
ఇకపై చెత్త నిర్వహణ బాధ్యత ప్రైవేట్కు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ జంట నగరాలు పెరుగుతున్న చందంగానే సిటీ కార్పొరేషన్లో చెత్త సేకరణ, నిర్వహణ పెను సవాల్గా మారింది. జంట నగరాల్లో నిత్యం వందలాది టన్నుల చెత్త సేకరిస్తారు. దీని నిర్వహణకు పాలికె కొత్త మార్గానికి శ్రీకారం చుట్టింది. ఆ రోజు చెత్తను ఆరోజే నిర్వహణ చేసేలా బాధ్యతలను ప్రైవేట్ వారికి అప్పగిస్తూ పాలికె నిర్ణయం తీసుకుంది. ఇది తొలి ప్రయత్నంగా చెబుతున్నారు. జంట నగరాల్లో చెత్త నిర్వహణ సమర్థవంతంగా లేదు. దీంతో ఎక్కడ చూసినా పర్వతాల్లా చెత్త కుప్పలే కనిపిస్తుంటాయి. ఎన్నో దశాబ్దాల నుంచి చెత్త గుట్టలను కరిగించడానికి సాధ్యం కాక వాటిని బయో మైనింగ్ చేస్తున్నా అటు ధార్వాడ, హొసయల్లాపుర, అలాగే హుబ్లీ కార్వార రోడ్డులో చెత్త రాశులు పేరుకు పోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రాశులు తరగడం లేదు. ప్రస్తుతం దీన్ని బయో మైనింగ్ ద్వారా కరిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కొద్ది మేర సత్ఫలితాన్ని సాధించారు.
రోజూ 500 టన్నుల చెత్త సేకరణ
ఈ నేపథ్యంలో ప్రతి రోజు హుబ్లీలో 300 టన్నులు, ధార్వాడలో 150 టన్నులు మొత్తం కలిపి 450 నుంచి 500 టన్నుల చెత్త సేకరణ అవుతోంది. దీని నిర్వహణ పాలికెకు క్లిష్టంగా మారింది. బయో మైనింగ్ ద్వారా ఇంతకు ముందు సేకరించిన చెత్తను కరిగించినా కూడా ప్రతి రోజు 450 టన్నుల చెత్త సేకరణ అవుతూనే ఉంది. దీంతో చెత్త కరిగిన చందంగానే పెరుగుతోంది కూడా. రోజు సేకరించే చెత్తను శాసీ్త్రయంగా నిర్వహణ చేయాలని పాలికె సంకల్పించింది. ఇదే విషయాన్ని తమ సలహా, సూచనగా గ్రీనరీ ట్రిబ్యునల్ మండలి కూడా పేర్కొంది. కాగా రోజు పేరుకు పోయే 450 టన్నుల చెత్తను డంపింగ్ యార్డ్కు తరలిస్తారు. దీన్ని ఆ రోజే యార్డ్లో చెత్త పడగానే ఉన్న చెత్త సంస్కరణ పూర్తి కావాలన్న షరతుతో ప్రైవేట్ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించారు. తడి, పొడి చెత్తను ప్రత్యేకించి డంపింగ్ యార్డ్లో వేస్తారు. ఇందులో పొడిచెత్తను సేంద్రీయ ఎరువుగా సంస్కరిస్తారు. అలాగే పొడి చెత్తను సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపడానికి అనువుగా సంస్కరించి సేకరించి పెడతారు.
ఏడాదిపాటు ప్రైవేట్ వారికి కాంట్రాక్ట్
ఈ మేరకు ఓ ఏడాది పాటు ఈ చెత్త నిర్వహణ యూనిట్ను ప్రైవేట్ వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సంబంధిత యూనిట్ పాలికె ఇంజినీర్ సంతోష్ యర్రంగళి మీడియాకు తెలిపారు. హుబ్లీలో 300 టన్నుల సామర్థ్యం గల యూనిట్, ధార్వాడలో 150 టన్నుల సామర్థ్యం గల యూనిట్లు ఉన్నాయి. ఆ రోజు చెత్త ఆ రోజే సంస్కరణ చేస్తే ఎటువంటి చెత్త సమస్య తలెత్తదు. దీంతో రోజు ఉత్పత్తి అయ్యే రెండు ప్లాంట్లలో నిర్వహణకు నిర్ణయించారు. ఆ మేరకు హుబ్లీలోని 300 టన్నుల సామర్థ్యం గల యూనిట్ నిర్వహణను రూ.9 కోట్లకు, అలాగే ధార్వాడ చెత్తను రూ.6 కోట్ల టెండర్కు ఇవ్వడానికి ప్రతిపాదించారు. ఈ విషయమై పాలికె సాధారణ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి పంపుతాం. అక్కడి నుంచి అనుమతి లభించిన తర్వాత టెండర్లు పిలుస్తామన్నారు. మొత్తం మీద 30–40 ఏళ్లుగా వేధిస్తున్న ఈ చెత్త నిర్వహణ పెను సమస్యకు ఇప్పటికై నా పరిష్కారం లభిస్తే అదే పది వేలు అని జంట నగరాల వాసులు అభిప్రాయపడ్డారు.
ఏ రోజు చెత్త ఆరోజే సేకరణ, నిర్వహణ
హుబ్లీ–ధార్వాడ మహానగర పాలికె నిర్ణయం