
లోకేశ్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాననుకున్నారు?
అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో వైరల్
నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా? ఈ సినిమా ఆడదని అభిమాన సంఘం నేతపై మండిపాటు
ఎమ్మెల్యే వాయిస్ రికార్డు బయట పెట్టిన అభిమాన సంఘం నేత
లోకేశ్, చంద్రబాబు ప్రోద్బలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్, నందమూరి
అభిమానుల్లో ఆగ్రహం
ఎమ్మెల్యే ఇంటి వద్ద ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన.. ఫ్లెక్సీల చించివేత.. నేడు హైదరాబాద్లో అభిమాన సంఘం నేతల భేటీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం క్రైం: ‘జూనియర్ ఎన్టీఆర్ ఒక బుడ్డా ఫకీర్.. వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తానని అనుకున్నారు.. లోకేశ్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం.. కొడుకు.. వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా.. ఈ సినిమా ఆడదు..’ అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్–2’ సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడుతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతకు ఫోన్ చేసి.. ‘ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు అనుమతించారు.. ఎవరు అనుమతి ఇచ్చారు.. ఎలా ఆడనిస్తారు? ఆ సినిమాను ఆడనిచ్చేదే లేదు.. వాడు బుడ్డా ఫకీర్.. లోకే‹శ్ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం..కొడుకు ఈ టైమ్లో వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా? నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా? ఈ సినిమా ఆడదు.. వాడు బుడ్డా ఫకీర్ గాడు లోకేశ్ గురించి మాట్లాడతాడా? ఈ సినిమా ఆడదు.
నాకు తెలియకుండా సినిమా ఎట్లా ఆడుతుంది.. నేను అనంతపురం ఎమ్మెల్యే.. బుడ్డా ఫకీర్ నా కొడుకు.. సార్ గురించి మాట్లాడతాడా? గాడ్ ప్రామిస్గా చెబుతున్నా.. ఈ సినిమా ఆడదు.. ఆపేయిస్తున్నా.. నేను ఊరుకుంటానా.. పంపించేయండి అందరినీ’ అని హుకుం జారీ చేశారు. లోకేశ్, చంద్రబాబు ప్రోద్భలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు అందులో భాగమేనని నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
వాయిస్ రికార్డ్ బయట పెట్టిన ధనుంజయ నాయుడు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ ఇవ్వబోగా జూ.ఎన్టీఆర్ అభిమాని, టీఎన్ఎస్ఎఫ్ నేత గుత్తా ధనుంజయ నాయుడు ఆయన వాయిస్ రికార్డు బయట పెట్టారు. జూ.ఎన్టీఆర్ను తిడుతూ.. తనను ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన అనంతరం ఆయన ఒక ఆడియోను రికార్డు చేసి ఎమ్మెల్యేకు పంపినట్లు తెలుస్తోంది. ‘అన్నా.. మీరంటే గౌరవం ఉంది. దయచేసి చెబుతున్నా.. ఎవరో చెప్పిన మాటలు విని అలా మాట్లాడవద్దు. జూ.ఎన్టీఆర్కు సినిమా పరంగా ముందు నుంచీ అభిమానిని.
ఈ విషయాన్ని నారా లోకేశ్ ముందు చెప్పమన్నా చెబుతా. అంతేగానీ ఎవరి కోసమో పని చేయలేదు నేను. దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు. సినిమా మీద కాంట్రవర్సీ ఎందుకు? నన్నెందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు? అసభ్యంగా మాట్లాడితే నేను పడను. నాకు ఫోన్ చేసి బెదిరించడం తప్పు. ఎన్టీఆర్ గాడు.. గీడు అని మాట్లాడవద్దు. మీరు నాతో మాట్లాడిన ప్రతిదీ వాయిస్ రికార్డు చేశాను. ఈ రికార్డులన్నీ నారా రోహిత్ అన్నకు పంపినా. నాకు నీవు ఏమైనా అర్ధ రూపాయి ఇచ్చినావా? ఏడాది దాటింది.
ఒక్క పని ఇచ్చావా? చిన్న సహాయం చేశావా? నా మీద నీకేం హక్కుంది మాట్లాడేందుకు? నన్ను చంపుతావా.. చంపు. నన్ను చంపావంటే మా వాళ్లు ఊరికే ఉండరు. నువ్వు నోరు జారినావంటే బాగుండదు’ అని గుత్తా ధనుంజయ నాయుడు ఎమ్మెల్యేకు పంపిన వాయిస్ రికార్డులో పేర్కొన్నారు. దీంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు మరింతగా రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాదులో జూ.ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఉమ్మడి రాష్ట్ర కన్వీనర్లు, ముఖ్య నేతలు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
నీ బండారం బయట పెడతానన్న ప్రభాకర్ చౌదరి
ఎమ్మెల్యే ఆడియో సామాజిక మాధ్యమాల్లోకి రాకమునుపే రెండ్రోజుల ముందు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. దగ్గుపాటి ప్రసాద్ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘నువ్వు జూ.ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడావో నా దగ్గర రికార్డులున్నాయి. నీ బండారం బయటపెడతా’నని హెచ్చరించారు.
ఆగ్రహించిన జూ.ఎన్టీఆర్ అభిమానులు
అనంత ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. ఆదివారం ఉదయం అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైకి దాడికి దిగారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు. ‘అవసరమైనప్పుడు పార్టీకి పని చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఆ విషయం తెలియదా? మీతో ఇలా ఎవరు మాట్లాడించారో చెప్పాలి. మేము కూడా ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు.
అలాంటిది మా అభిమాన నాయకుణ్ని దూషిస్తారా? మాకు రాజకీయాలతో పని లేదు. నాలుగు గోడల మధ్య కూర్చొని క్షమాపణ చెబితే సరిపోదు. బయటకు వచ్చి.. మీరు, మీతో మాట్లాడించిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఇంట్లో ఉండీ బయటకు రావడం లేదని జూ.ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. కొందరు టీడీపీ చోటా నాయకులు కలుగజేసుకుని జూనియర్ అభిమానులకు సర్దిచెప్పారు. కాగా, శనివారం రాత్రే ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో పార్టీ పెద్దల పిలుపు మేరకు ఎమ్మెల్యే దగ్గుపాటి విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది.
ఆ వాయిస్ ఎమ్మెల్యేదే
ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని ఎమ్మెల్యే అంటున్నారు. అది నిజం కాదు. అది ఎమ్మెల్యే వాయిస్సే. అతని వాయిస్ కాదనుకుంటే ఆడియోలో ఇంకో వైపు మాట్లాడింది ధనుంజయ నాయుడు (టీఎన్ఎస్ఎఫ్) వాయిస్ ఫేక్ కాదు కదా?! అంత పెద్ద హీరో తల్లిని అనరాని మాటలు అనడం తప్పు. ఎవరి తల్లి అయినా తల్లే కదా? ఎన్టీఆర్ అభిమాన సంఘాల నేతలు రేపు హైదరాబాద్లో సమావేశానికి పిలుపునిచ్చారు. అధికారం ఉంది కదా అని అనంతపురంలో అభిమాన సంఘం నేతలను, కార్యకర్తలను నోరు మూయించవచ్చు. ప్రభుత్వం మాది.. ఏమైనా చేస్తామంటే కుదరదు. ఇది ఇక్కడితో ఆగదు. ఎమ్మెల్యే కచ్చితంగా మీడియా వేదికగా, అభిమానుల ముందు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. – మహేష్, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని
అనంత ఎమ్మెల్యే ప్రసాద్పై భగ్గుమన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
తిరుపతి మంగళం/నెల్లూరు (బృందావనం)/గాందీనగర్(విజయవాడసెంట్రల్) : జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా వార్–2 విడుదల సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి.. ప్రముఖ హీరోను పట్టుకుని.. అదీ టీడీపీ అభ్యున్నతికి సహకరించిన జూనియర్ ఎన్టీఆర్ పట్ల దారుణంగా మాట్లాడటం ఏమాత్రం క్షమార్హం కాదని మండిపడుతున్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జూనియర్ అభిమానులు తమదైన శైలిలో నిరసన తెలిపారు.
తిరుపతి పరిధిలోని తిమ్మినాయుడుపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ డౌన్ డౌన్.. అంటూ నినదిస్తూ అభిమానులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు సోముయాదవ్, తులసీరామిరెడ్డి, తదితర అభిమానులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్ను హేళన చేస్తూ మాట్లాడడం దారుణం అన్నారు. అసలు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయం.. టీడీపీ నాయకులకు నందమూరి కుటుంబం పెట్టిన భిక్ష అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెల్లూరు జిల్లా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వైఖరిని ఎండగడుతూ జూనియర్ ఎన్టీఆర్ సేవాదళ్ ఫౌండర్ గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు గాలి మధుసూదన్, నగర అధ్యక్షుడు రియాజ్, రూరల్ అ«ధ్యక్షుడు అశోక్, గాలి శ్రీధర్ తదితరులు నర్తకీ సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ జోలికివస్తే సహించేది లేదంటూ బహిరంగంగా హెచ్చరించారు.
జూనియర్ ఎన్టీఆర్ తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గుపాటి ఇలా మాట్లాడడం తగదన్నారు. విజయవాడ గాం«దీనగర్లోని జయరాం థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కనీ్వనర్ నున్న గణేష్ ఆధ్వర్యంలో అభిమానులు భారీ స్థాయిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టారు. ఆపై ఫ్లెక్సీని దహనం చేసి, ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూ.ఎన్టీఆర్కు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభిమానుల సమక్షంలో బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఫ్యాన్స్ సిటీ కనీ్వనర్ కావూరి కృష్ణ, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
సాక్ష్యాధారాలతో బయట పెడతాం
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరం. నోటికి వచ్చిన పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్ను తిడుతూ వార్–2 సినిమా ఆపుతానని, మీరెలా సినిమా ప్రదర్శిస్తారో చూస్తానని, రీల్స్ను తగలబెడతానని, అభిమానులు సినిమాకు వెళ్లరాదని బెదిరించడం దారుణం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై గౌరవం లేని ఇలాంటి ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. పైగా ఆ వాయిస్ తనది కాదని ఎమ్మెల్యే అబద్ధాలు చెప్పడం సరికాదు. ఎమ్మెల్యే ఫోన్ నంబర్ ద్వారా వెలువడిన సంభాషణను సాక్ష్యాధారాలతో బయట పెడతాం. ఇప్పటికైనా అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. – యర్రమల సుధాకర్రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్
ఎన్టీఆర్ సినిమాలు ఆపడం మీతరం కాదు
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు కూడా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు జూ.ఎన్టీఆర్ సినిమాలను ఆపాలనుకుంటే అది మీ తరం కాదు. ఒక ప్రజా ప్రతినిధిగా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్.. బాధ్యత గల స్థానంలో ఉండి అసభ్య పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ప్రజలకు మీరు నేర్పించేది ఇదేనా? ఎన్టీఆర్ను, ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టొద్దు. – పి.పూర్ణ, ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత, ప్రకాశం జిల్లా
తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
జూనియర్ ఎన్టీఆర్ను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నోటికి ఇష్టం వచ్చినట్లుగా దూషించడం అభిమానులకు తీరని మనోవేదన కలిగిస్తోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తక్షణమే స్పందించి ఆ ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి. లేకపోతే భవిష్యత్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – డి.భాస్కర్, టీమ్ తారక్ ట్రస్టు, జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా