
చక్కెర కర్మాగారం కోసం ధర్నా చేస్తాం
హొసపేటె: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హొసపేటెలో చక్కెర కర్మాగారం ప్రారంభిస్తామని చెప్పిన వారు ఇంత వరకు కర్మాగార నిర్మాణం పనులు చేపట్టలేదని, ఈ విషయంపై రైతు సంఘం తరఫున నిరవధిక సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తామని రైతు సంఘం నేత కటిగి జంబయ్య తెలిపారు. హొసపేటె ప్రెస్ హౌస్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత రెండేళ్ల నుంచి ఇలాంటి అబద్ధ హామీలు ఇస్తున్నారన్నారు. మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ హొసపేటె రైతు సంఘం అధ్యక్షుడికి ఫోన్ చేసి ఈ సాధన సమావేశంలో హొసపేటెలోని చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించే విషయంపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని హామీ ఇచ్చారు. రైతుల దీర్ఘకాల డిమాండ్ అయిన చక్కెర కర్మాగారం స్థాపన తేదీ, ప్రదేశంపై బహిరంగ సమావేశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆ రోజు జరిగిన సాధన సమావేశంలో ఎటువంటి ప్రకటన లేక వాగ్దానం చేయలేదన్నారు. రైతుల చిరకాల డిమాండ్ అయిన చక్కెర కర్మాగారం స్థాపనకు ఎటువంటి చర్య తీసుకోనందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్, ఎమ్మెల్యే హెచ్ఆర్.గవియప్ప తీరును హొసపేటె రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. 15 రోజుల లోపు ముఖ్యమంత్రి సిద్దరామయ్య చక్కెర కర్మాగారం ఏర్పాటు, నిర్మాణంపై ప్రకటన చేయాలని లేని పక్షంలో నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతు నేతలు ఉత్తంగి కొట్రేష్, జోగయ్య, యల్లప్ప తదితరులు పాల్గొన్నారు.