
కొనుగోళ్లలో కొర్రీలు రైతన్న వెతలు
అల్లాదుర్గం(మెదక్): అన్నదాతలు దగా పడుతున్నారు. యాసంగి ధాన్యం విక్రయించేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట విక్రయంలో కొర్రీలు పెడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. లారీ లోడ్ ధాన్యం లేదని.. రైస్మిల్లు టార్గెట్ అయిపోయిందని.. మ్యాచర్ రాలేదని.. ఇలా రకరకాల సాకులు చెబుతుండటంతో లబోదిబోమంటున్నారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ కొనుగోలు కేంద్రంలో పీఏసీఎస్ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వర్షాలతో మ్యాచర్ రాక అవస్థలు పడుతుంటే, మరో వైపు మ్యాచర్ వచ్చినా, లారీ ధాన్యం లేదంటూ కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారి మ్యాచర్ చెక్ చేసి వచ్చిందని చెప్పి 10 రోజులు గడిచినా.. ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. కొనుగోలు చేయమని అధికారులు, పీఏసీఎస్ చైర్మన్ను వేడుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయమై పీఎసీఎస్ సిబ్బందిని వివరణ కోరగా.. కేంద్రంలో 100 బస్తాలు మాత్రమే ఉన్నాయని, లారీ లోడ్ లేదని, అందుకే కొనుగోలు చేయడం లేదని తెలిపారు. స్థానిక రైస్మిల్లు వారు టార్గెట్ అయిపోయిందని ధాన్యం బస్తాలు దించుకొవడం లేదన్నారు. సిద్దిపేట మిల్లుకు బస్తాలు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
లారీ లోడ్ ఉంటేనే కొంటామని షరతు
మ్యాచర్ రాలేదని మెలిక
లబోదిబోమంటున్న అన్నదాత