
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త అరెస్ట్
లక్ష్మీపురం: వ్యసనాలకు అలవాటు పడిన భర్తను వదిలి పుట్టింట్లో ఉంటూ పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్న మహిళను ఆమె భర్త కత్తి పొడిచి గాయాలపాలు చేశాడు. నిందితుడిని పట్టాభిపురం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కోబాల్డ్పేటకు చెందిన మెరిగల రాజేష్, కల్పనకు 2014లో వివాహం అయింది. రాజేష్ పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే కొంతకాలంగా రాజేష్ వ్యసనాలకు అలవాటు పడి మద్యం సేవిస్తూ భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక కల్పన ఏడాది క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలను పోషించేందుకు చంద్రమౌళినగర్లోని సంస్థలో చిరు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే రాజేష్ మద్యం సేవించి పిల్లలు కావాలంటూ, కాపురానికి రావాలంటూ భార్య పని చేసే ప్రదేశానికి వెళ్లి వేధిస్తుంటాడు. ఈ నేపథ్యంలో గత నెల 25న రాత్రి ఆమె పనిచేసే ప్రదేశానికి వెళ్లి వాగ్వివాదానికి దిగిన రాజేష్ వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి తీవ్ర గాయాలపాలు చేశాడు. దీన్ని గమనించిన స్థానికులు కల్పనను హుటాహుటిన జీజీహెచ్కు తరలించారు. సమచారం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలో విచారించి, బాధితురాలు కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాడు. నిందితుడు ఉడాయించడంతో అతనికోసం గాలింపు చేపట్టారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ తరంగిణిలకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి కోబాల్డ్పేట 7వ లైన్లో నిందితుడు ఉన్నట్లు తెలియడంతో మెరిగల రాజేష్ను అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించి సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.