
నేటి ప్రజాదివస్ రద్దు
భూపాలపల్లి: ఎస్పీ కార్యాలయంలో నేడు (సోమవారం)నిర్వహించే ప్రజా దివస్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాను. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాదివస్ కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఫిర్యాదుల నిమిత్తం జిల్లా పోలీస్ కార్యాలయానికి రావద్దని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత ప్రజాదివస్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
హామీలను
నెరవేర్చాలి
రేగొండ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డులను ఆదివారం మండలంలోని కనిపర్తి, నాగుర్లపల్లి గ్రామాలలో ఇంటింటికి పంచారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహేందర్, భద్రయ్య, రాజు, అర్ఙున్, సుధాకర్, అంకూస్ పాల్గొన్నారు.
కారు బోల్తా
చిట్యాల: భూపాలపల్లి నుంచి మొగుళ్లపల్లి వెళ్తుండగా అదుపుతప్పి కారు బోల్లా పడిన ఘటన మండలకేంద్రంలోని క్రోసూరుపల్లి గ్రామశివారులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన కారు డ్రైవర్ కురిమిళ్ల మహేష్ పని నిమిత్తం భూపాలపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. క్రోసూరుపల్లి గ్రామశివారులో గల ప్రధాన రోడ్డు వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నాడు.
పిడుగు పాటుతో
ఎద్దు మృతి
కాటారం(మహాముత్తారం): పిడుగుపాటుతో ఎద్దు మృతి చెందిన ఘటన మహాముత్తారం మండలం బోర్లగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. జంగెపల్లి వెంకటరాజయ్య అనే రైతుకు చెందిన ఎద్దు ఇంటి సమీపంలోని పొలంలో మేత మేస్తుంది. వర్షం కురుస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎద్దుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఎద్దు విలువ సుమారు రూ.50వేల వరకు ఉంటుందని బాధిత రైతు వెంకటరాజయ్య తెలిపారు. ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని వెంకటరాజయ్య కోరారు.
విద్యుదాఘాతంతో..
కాటారం: విద్యుదాఘాతంతో గేదె మృతిచెందిన ఘటన ఆదివారం మండలంలోని ఇబ్రహీంపల్లిలో చోటుచేసుకొంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నాగుల రాజయ్య అనే రైతుకు చెందిన గేదె మేత కోసం గ్రామ పరిసర ప్రాంతానికి వెళ్లగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ రూ.50 వేల వరకు ఉంటుందని గేదె ఇచ్చే పాలతో ఉపాధి పొందుతున్నట్లు బాధిత రైతు రాజయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం విద్యుత్శాఖ ద్వారా పరిహారం అందించి ఆదుకోవాలని రాజయ్య వేడుకున్నారు.
యువతి అదృశ్యం
టేకుమట్ల: యువతి అదృశ్యమైన ఘటన మండలంలోని రామకిష్టాపూర్(వి)లో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతి ఆదివారం ఉదయం టైలర్ షాపునకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లేకపోవడంతో యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కుమారస్వామి తెలిపారు.

నేటి ప్రజాదివస్ రద్దు

నేటి ప్రజాదివస్ రద్దు

నేటి ప్రజాదివస్ రద్దు