
ఎమ్మెల్సీ కార్యాలయంలో కారు చోరీ చేసిన దొంగ అరెస్టు
లక్ష్మీపురం: ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో కారు చోరీ చేసి పరారైన ఘటనలో వ్యక్తిని అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నట్టు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ శుక్రవారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 28వ తేదీన కడప జిల్లా కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామానికి చెందిన పనకనపల్లి రాంప్రసాద్ రెడ్డి 2009–2014 వరకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్కు చెందిన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ కార్యాలయంలో డ్రైవర్గా పనిచేశాడు. అక్కడ నుంచి హైదరాబాద్లో ఓలా క్యాబ్, అలాగే మరి కొన్ని చోట్ల డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం సాగించాడు. ఆర్థిక పరిస్ధితులు అనుకూలంగా లేని కారణంగా మరలా తిరిగి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వద్ద పనిచేసేందుకు ఈనెల 28వ తేదీన గుంటూరు విద్యానగర్లోని రాజేంద్రప్రసాద్కు చెందిన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ సంస్థకు చెందిన వైస్ చైర్మన్ సాంబశివరావు వద్దకు వచ్చి పని కావాలని అడిగాడు. ప్రస్తుతం పనిలేదని ఆయన చెప్పాడు. కొద్ది రోజుల తరువాత చూద్దాం అని చెప్పడంతో కడప నుంచి వచ్చానని, రెండు రోజుల ఇక్కడే ఉండి వెళ్తానని చెప్పాడు. గతంలో ఉన్న పరిచయాల వల్ల ఆఫీస్ వద్దనే ఉన్నాడు. అయితే అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ డ్రైవర్గా పని చేసే సంతవరపు నాగార్జున ఏపీ 07జెడ్ 2137 నంబర్ గల కారును కార్యాలయం వద్ద పార్కింగ్ ప్రదేశంలో పెట్టి తాళాలు కార్యాలయంలో పెట్టి వాచ్మెన్కు చెప్పి వెళ్లిపోయాడు. తరువాత రాత్రి ఒంటి గంట సమయంలో హైదరాబాద్ ఉన్న రాంప్రసాద్రెడ్డి కారును, వాచ్మన్ సెల్ఫోన్ను చోరీ చేసి పరారైయ్యాడు. దీంతో కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో చోరీ చేసిను కారులో ఉన్న రాంప్రసాద్రెడ్డి కారును ఆపి పారిపోయే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు రాంప్రసాద్రెడ్డిని అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న ప్రియురాలిని కలసి, కారు తిరిగిద్దామని వస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు అంగీకరించాడు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, క్రైం సిబ్బంది ఆంజనేయులు, ప్రసాదరావు, శ్రీనివాసరావును జిల్లా ఎస్పీ అభినందించారు.
వివరాలు వెల్లడించిన వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్