‘నూతన భవనం’ పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకం (ఇన్సెట్లో)
● గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో పోలీస్ స్టేషన్లు
● గత ప్రభుత్వ గుర్తులను
చెరిపేస్తున్న వైనం
సాక్షి, టాస్క్ఫోర్స్: గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం గ్రామ స్వరాజ్యం నెరవేర్చేందుకు స్వగ్రామంలోనే పాలన ప్రజల ముంగిటకు తీసుకొచ్చారు. ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు అన్ని కలిపి దాదాపు 250 నిర్మించారు. నాడు–నేడు పథకంలో భాగంగా ఎన్నో పాఠశాలలు ఆధునికీకరించారు. వంతెనలు, రోడ్లు నిర్మించారు.
కూటమి చర్యలతో విస్మయం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పెదపాడులో నిర్మించిన సచివాలయాన్ని, పెదవేగిలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని గురువారం పోలీస్ స్టేషన్లుగా మార్చి ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. అయితే ఈ చర్యలతో గ్రామీణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలు చేపట్టలేదని చెబుతున్నారు. ప్రజలకు సేవలను అందించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని పోలీస్ స్టేషన్లుగా మార్చి ప్రారంభించడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
500కు పైగా శిలాఫలకాలు ధ్వంసం
ఈ రెండు ప్రభుత్వ కార్యాలయాలపై గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి స్థానిక ప్రజాపతినిధుల పేర్లు ఉన్న శిలాఫలకాలను కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే ధ్వంసం చేశారు. అంతే కాకుండా నియోజకవర్గంలో దాదాపు 500పైగా శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా ‘నూతన భవనం’ అనే పేరుతో ప్రారంభోత్సవం చేయడం ఏంటి? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పెదవేగిలో పోలీస్ సర్కిల్ ఆఫీస్గా మారిన రైతు భరోసా కేంద్రం


