మల్హర్: ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన తాడిచర్ల–భూపాలపల్లి రహదారి నిర్మాణానికి అటవీశాఖ నుంచి ఫేజ్–2 అనుమతులు రావడంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేశారు. మరోవైపు రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభం కానుండటంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కాటారం మీదుగా భూపాలపల్లి..
మండల కేంద్రం తాడిచర్ల నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం కాటారం మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. తమ ప్రాంతం నుంచి పెద్దతూండ్ల మీదుగా అటవీ ప్రాంతం గుండా రహదారి నిర్మిస్తే ఎంతో సమయంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లే వారు కూడా ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకోవాల్సి వస్తుంది. ఏడాది క్రితం తాడిచర్ల–ఖమ్మంపల్లి గ్రామాల మధ్య మానేరు నదిపై వంతెన అందుబాటులోకి రావడంతో దూరభారం తగ్గింది. 2017 సంవత్సరంలో ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి అనుమతి వచ్చింది. ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. మిగతా రోడ్డు నిర్మాణం కోసం అటవీ అనుమతులు రాకపోవడంతో అక్కడికే నిర్మాణాన్ని నిలిపివేశారు.
రూ.4.67 కోట్ల చెల్లింపు..
రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రోడ్డు నిర్మాణానికి మోకాలడ్డిన అటవీ శాఖ ఎట్టకేలకు ఒక వరస రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్రావుపల్లి నుంచి అటవీప్రాంతం గుండా భూపాలపల్లి వన్ ఇంకై ్లన్ మైన్ వరకు ఏడు మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టవచ్చని.. ఆ ప్రాంతంలో తాము నష్టపోతున్న చెట్ల సంపదకు గాను రూ.4.67 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిధులు చెల్లించడంతో ఫారెస్ట్ నుంచి ఫేజ్–2 అనుమతులు వచ్చాయి. ఫారెస్ట్ అధికారులు త్వరలోనే చెట్లను తొలగించనున్నారు. కిషన్రావుపల్లి నుంచి భూపాలపల్లి సమీపంలోనే వన్ఇంక్లైన్ వరకు 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి అధికారులు రూ.15 కోట్లతో టెండర్లు పిలిచారు. ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
తగ్గనున్న దూరభారం..
మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లాలంటే కాటారం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఖమ్మంపల్లి–తాడిచర్ల మీదుగా కేవలం 30 కిలోమీటర్లలోనే భూపాలపల్లికి చేరుకోవచ్చు. ప్రస్తుతం నిత్యం వందలాది వాహనాలు మంథని మీదుగా సుదూర ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే సగం దూర భారం తగ్గనుండటంతో విద్య, వైద్యం మరింత మెరుగు పడనుంది. సమయంతో పాటు ఇంధన ఖర్చులు భారీగా ఆదా కానున్నాయి.
విద్య, వైద్యానికి చేరువవుతాం..
కిషన్రావుపల్లి ఫారెస్ట్లో రోడ్డు నిర్మిస్తే విద్యార్థులకు ఉన్నత చదువులు, మెరుగైన వైద్యానికి ఆస్పత్రులకు వెళ్లడానికి అనువుగా ఉంటుంది. ప్రయాణ భారం తగ్గుతుంది.
– బోడ్డు తిరుపతి, పెద్దతూండ్ల, మల్హర్
కిషన్రావుపల్లి రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ లైన్ క్లియర్
పూర్తయిన టెండర్ ప్రక్రియ
త్వరలోనే పనులు ప్రారంభం
తగ్గనున్న దూర భారం
అనుమతులు వచ్చేశాయి..
అనుమతులు వచ్చేశాయి..