అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
సిద్దిపేటజోన్: మహాత్మా జ్యోతిబాపూలే జీవితం యువతకు ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక విపంచి ఆడిటోరియంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూలే త్యాగాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని సామాజిక న్యాయం కోసం ముందుకు సాగినట్టు చెప్పారు. అంతకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల మాట్లాడుతూ.. పూలే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహనీయుడన్నారు. మహిళల విద్య ప్రాముఖ్యత గురించి సమాజానికి మొట్టమొదటి సారిగా చెప్పిన మహామనిషి అని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, బీసీ సంక్షేమ అధికారి సయ్యద్ రఫీ పాల్గొన్నారు.
డ్రగ్స్ విక్రయించొద్దు
నార్కోటిక్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు
సిద్దిపేటకమాన్: మెరుగైన సమాజం కోసం జిల్లాలో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు రవాణా చేయొద్దు, విక్రయించొద్దని నార్కోటిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ వినయ్ సుష్మీ పిలుపునిచ్చారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డీఐ వినయ్సుష్మీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఫార్మసీ కళాశాల విద్యార్థులు, ఫార్మసిస్టులతో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజం, మందుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ వినోద్బాబ్జి, డ్రగ్ అసోసియేషన్ ప్రతినిధులు అయిత సత్యం, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సిద్దేశ్వర్, శివ తదితరులు పాల్గొన్నారు.
‘సురక్ష నేత్ర’కు సహకరించాలి
అడిషనల్ డీసీపీ సుభాష్చంద్రబోస్
నంగునూరు(సిద్దిపేట): ‘సిద్దిపేట సురక్ష నేత్ర’కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్చంద్రబోస్ కోరారు. శనివారం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో సర్పంచ్, ఉపసర్పంచ్లు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నంగునూరు మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణ కోసం రహదారులు, ప్రధాన వీధులు, గ్రామ ప్రవేశ, నిష్క్రమణ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు బిగించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐలు వివేక్, తిరుపతి, సర్పంచ్లు పాల్గొన్నారు.
‘ఉపాధి’ పథకాన్ని
పునరుద్ధరించాలి
డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి
కొండపాక(గజ్వేల్): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి డిమాండ్ చేశారు. కుకునూరుపల్లి మండల పరిధి కోనాయిపల్లి, మేదినీపూర్, చిన్న కిష్టాపూర్, పీటీ వెంకటాపూర్, రాయవరం గ్రామాల్లో కొనసాగుతున్న చెరువుల పూడికతీత పనులను పరిశీలించారు. కూలీలతో ముఖాముఖీ నిర్వహించారు. సరైన వసతులు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పలు గ్రామాల్లో ఇందిరమ్మ పథకంలో నిర్మించిన ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తూం శ్రీకాంత్రెడ్డి, నాయకులు రవీందర్, సంతోష్రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.


