
కనుల పండువగా కల్యాణోత్సవం
వల్లూరు : పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం శ్రీ కామాక్షీ వైద్యనాఽఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వాముల కల్యాణ మహోత్సవాలు కనుల పండువగా జరిగాయి. క్షేత్రాధిపతియైన పరమ శివుని అంశలోని వైద్యనాథస్వామి కల్యాణంతో పాటు క్షేత్ర పాలకుడైన విష్ణు అంశలోని చెన్నకేశవ స్వామి కల్యాణ మహోత్సవం ఒకే రోజు జరగడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. ఉదయం శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపై శ్రీ కామాక్షీ వైద్యనాథుల కల్యాణ మహోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యం వైభవోపేతంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం చింతలపత్తూరు అవధానం చెంచు సుబ్రమణ్యం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కల్యాణోత్సవంలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి స్వామి పాల్గొన్నారు.
రాత్రి కొండపై చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలోని మంటపంలో ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవిలతో శ్రీ చెన్నకేశవుని కల్యాణం వైభవోపేతంగా జరిగింది. ఉభయ దేవేరులతో స్వామివారికి జరిగిన మాంగళ్యధారణ కార్యక్రమాన్ని కనులారా వీక్షించిన భక్తులు భక్తిభావంతో పులకించి పోయారు. ఈ సందర్భంగా కొండ ప్రాంతమంతా లక్ష్మీ చెన్నకేశవ నామ స్మరణతో మార్మోగింది. అనంతరం మిట్టా నారాయణరెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అనంతరం శ్రీ కామాక్షీ వైద్యనాథ స్వామికి, శ్రీ చెన్నకేశవ స్వామికి గజవాహన సేవ నిర్వహించారు.
గరుడ వాహనంపై ఊరేగిన చెన్నకేశవుడు
కాగా గురువారం తెల్లవారుజామున శ్రీచెన్నకేశవ స్వామి తనకు అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి గరుడ వాహన సేవను చూసేందుకు రాత్రంతా పుష్పగిరిలోనే వున్న భక్తులు గ్రామోత్సవంలో స్వామివారిని దర్శించుకుని తరించారు.
నేడు రథోత్సవాలు
బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 4. 30 గంటలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవుల రథోత్సవం జరుగుతుంది.

కనుల పండువగా కల్యాణోత్సవం

కనుల పండువగా కల్యాణోత్సవం

కనుల పండువగా కల్యాణోత్సవం