ద్వారకాతిరుమల: అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావును, ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈఓగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నియామకానికి సంబంధించిన జీఓ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. రాజమహేంద్రవరం ఆర్జేసీగా పనిచేస్తున్న ఆయన్ను గతేడాది డిసెంబర్ 9న అన్నవరం దేవస్థానం ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. అయితే ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓగా పనిచేసిన ఎన్వీఎస్ఎన్ మూర్తి గతేడాది డిసెంబర్ 31తో పదవీ విరమణ పొందగా, అప్పటి ఇదే దేవస్థానంలో డీఈఓగా పనిచేస్తున్న యర్రంశెట్టి భద్రాజీ ఇన్చార్జి ఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్రినాథరావు ఈఓగా బాధ్యతలు చేపట్టిన తరువాత, భద్రాజీ మళ్లీ డీఈఓగా ఇదే దేవస్థానంలో కొనసాగుతారు.
టి.నరసాపురం: బంగారం, వెండి ఆభరణాల చోరీపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ ఎం.రాజు తెలిపారు. ఏపిగుంట గ్రామానికి చెందిన యిర్ల సత్యనారాయణ ఈ నెల 10న భార్యతో కలిసి జంగారెడ్డిగూడెంలో బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లారు. తిరిగి ఈ నెల 11న ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని 24 గ్రా. బంగారం, 1050 గ్రా. వెండి ఆభరణాలు అపహరణకు గరైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


