ఎండుతున్న పంటల సంరక్షణకు ఆదేశం
ములుగు(గజ్వేల్): ఎండిపోతున్న పంట పొలాల సంరక్షణకు చర్యలు చేపట్టాలన్న రైతుల విజ్ఞప్తిపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. కొండపోచమ్మ కాలువ ద్వారా కర్కపట్ల, కొట్యాల, అల్లీనగర్, అడవి మజీద్, నర్సంపల్లి, క్షీరసాగర్, జప్తిసింగాయిపల్లి గ్రామాలకు నీటిని విడుదల చేసి సంరక్షించాలని ఇరిగేషన్ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి గురువారం రైతుల వేదనను కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే ఆయన చొరవ తీసుకుని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డీఈ అంజలి, ఏఈ లు మాజీ డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డితో కలిసి సుమారు 20 కిలోమీటర్ల మేర కాలువను పరిశీలించారు. శుక్రవారం ఆయా గ్రామాల పంట పొలాలకు సాగునీరందేలా నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నట్లు అంజిరెడ్డి తెలిపారు. సాగు నీటి విడుదలకు కేసీఆర్ చొరవ తీసుకుని సమస్య పరిష్కరించడంపై ఆయా గ్రామాల రైతులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు.


