
రేప్ కేసులో ఎమ్మెల్యేకు ఊరట
దొడ్డబళ్లాపురం: అత్యాచారం కేసులో బెంగళూరు ఆర్ఆర్ నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. మునిరత్న, అతని అనుచరులు అత్యాచారం కేసులో ముందస్తు బెయిలు కోరుతూ కోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన కోర్టు వారిపై పోలీసులు బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణని జూన్ 2కి విచారణ వాయిదా వేసింది.
మైక్రో వేధింపులు..
మాజీ జవాన్ ఆత్మహత్య
యశవంతపుర: రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ మైక్రోపైనాన్స్ సంస్థల వేధింపులు తగ్గడం లేదు. డెత్నోటు రాసి విశ్రాంత జవాన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడగు జిల్లా మడికెరిలో జరిగింది. మాజీ జవాన్ దేవజన జగదీశ్ (56) మడికెరిలో నివాసం ఉండేవాడు. డబ్బు అవసరాల కోసం కొన్ని మైక్రో ఫైనాన్స్ల నుంచి అప్పులు తీసుకున్నాడు. వాటిని వెంటనే తీర్చాలని సిబ్బంది సతాయించసాగారు. దీంతో జగదీశ్ డెత్నోటులో ఆర్థిక సమస్యలతో పాటు మైక్రో పైనాన్స్ సిబ్బంది వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. ఓ గోదాములో తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.
రాష్ట్ర పోలీసుకు
కేంద్ర పోలీసు వంచన
యశవంతపుర: పెళ్లి చేసుకొంటానని నమ్మించి రాష్ట్ర మహిళా పోలీసు కానిస్టేబుల్ను లైంగికంగా వాడుకుని మోసం చేసిన కేంద్ర రిజర్వు కానిస్టేబుల్ బాగోతమిది. మోసగానిపై బెంగళూరు రాజాజీనగర పోలీసులు కేసు నమోదు చేశారు. యాదగిరి జిల్లాకు చెందిన సంజీవ చవాన్ నిందితుడు, ఓ మహిళ కానిస్టేబుల్తో సంజీవ్ ప్రేమాయణం నడిపారు. ఇద్దరూ యాదగిరి జిల్లాకు చెందినవారు కావడంతో పరిచయం మొదలై ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెతో సంజీవ్ షికార్లకు వెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. పెళ్లి చేసుకుందామని మహిళా పోలీసు కోరగా, అతడు తప్పించుకు తిరగసాగాడు. ఆమె నిలదీయటంతో నీ ప్రైవేటు ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించసాగాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా, రాజాజినగర పోలీసులు నిందితునికి విచారణకు రావాలని నోటీసులు పంపారు.
శ్రీకంఠేశ్వరునికి కానుకల వెల్లువ
మైసూరు: మైసూరు జిల్లాలో దక్షిణ కాశీగా పిలువబడే నంజనగూడులోని శ్రీకంఠేశ్వరస్వామి ఆలయానికి ఈ త్రైమాసికంలో భక్తుల నుంచి నగదు కానుకలు విరివిగా లభించాయి. రూ. 1.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఆలయ దాసోహ భవన్లో హుండీల లెక్కింపు జరిగింది. మహిళా స్వయం సహాయక బృందాలకు చెందిన వంద మందికి పైగా మహిళలు నగదు లెక్కింపులో పాల్గొన్నారు. దేవస్థానం ఏఈ జగదీష్, ఆలయ ఈవో సతీష్, తలకాడు వెంకటేష్ ప్రసాద్, బ్యాంకు సిబ్బంది ఉన్నారు. నగదు, బంగారం సొత్తు రూపంలో రూ.కోటిన్నర ఆర్జన లభ్యమైంది.
సర్కారీ బడికి జడ్జి పుత్రుడు
తుమకూరు: ప్రభుత్వ పాఠశాల అంటే పేదల పిల్లలు మాత్రమే చదివించుకుంటారని అనుకుంటారు. అధికారులు, ధనవంతులైతే ఇటు వైపు కన్నెత్తి చూడరు. లక్షల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేటు స్కూల్లో చదివించాలనుకుంటారు. మధ్యతరగతి కుటుంబాలు కూడా అప్పు చేసైనా ప్రైవేటు స్కూళ్లకే పంపుతారు. ఇలాంటి భావన ప్రబలిపోయిన నేటి సమాజంలో.. ఓ మహిళా జడ్జి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. శిర పట్టణ సీనియర్ సివిల్ జడ్జి జరీఫాబాను తమ కుమారుడు ఆజాద్ను ప్రభుత్వ కన్నడ మీడియం పాఠశాలలోని 5వ తరగతిలో చేర్పించారు. ఈ పాఠశాలలో 350 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో ఎల్కేజీ నుంచి 7వ తరగతి వరకు విద్యాబోధన ఉంది. ఇంగ్లిష్, కన్నడ మీడియం రెండూ ఉన్నాయి. న్యాయమూర్తి చొరవకు తాలూకా వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
కమల్ క్షమాపణ చెప్పాలి: మంత్రి
దొడ్డబళ్లాపురం: కన్నడ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు కమల్ హాసన్ కన్నడిగులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన సినిమాలు కర్ణాటకలో నిషేధిస్తామని కన్నడ, సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తండగడి అన్నారు. శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కమల్ క్షమాపణ చెప్పకపోతే వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే ఫిలిం చాంబర్తో, నటుడు శివ రాజ్కుమార్తో చర్చించామని, ఆయన కూడా అర్థం చేసుకోవాలన్నారు. కన్నడ భాష విషయంలో రాజీ అయ్యే ప్రశ్నే లేదన్నారు.
అహంకారమే
శివమొగ్గ: తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని చెబుతూ కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసిన నటుడు కమల్హాసన్పై కఠిన చర్యలు తీసుకోవాలని శివమొగ్గలోని డీసీ కార్యాలయం ఎదుట కరునాడు రక్షణ వేదిక నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. ఆయన కన్నడ భాషకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి, కానీ ఇలా మాట్లాడడం అహంకారానికి పరాకాష్ట అని ఆరోపించారు. తొందరపాటు ప్రకటనలు చేయడం ద్వారా రాష్ట్రాల మధ్య గందరగోళం సృష్టించకూడదని అన్నారు.