షిప్తాలెంతగా మరుగు పరుస్తున్నా, వాటిలోనుంచి మానవత తొంగి చూస్తూ వుంటుంది కనుకనే, మనలోని మానవతను ఆత్మబంధువు వలె ఆదరంగా అది పలకరిస్తూ వుంటుంది కనుకనే, ఇన్ని శతాబ్దాల తర్వాతైనా వాల్మీకి రచన తన సమ్మోహన శక్తిని కోల్పోలేదు! (తన ఏకాంకిక ‘జాబాలి’కి నార్ల రాసుకున్న పీఠికలోంచి; సౌజన్యం: విశాలాంధ్ర) నార్ల వెంకటేశ్వరరావు