సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలలో పీఎంకేలో నెలకొన్న వివాదం మరింతగా ముదురుతోంది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్భుమణి మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే. అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు న్యాయ పోరాటంచేసినా ఫలితం శూన్యం. పార్టీ, ఎన్నికల గుర్తు మామిడి పండు అన్బుమణి గుప్పెట్లోకి చేరింది. దీంతో అన్బుమణి మద్దతుదారులు ఎన్నికలలో పోటీ చేస్తున్న చోట్ల రాందాసు వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు.
వన్నియర్ సామాజిక వర్గంతో నిండిన నియోజకవర్గాలలో అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు వ్యాఖ్యల తూటాలను పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన ధర్మపురి నుంచే బయలు దేరనుండడంతో వ్యవహారం ఎలాంలలి రచ్చకు దారితీయబోతున్నదో అన్న ఉత్కంఠ నెలకొంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్బుమణి సతీమణి సౌమ్య అన్బుమణి పోటీ చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా స్వయంగా ప్రచారానికి రాందాసు రంగంలోకి దిగారు.
ప్రచార బాట
సోమవారం ధర్మపురిలో సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు ప్రచారం చేయనున్నారు. 35 ఏళ్లుగా తన భుజాలపై మోసిన పార్టీ, చిహ్నంకు వ్యతిరేకంగా రాందాస్ ప్రచారం నిర్వహించనున్నడం గమనార్హం. రాందాసు మద్దతు దారులకు సిలిండర్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తన అభ్యర్థులకు మద్దతుగా, అన్బుమణి అభ్యర్థులకు వ్యతిరేకంగా రామ్దాసు ప్రచార బాటకు సిద్ధమయ్యారు. సోమవారం ధర్మపురిలో తన కోడలు సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచార సభ నిర్వహించనున్నారు.
కుటుంబ విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో రాందాసు ఎలాంటి వ్యాఖ్యల తూటాలను పేల్చనున్నారో వేచి చూడాల్సిందే. ఆతదుపరి 16న కుంబకోణం. 17న కాట్టుమన్నార్కోయిల్, జయకొండం, 18న తిట్టకుడి, విరుదాచలం, భువనగిరి, 19న చెయ్యార్, పోలూరు, కలసపాక్కం. 20న విక్రవాండి, సెంజి, కీల్పెన్నాత్తూరులలో అన్బుమణి పీఎంకే, మామిడి చిహ్నంకు వ్యతిరేకంగా ప్రచారంకు రాందాసు నిర్ణయించడం గమనార్హం. కాగా ఒకే పారీ్టకి చెందిన తండ్రీకొడుకులు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి, ఒకరిపై ఒకరు ఓట్లు వ్యాఖ్యల తూటాలన పేల్చుకునేందుకు సిద్ధం కావడంతో పీఎంకే కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ధర్మపురిలో ఈ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


