breaking news
mnrega
-
ఉపాధి హామీకి పెద్దపీట
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పెద్దపీట వేశారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి అధికంగా నిధులు కేటాయించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఈ పథకానికి రూ. 48 వేల కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ. 38,500 కోట్లు కేటాయించారు. ఈ డబ్బు మొత్తాన్ని ఖర్చుచేస్తే.. ఈ పథకం మీద ఇప్పటివరకు ఖర్చుపెట్టిన అత్యధిక మొత్తం ఇదే అవుతుందని గత బడ్జెట్ ప్రసంగం సమయంలో అరుణ్ జైట్లీ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వెయ్యి కోట్ల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెస్తామని జైట్లీ అన్నారు. 15వేల పంచాయతీలకు పేదరికం నుంచి విముక్తి కల్పిస్తామని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో ప్రతి గ్రామీణ కుటుంబానికి 100 రోజుల ఉపాధి కల్పన వస్తుందని అన్నారు. గత సంవత్సరం నిధులు పూర్తిగా వినియోగించారని మహిళల భాగస్వామ్యం కూడా 48 శాతం నుంచి 55 శాతానికి పెరిగిందని తెలిపారు. -
ఉపాధి హామీ పథకాన్ని అడ్డుకున్న చైనా
న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనల మధ్య భారతీయ వాయుసేన గురువారం లడఖ్ లో సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానాన్ని ల్యాండ్ చేసింది. ఎంఎన్ఆర్ఈజీఏ పథకం కింద జరుగుతున్న పనులను లడఖ్ లో చైనా జవానులు అడ్డుకున్న మరుసటి రోజు ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ల్యాండ్ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన చైనా జవానులు పనులు నిలిపివేయాలంటూ వర్కర్లపై అరిచినట్లు ఓ వార్త సంస్ధ ప్రచురించింది. దీంతో రంగంలోకి దిగిన 70 మంది భారత జవానులు ఆ ప్రదేశానికి వెళ్లి చైనా జవానుల కవాతును అడ్డుకున్నట్లు తెలిసింది. పనుల గురించి అభ్యంతరాలు చెప్పడం, అందుకు వివరణలు ఇవ్వడం జరిగినట్లు ఓ అధికారి తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా ప్రాంతంలోని విమానం ల్యాండయిన ప్రదేశం చైనా బోర్డర్ కు కేవలం 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 4200 అడుగుల పొడవు కలిగిన రన్ వేపై సీ-17ను ల్యాండ్ చేసి అత్యవసర సమయాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోగల సామర్ధ్యం ఉందని వాయుసేన నిరూపించుకుంది. మెచుకా నుంచి రోడ్డు మార్గం ద్వారా డిబ్రూఘర్ కు చేరుకోవాలంటే(500 కిలోమీటర్ల దూరం) కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. ఈ మార్గంలో రోడ్లు తరచూ పాడవుతూ ఉంటాయి. సీ-17 ల్యాండింగ్ పై మాట్లాడిన భారతీయ వాయుసేన అధికారులు రోడ్డు మార్గం క్లిష్టతరంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన వాటిని వేగంగా తరలించేందుకు ఈ సామర్ధ్యం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లలో అత్యధిక ఎత్తు నుంచి విమానాలను ల్యాండ్ చేయడంలో వాయుసేన పాలుపంచుకుంటోంది. -
యంత్రాలకు ‘ఉపాధి’
ఊటకుంటల తవ్వకాల్లో అక్రమాలు కూలీలకు బదులుగా యంత్రాలతో పనులు బినామీ మస్టర్లతో నిధుల స్వాహా అధికార పార్టీ నేతల హవా ఉదయగిరి : గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది.కూలీలకు ఎంపిక చేసిన పనుల ద్వారా ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం నిబంధనలను గాలికొదిలేసింది. కూలీలతో చేయించాల్సిన పనులను యంత్రాలతో చేయించి టీడీపీ కార్యకర్తల జేబులను నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేతల ఒత్తిళ్లను తట్టుకోలేక అధికారులు చేతులెత్తేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టే ఊటకుంటల పనులను యంత్రాలతో చేపడుతూ బినామీ మస్టర్లతో నిధులు స్వాహా చేస్తున్న తంతు ఉదయగిరి నియోజకవర్గంలో య«థేచ్ఛగా సాగుతోంది. ఈ పనులు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుండడం విశేషం. తక్కువ వ్యయంతో ఎక్కువ ఆదాయం వస్తుండడంతో నేతల కన్ను వీటిపై పడింది. ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తుండడంతో అవినీతికి అంతులేకుండా పోతోంది. జిల్లాలో 22,087 ఊటకుంటలు తవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రూ.128.43 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 5467 కుంటల పనులు ప్రారంభించి రూ.10.70 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 791 ప్రస్తుతానికి పూర్తయ్యాయి. జిల్లాలోని 40 మండలాల్లో ఊటకుంటలను తవ్వేందుకు అనుమతులు మంజూరుచేశారు. ఇందులో భాగంగా ఒక్క ఉదయగిరి ప్రాంతానికే పది వేల కుంటలను మంజూరుచేశారు. ఈ పనులను ఉపాధి కూలీలతో చేయించాల్సి ఉన్నప్పటికీ ఉదయగిరి, సీతారామపురం, కలిగిర, వింజమూరు, వరికుంటపాడు, కొండాపురం, తదితర మండలాల్లో యంత్రాలతో పనులు చేస్తున్నారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో పనులు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రివేళల్లో పనులు: యంత్రాలతో పగటిపూట పనులు చేయిస్తే కూలీల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో రాత్రి వేళల్లో తవ్వకాలు చేపడుతున్నారు. పగటి వేళ కొంతమంది కూలీలను పెట్టి తుది మెరుగులు దిద్దుతున్నారు. అనంతరం తమకు అనుకూలమైన గ్రూపులను ఎంపిక చేసుకుని బినామీ మస్టర్లతో నిధులు కాజేస్తున్నారు. ఉదయగిర మండలంలోని తిరుమలాపురం, జి.అయ్యవారిపల్లి, దేకూరుపల్లి, జీ చెర్లోపల్లి, వెంకట్రావుపల్లి, జీ అయ్యవారిపల్లి, వరికుంటపాడు మండలంలోని రామాపురం, కొండాయపాళెం, వరికుంటపాడు, తదితర గ్రామాల్లో ఈ తరహాలతో యంత్రాలతో పనులు చేయించి నిధులు స్వాహా చేస్తున్నారు. పరస్పర సహకారం ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు, నేతలు ముందుగా పరస్పర అవగాహనతో యంత్రాలతో పనులు చేస్తున్నారు. నేతలు ముందుగా యంత్రాలతో నీటి కుంటలను తవ్విస్తారు. ఆ తర్వాత కూలీలతో తుదిమెరుగులు దిద్దుతారు. యంత్రాలతో చేపట్టిన పనుల విషయమై గ్రామస్తులు ఎవరైనా అధికారుల్ని నిలదీస్తే ఆ పనులతో తమకు సంబంధం లేదని, మస్టర్లు వేసేది లేదని చెబుతారు.అంతా సర్దుమణిగిన తర్వాత నెలకో రెండు నెలలకో మస్టర్లు వేసి నిధులు స్వాహా చేస్తారు. ఉదయగిరి మండలం పుల్లాయపల్లిలో యంత్రాలతో నీటికుంటల పనులు చేస్తున్న విషయం తెలుసుకున్న కూలీలు అక్కడికెళ్లి పనులు ఆపివేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్వామా పీడీ అసంతృప్తి ఇటీవల నియోజకవర్గంలోని వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి ప్రాంతాల్లో ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డ్వామా పీడీ హరిత పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి కుంటలను యంత్రాలతో నిర్మించినట్లుగా క్షేత్రస్థాయిలో ఆమె గుర్తించినా ఆ విషయాన్ని బహిర్గతం చేయకుండా కూలీలతో పనులు చేయించాలని, లేకపోతే చర్యలు తప్పవని పరోక్షంగా అధికారుల్ని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా కూలీలతో చేయించాల్సిన ఉపాధి పనులను యంత్రాలతో చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ స్పందించి యంత్రాలతో పనులు చేపట్టకుండా కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు. యంత్రాలతో పనులు చేయిస్తే చర్యలు తప్పవు– వీరాస్వామి, ఎంపీడీఓ, ఉదయగిరి కూలీలతో తవ్వించాల్సిన ఊటకుంటలను యంత్రాలతో చేపడితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. యంత్రాలతో పనులు చేపడుతుంటే కూలీలు తమ దృష్టికి తీసుకురావాలి. ఉపాధి పనులను పారదర్శకంగా చేయించే ప్రయత్నం చేస్తున్నాం. -
అవినీతిని భరించలేక ఇంజనీర్ ఆత్మహత్య
యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పేరుకుపోయిన అవినీతి ఓ యువ ఇంజనీరు ప్రాణాలను బలిగొంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్న సురేష్ (24) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మరణించాడు. ఈ పథకంలో విపరీతంగా పేరుకుపోయిన అవినీతిని సురేష్ ఏమాత్రం భరించలేకపోయాడని, దొంగ బిల్లులు సృష్టించడానికి, ఆమోదించడానికి నిరాకరించి.. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి తండ్రి మారిస్వామి శెట్టి తెలిపారు. చామరాజనగర్ జిల్లాలోని కాగలవాడి గ్రామంలో సురేష్ పనిచేసేవాడు. గ్రామపంచాయతీ సర్పంచి సర్దార్, అతడి భార్య సరోజ, స్థానిక ప్రాజెక్టు అభివృద్ధి అధికారి (పీడీవో) వైరముడి కలిసి దొంగబిల్లులను ఆమోదించాల్సిందిగా సురేష్పై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. సురేష్ అందుకు నిరాకరించడంతో పాటు, వాళ్లు ఇవ్వజూపిన లంచాన్ని కూడా తిరస్కరించాడు. పైనుంచి కూడా దీనిపై ఒత్తిడి రావడంతో ఈ అవినీతిని భరించలేనంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేర్చగా అక్కడ మరణించాడు.