ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని దివ్యకల్యాణ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయంలో స్వామి వారిని పెండ్లి కుమారుడిగా, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేశారు. అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్ధుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికను ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించారు. అనంతరం సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి ఈ తంతును నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఈఓ వై.భద్రాజీ, సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


