మత్స్యకారులకు ద్రోహం తలపెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు ద్రోహం తలపెట్టొద్దు

Apr 13 2026 7:14 AM | Updated on Apr 13 2026 7:14 AM

కావలి: జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ మత్స్యకారుల బతుకుదెరువు అని, దీన్ని ప్రైవేట్‌ పరం చేసి వారికి ద్రోహం తలపెట్టొద్దని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ పెద్దలకు హెచ్చరికలు చేశారు. దశాబ్దాల కల ఫిషింగ్‌ హార్బర్‌ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాకారం చేశారని, ఇప్పుడు కూటమి పాలకులు మత్స్యకారుల భవిష్యత్‌ను చీకటి మయం చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో మత్స్యకార కాపులు, నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే ఆశయంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నెతోపాటు శ్రీకాకుళం వరకు తీర ప్రాంతంలో మరో 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. జువ్వలదిన్నెలలో రూ.289 కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేశారని, మిగతావి కూడా చివరి దశలో ఉన్నాయన్నారు. పూర్తయిన జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ ఫలాలను మత్స్యకారులకు దక్క కూడదనే దగ్ధతో కూటమి పాలకులు తొలుత ప్రయోగాత్మకంగా ఇక్కడి హార్బర్‌ భూములను సాగర్‌ డిఫెన్స్‌ సంస్థకు అప్పగించిందన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ జాలర్ల బోట్లు మన ప్రాంత మత్స్యకారులపై దాడులకు తెగబడడంతోపాటు వలలు, బోట్లు ధ్వంసం చేసి మత్స్య సంపదను దోచుకుపోతుంటే.. కడుపు మండి ప్రాణాలకు తెగించి నాలుగు బోట్లను పట్టుకుని జువ్వలదిన్నె హార్బర్‌లో పెట్టారన్నారు. అయితే కూటమి నాయకులు ఆ బోట్లను రాజకీయ ప్రయోజనాల కోసం గుట్టుచప్పుడు కాకుండా వదిలేసి మత్స్యకారులకు ద్రోహం చేశారన్నారు. ఈ రెండు అంశాలపై మత్స్యకారులకు భరోసా ఇచ్చేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న జువ్వలదిన్నెకు వస్తున్నారని, 164 గ్రామాల మత్స్యకారులతో ముఖాముఖి చర్చిస్తారని, మత్స్యకారులందరూ తరలిరావాలని ప్రతాప్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సాగర్‌ డిఫెన్స్‌ పరిశ్రమ రావడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే వారికి వేరే చోట స్థలాన్ని సేకరించి పరిశ్రమలు స్థాపి స్తే తాము సంతోషిస్తామన్నారు. అంతేకాని హార్బర్‌ భూమినిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. మత్స్యకారుల భవిష్యత్‌ అయిన జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను కాపాడుకునేందుకు పోరాటం చేస్తామన్నారు.

మత్స్యకారులను ఆదుకున్న వైఎస్‌ జగన్‌

నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు మత్స్యకారులను సంక్షేమ పథకాలతోపాటు ఫిషింగ్‌ హార్బర్లు, అనుబంధంగా ఉపాధి మార్గాలతో ఉదారంగా ఆదుకున్న ఏకై క ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మత్స్యకార నాయకుడు కొమారి రాజు అన్నాడు. జువ్వలదిన్నె హార్బర్‌ అయితే ఈ ప్రాంతంలోని 164 గ్రామాల జీవనాధారమన్నారు. గతంలో మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఏడాదికి రూ.10 వేలను మత్స్యకార భరోసాగా ఇచ్చిన ఆదుకొన్న గొప్ప వ్యక్తి జగనన్న అని అన్నారు. గతంలో అందరికీ కూడా వచ్చేది కాదని, అది కూడా అరకొర మాత్రమే అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వారి బోట్లల్లో జీతాలకు పనిచేయాల్సిన అవసరం లేకుండా స్థానిక మత్స్యకారులే బోట్లు కొనుగోలు చేసుకొని ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందించే విధంగా హార్బర్‌ను నిర్మిస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడానికి సిద్ధమైందన్నారు. అదే జరిగితే మత్స్యకారుల హక్కు అయిన హార్బర్‌లోకి వెళ్లాలంటే మా ఆధార్‌కార్డులు, రేషన్‌ కార్డులు, పాన్‌ కార్డులు చూపించి అడ్డుగు పెట్టే పరిస్థితి వస్తుందని కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో హార్బర్‌ స్థలాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తే ఒప్పుకొనే ప్రసక్తే లేదన్నారు. వైఎస్సార్‌సీపీ కావలి రూరల్‌ మండల కన్వీనర్‌ వాయిల తిరుపతి మాట్లాడుతూ నాలుగు జిల్లాల్లోని మత్స్యకార గ్రామాలకు చెందిన మత్స్యకారుల అంతా జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జువ్వలదిన్నె సర్పంచ్‌ గోవిందస్వామి, ఎంపీటీసీలు శ్రీను, యాదగిరి, వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌ బత్తాని నరసింహం, కొండూరు శ్రీనివాసులు, కొమ్మా గిరి, వాయిల రాధాకృష్ణ, రాంబాబు, గోవింద్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

దశాబ్దాల కల ఫిషింగ్‌ హార్బర్‌ను సాకారం చేసిన వైఎస్‌ జగన్‌

ప్రైవేట్‌ పరం చేసి బతుకును,

భవిష్యత్‌ను చీకటి చేయొద్దు

ఈ నెల 15న మాజీ సీఎం వైఎస్‌

జగన్‌తో ముఖాముఖి భేటీకి తరలిరండి

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి

జువ్వలదిన్నె 164 మత్స్యకార

గ్రామాలకు జీవం

సాగర్‌ డిఫెన్స్‌కు అప్పగిస్తే.. సహించేది లేదు

మత్స్యకార కాపులు, నేతలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement