
ప్రధాని సభకు చకచకా ఏర్పాట్లు
తాడికొండ: మే 2వ తేదీన అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఆదివారం గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, పలువురు ఐపీఎస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పర్యటన నిమిత్తం 11 పార్కింగ్ ప్రాంతాలు, 8 రోడ్లు గుర్తించి ఆయా రహదారులలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ఎస్టీజీ కమాండోల భద్రతలోకి ఈ ప్రాంతం వెళ్లనున్నట్లు సమాచారం. హెలీప్యాడ్, సభావేదిక, వీవీఐపీల పార్కింగ్ రూట్ మ్యాప్లను పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేటాయించడంతో సంబంధిత అధికారులు దగ్గరుండి మరీ పనులు కొనసాగిస్తున్నారు. ప్రధాని సభకు దాదాపు 120 ఎకరాలు కేటాయించారు. ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 80 శాతం పనులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.