
గురువుల గర్జన
ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలపై ‘చలో విజయవాడ’ రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన టీచర్లు ప్రభుత్వం తమను దొంగలుగా చూస్తోందంటూ మండిపాటు ఈనెల 10 నుంచి బోధనేతర పనులను బహిష్కరిస్తామని అల్టిమేటం
కారుణ్య నియామకాలు చేపట్టాలి
బెజవాడలో కదంతొక్కిన ఉపాధ్యాయులు
బోధనేతర పనులు బహిష్కరణ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యా, ఉపా ధ్యాయ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది గురువులు బెజవాడలో కదంతొక్కారు. రాష్ట్రంలోని పాఠశాల విద్యారంగంలో చోటు చేసుకున్న సమస్యలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రంలోని 26జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు విజయవాడకు తరలివచ్చారు. ధర్నాచౌక్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు సైతం తరలివచ్చి మద్దతు ప్రకటించారు. గాంధీనగర్లోని అలంకార్ సెంటర్, సాంబమూర్తిరోడ్డుతో పాటుగా ఆపరిసర ప్రాంతాలన్నీ ఉపాధ్యాయులతో కిక్కిరిసి కనిపించాయి.
పాఠాలు చెప్పనివ్వండి మహాప్రభో..
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నేతలు ‘మమ్మల్ని విద్యార్థులకు పాఠాలు చెప్పనివ్వండి మహాప్రభో’ అంటూ ప్రభుత్వానికి విన్నవించారు. బోధనేతర పనులతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్ల పేరుతో ఉపాధ్యాయులకు ఎక్కడా తీరిక లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా యోగాంధ్ర, మెగా పీటీఎం వంటి పనులతో ఉపాధ్యాయులను రోడ్లపైకి తీసుకురావటం వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించవద్దంటూ వారంతా పెద్దపెట్టున విజయవాడ ధర్నాచౌక్లో నినదించారు.
కారుణ్య నియామకాలను చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు నగరంలోని చలో విజయవాడ కార్యక్రమానికి హాజరై తమ సంఘీభావం తెలిపారు. సుమారు 900 మంది కారుణ్య నియమకాల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అలాగే తాము ఆర్థిక ఇబ్బందులతో ఇక్కట్లు పడుతున్నామంటూ వాపోయారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కలిసి తమ సమస్యను వివరించామని, కానీ ఆయన ఆదేశించినా ఇప్పటి వరకూ పరిష్కారం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నెల 10వ తేదీ నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వహించే అన్ని బోధనేతర పనులను బహిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా సంఘాల నేతలు తీర్మానించి పిలుపునిచ్చారు. ప్రధానంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం మినహా మిగిలిన పనులేమి ఉపాధ్యాయులు చేయరని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారులకు మెమోరాండాలు ఇవ్వనున్నారు.

గురువుల గర్జన

గురువుల గర్జన