
గుండెపోటులోనూ సడలని గుండె నిబ్బరం
బద్వేలు అర్బన్ : బద్వేలు – మైదుకూరు రహదారిలోని చెన్నంపల్లె సమీపంలో బుధవారం ఓ ఆటోడ్రైవర్ ఆటో నడుపుతూ గుండెపోటు రావడంతో ఆటోలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం రెడ్లదిన్నె ఎస్సీ కాలనీకి చెందిన గొల్లపల్లె పెంచలయ్య (33) కూలి పనులకు వెళ్లడంతో పాటు ఆటో తోలుకుని జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి 15 సంవత్సరాల క్రితం జిల్లాలోని ఖాజీపేట మండలం ముత్తులూరుపాడు గ్రామానికి చెందిన మరియమ్మతో వివాహం కాగా వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. నెల రోజుల క్రితం భార్యాభర్తల నడుమ మనస్పర్ధలు రావడంతో మరియమ్మ పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో పెంచలయ్య బుధవారం ఉదయం స్వగ్రామం నుండి బయలుదేరి ముత్తులూరుపాడుకు వచ్చాడు. అక్కడ భార్యతో మాట్లాడి పెద్ద కుమారుడిని తన వెంట తీసుకుని ఆటోలో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో కొందరు ప్యాసింజర్లను సైతం ఆటోలో ఎక్కించుకున్నాడు. అయితే చెన్నంపల్లె సమీపంలోకి వచ్చేసరికి పెంచలయ్యకు గుండెపోటు వచ్చి ఆటోలోనే ఒరిగిపోయాడు. ఇంతలో ఆటోలోని ప్యాసింజర్లు కిందికి దించి సపర్యలు చేసినప్పటికీ స్పృహలోకి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి పెంచలయ్యను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటు వచ్చినప్పటికీ ఆటోను రోడ్డు పక్కన నిలపడంతో అందులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
ఆటో నడుపుతూ డ్రైవర్ మృతి