ఏసీపీ రవీందర్రెడ్డి
బెజ్జంకి(సిద్దిపేట): గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రజలకు మరింత భద్రత ఉంటుందని ఏసీపీ రవీందర్రెడ్డి అన్నారు. సర్పంచ్లు, యువకులకు స్థానిక పోలీసులు శనివారం నిర్వహించిన సురక్ష నేత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక సత్యార్జున ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నిఘా నేత్రాలతో ప్రతి కదలికను గుర్తించి అసాంఘిక శక్తుల ఆటకట్టించవచ్చన్నారు. ప్రతి గ్రామంలో కనీసం ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య, ఏఎస్ఐ ఓదేలు, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అవగాహన అవసరం
మిరుదొడ్డి(దుబ్బాక): సీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు ‘సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా దుబ్బాక సీఐ రాజేశ్ ఆధ్వర్యంలో భూంపల్లి పోలీస్స్టేషన్లో మండల పరిధిలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు సీసీ కెమెరాలపై అవగాహన కలిగించారు. సీసీ కెమెరాలపై అవగాహన ఉండాలన్నారు. తమ గ్రామా ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని పలువురు సర్పంచ్లు ముందుకు వచ్చారు. కార్యక్రమంలో ఎస్ఐ హరీశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


