
ఇద్దరిని బలిగొన్న ఆర్టీసీ బస్సు
తుమకూరు: కేఎస్ ఆర్టీసీ బస్సు, బైకును ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. జిల్లాలోని తిపటూరు తాలూకా మత్తిహళ్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. బస్సు ఢీకొని అయ్యనబావి నివాసులు ఉమేష్ (32), రజనీకాంత్ (33) మరణించారు. మత్తిహళ్లి గ్రామంలో కూలిపనులు చేసుకుని స్వగ్రామానికి వాపసు వస్తున్నారు. ఆ సమయంలో తిపటూరు వైపు నుంచి కుందాపుర వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు వారిని నేరుగా ఢీకొనింది. ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడే కన్నుమూశారు. బస్సు డ్రైవర్పై హొన్నవళ్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనాస్థలిలో కుటుంబాల రోదనలు మిన్నంటాయి.
వరద ప్రాంతాల్లో సమీక్ష
● మంత్రులకు సీఎం ఆదేశం
శివాజీనగర: రాష్ట్రంలో వర్షంతో హానికి గురైన ప్రాంతాలకు తక్షణమే వెళ్లి సమీక్ష చేయాలని సీఎం సిద్దరామయ్య, జిల్లా ఇన్చార్జి మంత్రులకు, కార్యదర్శులకు ఆదేశించారు. ఈ నెల 30, 31న అన్ని జిల్లాధికారులు, జిల్లా పంచాయితీ సీఈఓ తదితరులతో వర్ష హాని గురించి సమావేశం అవుతానని తెలిపారు. వరద నష్టాల గురించి బుధవారం సీఎం సమీక్ష చేశారు. వరద బాధిత జిల్లాల్లో ప్రమాదాలు జరగకుండా సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు.
170 తాలూకాలకు హాని
రాష్ట్రంలో 170 తాలూకాలు వరద బీభత్సానికి గురైనట్లు సర్కారు తెలిపింది. బెంగళూరు పాలికె పరిధిలో 201 స్థలాలు వరదలకు గురయ్యాయి. మే 26 వరకు వర్షంతో రాష్ట్రంలో 45 ఇళ్లు కూలిపోగా, 1385 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చినట్లు సీఎంఓ తెలిపింది.
మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం వాయిదా!
శివాజీనగర: చాలా రోజులుగా ఎదురు చూస్తున్న బెంగళూరు మెట్రోలో ఎల్లో లైన్లో సంచారానికి మళ్లీ ఆటంకం ఏర్పడింది. సిగ్నలింగ్లో సమస్య వచ్చినట్లు బీఎంఆర్సీఎల్ తెలిపింది. ఆర్వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు సంచరించే ఎల్లో మార్గంలో మెట్రో రైలు సర్వీసులు జూన్ నుంచి మొదలవుతాయని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు కూడా అదే ఆశతో ఉన్నారు. కానీ సిగ్నలింగ్లో సమస్య రాగా దీనిని సరిచేసేందుకు నెల రోజులు కావాల్సి ఉంది. అందుచేత జూన్లో ఆరంభం అనుమానమేనని తెలిసింది. ఈ మార్గంలో రైలు పరీక్షలు పూర్తయ్యాయి, రైల్వే మండలి ఆమోదం తెలిపింది. ఫైనల్ దశ పరిశీలన కోసం త్వరలోనే మెట్రో రైలు సురక్షతా కమిషనర్ రావాల్సి ఉంది. ఇంతలో సిగ్నలింగ్లో సాంకేతిక లోపం బయటపడింది. సిగ్నలింగ్ కాంట్రాక్ట్ను చేపట్టిన సీమెన్స్ నిపుణులు ఇటీవల సిగ్నలింగ్ వ్యవస్థను తనిఖీ చేశారు. ఆ సమయంలో సాఫ్ట్వేర్ డేటా సెట్లలో లోపం కనిపించింది.
పొగాకు ఉత్పత్తులపై వేటు
యశవంతపుర: ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ–సిగరెట్, వేపింగ్ సాధనాలను, హుక్కాను నిషేధించినట్లు నగర పోలీసు కమిషనర్ బి.దయానంద తెలిపారు. మాల్లు, కాఫీ బార్లు తదితరాలలో నిత్యం తనీఖీలు చేయాలని పోలీసులకు సూచించారు. పొగాకు ఉత్పత్తుల వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్లు తీసుకోవాలన్నారు. ప్రజలలో కూడా జాగృతి తీసుకురావాలన్నారు. 2024–25లో బెంగళూరు నగరంలో సిగరెట్లతో పాటు పొగాకు కేంద్రాలపై 57,130 కేసులను నమోదు చేసి రూ.80.8 లక్షలు జరిమానాలు విధించినట్లు తెలిపారు. విశ్వ ధూమపాన దినం సందర్భంగా ఈ నెల 27వ నుంచి జూన్ 2 వరకు విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇద్దరిని బలిగొన్న ఆర్టీసీ బస్సు