● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కొయ్యాన శ్రీవాణి
రాజాం: మహిళలపై పెత్తనం చెలాయించి, రౌడీయిజం చేసే అధికారం కూటమి నాయకులకు ఎవరిచ్చారని మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కొయ్యాన శ్రీవాణి ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్త దాడిలో గాయాలపాలైన సారథి గ్రామానికి చెందిన నిర్మలను ఆమె స్వగృహంలో ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆమెకు, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తూ, అక్కడ నుంచే ఫోన్లో రాజాం పోలీసులతో మాట్లాడారు. దాడి జరిగి మూడు రోజులు గడుస్తున్నా నిందితుడు టీడీపీ కార్యకర్త అడపా శ్రీనును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వ్యక్తి ఎంతటివాడైనా సరే శిక్షించాలని.. నిర్మలపై దాడిచేసిన అడపా శ్రీనుపై గతంలో కూడా కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై ఎస్పీని కలిసి బాధితురాలికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామన్నారు. అనంతరం ఆమె ఇంటివద్ద పలువురు మహిళలతో కలిసి దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. నిర్మలపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో మహిళలపై దాడి చేసే వారిని దిశ చట్టం ద్వారా కఠినంగా శిక్షించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి పాలనలో మహిళలకు న్యాయం జరగడం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకురాలు అల్లెన జయలక్ష్మి, పలు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


