
కాంగ్రెస్ వల్లే మత కలహాలు పెచ్చు
హుబ్లీ: వర్గాల మధ్య ధ్వేష వాతావరణం సృష్టించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మాజీ సీఎం, బెళగావి ఎంపీ జగదీష్ శెట్టర్ ఆరోపించారు. హావేరిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి మత కలహాలు పెరిగాయన్నారు. దీంతో ఓ వర్గం కాంగ్రెస్ కార్యకర్తలకు విరక్తి పుట్టిందని మంగళూరు ఘటనను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఒక మెసేజ్కు ఓ వర్గం వేలాది మంది యువకులు గుమిగూడతారన్నారు. అప్పటి కమిషనర్ ముందస్తు చర్యలు తీసుకోక పోవడంతో పెను ముప్పు జరిగిందన్నారు. మంగళూరులో ప్రతీకార హత్యలు జరుగుతున్నాయి. హావేరి గ్యాంగ్ రేప్ నిందితులు ఊరిలో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మొత్తం మీద నిందితులకు చట్టంపై భయం లేని వాతావరణం కాంగ్రెస్ సర్కారు వల్ల నెలకొందన్నారు. పీఎఫ్ఐ కార్యకర్తల కేసు రద్దు చేసినందుకు గతంలో కేజీ హళ్లి, డీజీ హళ్లి అల్లర్లు జరిగాయి. మైనార్టీలను ఆకర్షించేందుకు మంత్రి వర్గంలో ఇష్టమొచ్చినట్లుగా కేసుల రద్దు నిర్ణయాలను తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. ఇక మీదటైనా ఇలా జరగరాదు. హైకోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానన్నారు.
ధార్వాడలో కోవిడ్ కేసు నమోదు
హుబ్లీ: ధార్వాడ జిల్లాలో ఓ కోవిడ్ కేసు నమోదైంది. కోవిడ్ లక్షణాలతో 71 ఏళ్ల మహిళ జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని జిల్లా యంత్రాంగం ఓ ప్రకటనలో పేర్కొంది.
నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయండి
హుబ్లీ: విధాన పరిషత్లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు అర్హులైన వ్యక్తులను ఎంపిక చేసి నామినేట్ చేయడానికి సిఫార్సు చేసే గురుతర బాధ్యత మీదేనని సీఎం సిద్దరామయ్యకు విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ హొరట్టి సూచించారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఓ లేఖ రాశారు. రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా అర్హులైన వ్యక్తులను ఎంపిక చేయాలన్నది తన అభిలాష అని తెలిపారు. రాష్ట్రంలో మంచి పనులను చేసి సీఎం ప్రజల మనసులో ఆదరణ చూరగొన్నారు. సాహిత్యం, సంగీతం, కళలు, సాంస్కృతిక, విద్య, పత్రికా రంగం, సమాజ సేవ తదితర రంగాల్లో సాధకులను ఈసారి నామినేట్ చేస్తారని తాను నమ్ముతున్నానని తెలిపారు.
పర్మినెంట్ చేయాలని ఒత్తిడి
రాయచూరు రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సంఘం జిల్లా సంచాలకులు శ్రీశైల నాయక డిమాండ్ చేశారు. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద అధికారికి వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. నవోదయ, మొరార్జి దేశాయి, రాణి కిత్తూరు చెన్నమ్మ, మైనార్టి పాఠశాలకు ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసి, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు.
మున్సిపల్ ఉద్యోగుల ధర్నా విరమణ
హొసపేటె: తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో పాటు 19 డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నీటి సరఫరా మినహా అన్ని సేవలను నిలిపివేసి గత 4 రోజుల నుంచి మున్సిపల్ కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక ధర్నాను శనివారం మున్సిపల్ ఉద్యోగులు విరమించుకున్నారు. రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘం విజయనగర జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర వర్మ మాట్లాడుతూ నెల రోజుల్లోగా తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. సల్మాన్ శేషన్న, రవికుమార్, భారతి, ఈరన్న, సురేష్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
నడిరోడ్డులో గుంత..
ప్రయాణికులకు చింత
హొసపేటె: నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పక్కనే ఉన్న బసవణ్ణ కాలువ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చారు. దీనిని మెరుగు పరచనందున గుంతలు పడి ప్రతి రోజూ వేలాది మంది విద్యార్థులను తీసుకెళ్లే వాహనదారులు, ఆటోలు, కార్లు ప్రయాణికులు ఇప్పుడు ప్రాణభయంతో ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే నియంత్రణ కోల్పోయి బసవణ్ణ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం రోడ్డు పన్నుతో సహా అన్ని రకాల పన్నులను వసూలు చేస్తోంది. కానీ వాటి నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. నగరంలోని రోడ్లపై ఉన్న గుంతలను సంబంధిత అధికారులు వెంటనే మూసివేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ వల్లే మత కలహాలు పెచ్చు

కాంగ్రెస్ వల్లే మత కలహాలు పెచ్చు