
ఒత్తిళ్లు .. వేధింపులు.. ‘కార్పొరేట్’ హత్యలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఒత్తిడి విద్యార్థులను చంపేస్తోంది. భారీగా వసూలు చేసే ఫీజులు ఒకవైపు, మరోవైపు మార్కుల కోసం పోటీ విద్యార్థులపై ఒత్తిడి పెంచేస్తోంది. ఇటీవల కాలంలో రాజధాని ప్రాంతంలో ఏర్పాటైన ప్రైవేటు యూనివర్సిటీల్లో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆ మరణాలను పోలీసులు ఆత్మహత్య కేసులుగా నమోదుచేసి వాటి దర్యాప్తును మరుస్తున్నారు. ఒకవేళ సదరు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆ విద్యాసంస్థల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి దర్యాప్తు జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఈ మరణాలకు గల కారణాలు తేల్చడంలో పూర్తిగా విఫలం అవుతోంది. ఈ సంవత్సర కాలంలోనే ఈ ప్రాంతాల్లో వున్న పేరుగాంచిన పలు విద్యాసంస్థల్లో ఇలాంటి మరణాలు సంభవించాయి.
సంవత్సర కాలంలో ఘటనలు..
తాజాగా ఫీజు చెల్లించలేదని నిలదీయడంతో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన సుభాష్(20) యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తన తండ్రి వచ్చి ఫీజు చెల్లిస్తారని చెప్పినా వినకుండా అవమానించడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడాడు.
●తాడేపల్లిలో ఒక ప్రైవేటు యూనివర్సిటీ విద్యార్థి విజయవాడలో ఉన్న తన తండ్రికి నేను చనిపోతున్నాను, నన్ను క్షమించండి అంటూ లేఖ రాసి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
●ఇది జరిగిన రెండు రోజులకే వడ్డేశ్వరంలోని ఓ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
●ఇదే వర్సిటీలో అనంతపురానికి చెందిన మరో విద్యార్థి కూడా ఇదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
మానసిక ఒత్తిడి వల్లే..?
కొంతమంది విద్యార్థులు మానసిక ఒత్తిడి వల్లే ఇలా జరుగుతుందని, విద్యాసంస్థలు సెమిస్టర్ పరీక్షలు జరిగిన సమయంలో యాజమాన్యం బాగా ఒత్తిడికి గురిచేస్తోందని, మార్కులు తక్కువ వస్తే అదనంగా ఫీజు చెల్లించాల్సి వస్తుందని బెదిరిస్తోందని, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జరిగిన సంఘటనలపై పోలీసులు, ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి, విద్యార్థుల మరణాల పట్ల నిజనిజాలు తేల్చాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు కోరుకుంటున్నారు.
ప్రైవేటు యూనివర్సిటీల్లో
విద్యార్థుల వరుస మరణాలు
ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్న
విద్యాసంస్థలు
వంతపాడుతున్న పోలీసులు
తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా
తూతూ మంత్రంగా దర్యాప్తు
వేధింపులే కారణమంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
లాభార్జన కోసం కోర్సులను రుద్దుతున్నారు
రాష్ట్రంలో, దేశంలో కంపెనీలకు అనుగుణంగా విద్యాసంస్థలు విద్యను అందించాలి. దానికి విరుద్ధంగా కార్పొరేట్ విద్యాసంస్థలు వారి లాభార్జన కోసం విద్యార్ధులపై తమ కోర్సులను రుద్దుతున్నారు. దాంతో కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు అందించే సమయంలో పోటీతత్వం ఎక్కువైంది. దానిని తట్టుకునేందుకు కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీలు నిర్వీర్యమై కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఏర్పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించి అవసరమైన కోర్సులలో శిక్షణ ఇచ్చి, విద్యార్థులో వున్న ప్రతిభను గుర్తించి విద్యను అందిస్తే ఆత్మహత్యలు జరగవు.
– ప్రొఫెసర్ బూరగ శ్రీనివాసరావు
తల్లుల రోదన సైతం పట్టదు..
రాజధానిలో తమిళనాడుకు చెందిన ఓ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వారి తల్లిదండ్రులు కాలేజీకి వచ్చి తమ బిడ్డ మరణానికి కారణం చెప్పాలని, తమ కూతురికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, మీ వేధింపుల వల్లే చనిపోయిందంటూ కాలేజీ వద్ద మృతురాలి తల్లి ధర్నా నిర్వహించారు. అక్కడ వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా ఆమెను బయటకు నెట్టివేశారు. కాలేజీలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను చూపించాలన్నా యాజమాన్యం ఒప్పుకోలేదు.
మంగళగిరి రూరల్ పరిధిలో రెండు రోజుల క్రితం తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి తన రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య అని యాజమాన్యం అంటుంటే తల్లిదండ్రులు కాదని వాదించినా ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఇప్పటి వరకు ఆ విద్యార్థి ఆత్మహత్య గల కారణాలు తేల్చలేదు.
కాకినాడ జిల్లా, రాజోలుకు చెందిన ఓ విద్యార్థిని హోం సిక్పై ఇంటికి వెళ్లి, రాత్రికి రాత్రి అక్కడి నుంచి బస్సు ఎక్కి, విజయవాడ బస్టాండ్ నుంచి తాను ఉంటున్న కుంచనపల్లిలో రూమ్కు వచ్చే దారిలో ఓ విద్యార్థితో గొడవపడింది. రెండు గంటల అనంతరం ఆ విద్యార్థిని తాను ఉంటున్న అపార్ట్మెంట్లో కిటికీకి ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆ విద్యార్థినితో గొడవపడిన మరో విద్యార్థి ఎవరు? వారి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అతనివల్ల చనిపోయిందా? ఇతర కారణాల వల్ల చనిపోయిందా అన్నది పోలీసులు ఇప్పటి వరకు తేల్చలేదు. ఆ విద్యార్థినికి తండ్రి లేకపోవడంతో తల్లి ఆ కేసు గురించి మొదటి రోజు తన బిడ్డ చావుకు కారణం తేల్చాలని మాట్లాడినా, రెండవ రోజు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగలేమంటూ తేల్చి చెప్పేసింది.

ఒత్తిళ్లు .. వేధింపులు.. ‘కార్పొరేట్’ హత్యలు