రాయచూరు రూరల్ : జిల్లాలో మత్తు పదార్థాలను మందుల దుకాణాల్లో విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య సూచించారు. గురువారం తన కార్యాలయంలో మందుల దుకాణాల వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిస కారాదన్నారు. యువతకు మత్తు పదార్థాలు విక్రయించే ముందు వైద్యుల సలహాలను పాటించాలన్నారు. మత్తు పదార్థాల సేవనంతో అనారోగ్యానికి తోడు మానసికంగా కుంగిపోతారన్నారు. సమావేశంలో ఏఎస్పీ హరీ్ష్, డీఎస్పీ శాంతవీర, సీఐలు ఉమేష్ నారాయణ కాంబ్లే, మహేష్, సాబయ్యలున్నారు.
వ్యక్తి అదృశ్యం
హొసపేటె: తాలూకాలోని 32వ వార్డు బాణదకేరిలోని గరడిమనె నివాసి కే.వెంకటేష్(57) అనే వ్యక్తి ఈనెల 10వ తేదీ నుంచి అదృశ్యం కావడంపై టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని తలకు గాయమై మానసిక అనారోగ్యంతో ఉన్నాడు. చాలా చోట్ల చికిత్స చేయించినా పూర్తిగా నయం కాలేదు. 5.4 అడుగుల ఎత్తు, గుండ్రని ముఖం, ముదురు రంగు శరీరఛాయ గల ఇతను కనిపించకుండా పోయినప్పుడు లేత నీలం రంగు పుల్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంటు ధరించాడు. కన్నడ భాషలో మాట్లాడగలడు. ఇతని ఆచూకీ తెలిసిన వారు పట్టణ పోలీస్ స్టేషన్ను లేదా సెల్– 9480805745, 08394–224033, 224204 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
గంజాయి విక్రయం.. నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో హైడ్రో గంజాయిని విక్రయిస్తున్న కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అభిరామ్ ఎల్ వరసిద్ధి వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గంగావతిలో అక్రమంగా సరఫరా చేస్తున్న రూ.18.06 లక్షల విలువైన 1.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. థాయిలాండ్ నుంచి భారత్కు అక్రమంగా గంజాయిని తెప్పించుకొన్న కేరళకు చెందిన భాగస్వాములు సౌజేష్(28), సలీం(27), దుర్గా ప్రసాద్(27), బాద్షా(32), మదన్ (26), సూర్యప్రతాప్రెడ్డి(19), మహ్మద్ హమీద్(22), మణికంఠ(23)లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మిఠాయిలతో విద్యార్థులకు స్వాగతం
రాయచూరు రూరల్: జిల్లాలో గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు మిఠాయిలతో స్వాగతం పలికారు. 2025–26వ విద్యా సంవత్సరానికి సంబంధించి తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ తాలూకాలోని బిజినగేర, విజయ నగర క్యాంప్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అందాల్సిన పుస్తకాలు, యూనిఫాం, ఇతర సౌకర్యాలను కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
బాలిక ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దొడ్డబళ్లాపురం పట్టణ పరిధిలోని దర్గాపురలో చోటుచేసుకుంది. బీహార్కు చెందిన ధర్మేంద్రకుమార్ దర్గాపురలోని పిళ్లేగౌడ అనే వ్యక్తికి చెందిన తోటలో నివాసం ఉంటోంది. ధర్మేంద్ర సమీపంలోని రైల్వేస్టేషన్లో సిమెంటు మూటలు అన్లోడ్ చేసే పని చేస్తుండగా భార్య గార్మెంట్స్ ఫ్యాక్టరీకి వెళ్తోంది. వీరికి నలుగురు సంతానం. రెండవ కుమార్తె చాందిని కుమారి(12) మానసిక రోగంతో బాధపడుతుండేది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు పనులకు వెళ్లగానే ఇంట్లో తమ్ముడిని బయటకు పంపించి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

దుకాణాల్లో డ్రగ్స్ విక్రయిస్తే ఖబడ్దార్