
నమోదులో తల్లుల పేర్లు మార్పు
ఒకరికి బదులు వేరొకరికి నగదు జమ
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గౌరవరంలో వైచిత్రి
హెచ్ఎంను ప్రశ్నిస్తే సమాధానం లేదంటున్న తల్లులు
సోమశిల: తల్లికి వందనం పథకం అర్హుల జాబితా రూపకల్పనలో అధికారులు, ఉపాధ్యాయులు చేసిన తప్పిదాలు లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పదుల సంఖ్యలో విద్యార్థులకు ఒకే తల్లిపేరు..ఒక్కరి పేరుతో 20 విద్యుత్ కనెక్షన్లు..విద్యార్థి ఒకరైతే వారికి సంబంధంలేని వారిని తల్లిదండ్రులుగా సూచించడం..ఇలా రోజుకో విచిత్రం వెలుగు చూస్తోంది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గౌరవరంలో ఇలాంటి తప్పిదమే చోటుచేసుకుంది. ఇది చివరికి గ్రామంలోని మహిళల మధ్య వివాదానికి దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే..అనంతసాగరం మండలం గౌరవరంలో 50 మంది విద్యార్థులకు సంబంధించి 30 మంది తల్లులకు నగదు జమకాలేదు. ఆ విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో వారి తల్లుల పేర్ల నమోదులో ఉపాధ్యాయులు చేసిన తప్పిదం పథకానికి దూరమయ్యేలా చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు పడకపోగా ఆ సొమ్ము అనర్హులైన వారి ఖాతాల్లో జమైంది. దీంతో పథకానికి దూరమైన వారంతా, అనర్హులైన వారిని వెళ్లి ప్రశి్నంచారు. మా ఖాతాల్లో పడాల్సిన సొమ్ము, మీకెలా జమయ్యిందంటూ ప్రశ్నించారు. దీంతో వారంతా మమ్మల్ని అడగడానికి మీరెవరు, పోయి ప్రధానోపాధ్యాయుడిని అడగండి అంటూ సమాధానమిచ్చారు. సమాధానానికి సంతృప్తి పడకపోవడంతో వారి మధ్య గొడవలదాకా దారితీసిందని గ్రామస్తులు చెబుతున్నారు.
నా కొడుకు డబ్బు వేరొకరికి
నా కుమారుడు తారకరామ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. మా అబ్బాయి పేరు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో తల్లిగా నా పేరు బదులు వేరొకరి పేరు పొందుపరిచారు. దీంతో మరొకరి ఖాతాలో నగదు జమయ్యింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. – గార్లపాటి సరస్వతి, విద్యార్థి తల్లి
ఇలా చేయడం మంచిది కాదు
నాకు ఇద్దరు పిల్లలు. స్థానిక పాఠశాలలోనే చదువుతున్నారు. ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు చేసేటప్పుడు వివరాలు మార్చారు. దాంతో మాకు పడాల్సిన తల్లికి వందనం డబ్బు వేరొకరి ఖాతాలో జమయ్యాయి. ఇలా పదుల సంఖ్యలో పథకానికి దూరమైనవారున్నారు. – కాలువ అలివేలు, విద్యార్థి తల్లి
గ్రీవెన్స్లో పెట్టుకుంటే నగదు రికవరీ చేస్తాం
రెండు రోజులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివరాలు పరిశీలిస్తున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమకాని వారు సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకుంటే అనర్హుల నుంచి రికవరీ చేసి మళ్లీ అర్హుల ఖాతాలోకి నగదు జమ చేస్తాం. – కాటంరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎంఈఓ–2
రూ.10,900లే!
రణస్థలం: రోజులు గడుస్తున్న కొద్దీ తల్లికి వందనం డబ్బు క్రమేణా తగ్గిపోతూ బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీకి చెందిన దుక్క లక్ష్మి అనే లబ్ధిదారు ఖాతాలో తల్లికి వందనం కింద ఇద్దరు పిల్లలకు కలిపి రూ.26 వేలు జమకావాల్సి ఉండగా, రూ.10,900 మాత్రమే జమ అయ్యాయి. దీంతో ఆమె అవాక్కయ్యారు. దీనిపై సచివాలయానికి వెళ్లి ప్రశ్నించినా లాభం లేకపోయింది. లక్ష్మి చిన్న కుమార్తె షర్మిల 9వ తరగతి చదువుతుండగా, పెద్ద కుమారుడు షారోన్ కుమార్ ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఇతనికి కూడా తల్లికి వందనం ఇంకా పడలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తల్లికి వందనంలో వివక్ష
కొత్తూరు: తల్లికి వందనం పథకం మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపించింది. సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆరి్థక లావాదేవీలు జరుగుతున్నందున పంచాయతీ సర్పంచ్లుగా ఉన్న పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది సర్పంచ్ల పిల్లలకు నగదు అందలేదు. కానీ, కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్–1 ఆర్ఆర్ కాలనీ పంచాయతీ సర్పంచ్, టీడీపీ నాయకుడు అడపాక శంకరరావు ఇద్దరు పిల్లలకు మాత్రం ఈ పథకం మంజూరైంది. ఒక కుమార్తెకు సంబంధించి తండ్రి సర్పంచ్ శంకరరావు పేరున, మరో కుమార్తెకు తల్లి అడపాక రాణి పేరున మంజూరు కావడం మరో విశేషం. వీరు టీడీపీ నాయకులు కాబట్టే డబ్బులు అందాయని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.