నగర మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర | - | Sakshi
Sakshi News home page

నగర మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర

Apr 29 2025 7:09 AM | Updated on Apr 29 2025 7:09 AM

నగర మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర

నగర మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర

63 మంది సభ్యులకు

61 మంది హాజరు

ఇద్దరు వైఎస్సార్‌ సీపీ

సభ్యులు గైర్హాజరు

కూటమి అభ్యర్థి కోవెలమూడికి

34, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి

అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు

నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ 7వ మేయర్‌గా టీడీపీ నుంచి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సోమవారం ప్రిసైడింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవ తేజ ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు మేయర్‌ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఎక్స్‌ అఫీషియో సభ్యులు కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యేలు మహ్మద్‌ నసీర్‌, డాక్టర్‌ బి.రామాంజనేయులు, గల్లా మాధవి, కార్పొరేటర్లు హాజరయ్యారు. ముందుగా ఎన్నికల అధికారి సభ్యుల హాజరు సేకరించారు. సమావేశానికి 61 మంది హాజరవ్వగా, కోరం సగ భాగం ఉన్నందున ప్రిసైడింగ్‌ అధికారి మేయర్‌ ఎన్నికకు సంబంధించి టీడీపీ నుంచి కోవెలమూడి రవీంద్ర, వైఎస్సార్‌ సీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి పోటీలో ఉన్నారని ప్రకటించారు.

రవీంద్రకు 34, వెంకటరెడ్డికి 27 ఓట్లు..

కోవెలమూడి రవీంద్రను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి.రామాంజనేయులు ప్రతిపాదించగా 13 డివిజన్‌ కార్పొరేటర్‌ సంకూరి శ్రీనివాసరావు బలపరిచారు. అచ్చాల వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ప్రతిపాదించగా 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ యక్కలూరి మారుతి బలపరిచారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్రకు 34, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. అత్యధిక ఓట్లు వచ్చిన టీడీపీ అభ్యర్ధిర్థి కోవెలమూడి రవీంద్ర మేయర్‌గా విజయం సాధించినట్లు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించి, ఽధ్రువీకరణ పత్రం అందించి, మేయర్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం రవీంద్ర మేయర్‌ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ పులి శ్రీనివాసులు, అదనపు కమిషనర్‌ చల్లా ఓబులేసు, కౌన్సిల్‌ సెక్రటరి బి.శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్‌.శ్రీనివాస్‌, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్‌ పద్మనాభరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement